ఏ దేశంలోనైనా అన్నదాత ఆగర్భశత్రువుగా ఉన్నాడా? ఇది కన్నారా? విన్నారా? కానీ భారతదేశంలో మాత్రం మోదీ ప్రభుత్వ దృష్టిలో రైతన్న ఓ బద్ధశత్రువు. మోదీ వైరివర్గంలో మేధావులు, పాత్రికేయులు, పౌరహక్కుల కార్యకర్తలు, మైనారిటీలు, రాజ్యాంగాన్ని గౌరవించే వారితోపాటు తాజాగా రైతులూ చేరారు. అందుకే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైతులపై ఒక పెద్ద యుద్ధాన్నే ప్రకటించింది. పంజాబ్హర్యానా సరిహద్దులోని ఖనౌరీ వద్ద యుద్ధవాతావరణాన్ని చూస్తే ప్రభుత్వ మొండివైఖరి, నియంతృత్వ విధానాలు అర్థం కాక మానవు. 2021లో రైతుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు నాలుగు అబద్ధాలు చెప్పి, తప్పించుకొని, ఇప్పుడు చేయిచ్చిన మోదీ ప్రభుత్వంపై రైతులు మరో ఉద్యమాన్ని ప్రకటించిన విషయం సర్వవిదితమే. గత కొన్ని రోజులుగా దిల్లీకి సమీపంలోనూ, పంజాబ్
హర్యానా సరిహద్దుల్లో రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. రైతు బాధను అర్థం చేసుకోవడంలో విఫలమైన మోదీ సర్కారు నిర్దయగా వ్యవహరిస్తోంది. బుధవారంనాడు ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు రెచ్చిపోయారు. ఖాకీజులుం కళ్లముందు కన్పించింది. లాఠీలనే కత్తులుగా వాడి రక్తపాతం సృష్టించారు. భరించలేక అన్నదాతలు రాళ్లతో ఎదురుదాడి చేశారు. ప్రతిగా పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి, అతి సమీపం నుంచి రైతులను లక్ష్యంగా చేసుకున్నారు. పోలీసులు ఒక పెద్ద సైన్యంలా విరుచుకుపడ్డారు. కురుక్షేత్రాన్ని తలపించేలా ఊహించనిరీతిలో బలగాలను మోహరించారు. శాంతిభద్రతల పేరుతో ఎలాగైనా రైతులను చెదరగొట్టాలన్న స్పష్టమైన ఆదేశాలు ముందురోజు రాత్రే ఉండటంతో ఆవురావురమంటున్న లాఠీలకు పనిచెప్పి ఆకలి తీర్చుకున్న పోలీసులు రోజంతా ఆగమాగం చేశారు. శంభు సరిహద్దు సైతం యుద్ధక్షేత్రాన్ని తలపించింది. ఖాకీల దాడిలో ఓ యువరైతు మృత్యువాత పడ్డాడు. నెలలపాటు పొలంలో కాపుకాసి పండిరచిన పంటకు గిట్టుబాటు ధరలేక, అల్లాడిపోయి తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించిన ఆ యువరైతు రబ్బరు తూటాలకు బలయ్యాడు. 21 ఏళ్ల శుభ్కరణ్ సింగ్ అనే ఈ యువరైతు పంజాబ్లోని భటిండా జిల్లా వాసి. ఈ దాడిలో 25 మందికిపైగా రైతులకు బలమైన గాయాలు తగిలాయి. ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా, వారిలో శుభ్కరణ్ ప్రాణాలు వదిలాడు. పోలీసుల తీవ్ర దాడికి రైతులు ఛిన్నాభిన్నమై, పరుగులు తీయాల్సివచ్చింది. వృద్ధరైతులను బాష్పవాయు గోళాల నుంచి కాపాడే ప్రయత్నంలో వెనుకబడిపోయిన ఈ యువరైతు తలకీ, ఛాతికీ, వీపుకీ బాష్పవాయు గోళాలతోపాటు రబ్బరు తూటాలు అత్యంత బలంగా తగిలాయి. కొన్ని తూటాలు శరీరం లోపలికి దూసుకుపోయాయి. రైతులకు న్యాయం జరగాలంటూ తన ఆఖరి కోరికను చెపుతూనే తుదిశ్వాస విడిచాడు. రైతుల దయనీయ పరిస్థితికి ఇది అద్దంపడుతోంది.
దిల్లీ సమీపంలో ఉద్యమిస్తున్న రైతులకూ, దేశవ్యాప్తంగా ఉన్న రైతులకూ మధ్య అతిపెద్ద విభజన రేఖను గీయడానికి మోదీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా మాటల్లో ఈ విషయం స్పష్టంగా బోధపడిరది. పంజాబ్హర్యానా సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతుల డిమాండ్లపై విధానపరమైన నిర్ణయం తీసుకునేముందు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరి ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అర్జున్ ముండా విలేకరుల సమావేశంలో ప్రకటించడం రైతుల పట్ల ప్రభుత్వ దుష్ట స్వభావానికి నిదర్శనం. ఉత్తరాది రైతులూ, దక్షిణాది రైతులూ, ఈశాన్య రైతులూ అంటూ వేర్వేరుగా రైతులు ఉంటారా? ఏ ప్రాంతంలో ఉన్న ప్రజల్లోనైనా సాగుదారులు ఒక భాగంగా ఉంటారు. వ్యవసాయ సాగు వారి వృత్తి. స్థూలంగా పండిరచే పంటల్లో కాస్త అటుఇటుగా తేడాలుంటాయి. సాగుచేసేవాడి ఆందోళనల్లో తేడా ఉండదు. రైతు బాధల్లో తేడా ఉండదు. అతని కష్టాల్లో, నష్టాల్లో తేడా ఉండదు. కార్పొరేట్ల కనుసైగల్లో బతుకీడ్చే మోదీ ప్రభుత్వానికి అన్నదాత గురించి, అతని విలువ గురించీ తెలియకపోవచ్చు. కానీ రైతు గుండెను తరచిచూస్తే అతని బాధాతప్తమైన హృదయ ఘోష వినబడుతుంది, కనబడుతుంది. ఎక్కడైనా రైతు ఒక్కడే. రైతులను ప్రాంతాలవారీగా చీల్చాలన్న ప్రభుత్వ భావన జుగుప్సాకరం. వ్యవసాయ రంగంలో యూరోపియన్ యూనియన్ (ఈయూ) చేపట్టిన వినాశకర విధానాలకు వ్యతిరేకంగా స్పెయిన్లో రైతులు గత కొన్ని రోజులుగా సాగిస్తున్న పోరాటం సరిగ్గా బుధవారం నాడే పతాకస్థాయికి చేరుకుంది. అక్కడ కూడా వివిధ రైతు సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ను ఫిబ్రవరి 21న రైతులు ముట్టడిరచారు. భారత్లో ఉద్యమించినట్లుగానే స్పానిష్ రైతులు దేశ నలుమూలల నుంచి కాలినడకన, ట్రాక్టర్ల ద్వారా మాడ్రిడ్కు చేరుకొని సెంట్రల్ ఇండిపెండెన్స్ స్క్వేర్ నుంచి వ్యవసాయ మంత్రిత్వ శాఖ కార్యాలయం వరకు భారీ పెరేడ్ నిర్వహించారు. ఐదు వరుసల్లో ట్రాక్లర్లతో నిర్వహించిన ప్రదర్శన తిలకిస్తే ఒళ్లుజలదరిస్తుంది. పసుపురంగు దుస్తులను ధరించిన రైతులు స్పానిష్ జెండాలను చేబూని, ఆవు మెడకు తగిలించే గంటలతో చేసిన మోతలకు మాడ్రిడ్ దద్దరిల్లింది. 500 ట్రాక్టర్లకే అనుమతినిస్తామని ప్రభుత్వం ఆంక్షలు విధించినా, వినని రైతులు వేలకొద్దీ ట్రాక్టర్లను రాజధానికి తరలించారు. బార్సిలోనా, జరాగోజా, కెటాలినా వంటి ప్రాంతాల నుంచి రైతులు తరలివచ్చారు. విపరీతంగా పెరిగిపోయిన వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులను తగ్గించాలని, పురుగు మందులు, ఎరువుల పట్ల ఈయూ విధానాలను ఉపసంహరించుకోవాలన్నదే స్పానిష్ రైతుల ప్రధాన డిమాండ్. తీవ్ర కరువు పరిస్థితుల్లో ఉన్న రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని కూడా వారు డిమాండ్ చేశారు. వ్యవసాయదారులకు సాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వారు ఎండగట్టారు. అక్కడ స్పానిష్ రైతులకూ, ఇక్కడ మన రైతులకూ ఆవేదనలో, ఆవేశంలో, ఆందోళనలో ఏదైనా తేడా ఉందా? మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధితెచ్చుకోవాలి. ఇప్పటివరకు నాలుగు దఫాలు మాత్రమే రైతులతో చర్చలు జరిపి, గొప్పగా చర్చించామని, రైతులే లొంగడం లేదని అవాకులు చెవాకులు మాట్లాడటం మానుకోవాలి. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) డిమాండ్లు ఒకేరీతిన ఉన్నాయి. తాజా పరిణామాలు పంజాబ్
హర్యానా సరిహద్దుల మధ్య మరింత ఉద్రిక్తతలను రాజేసే ప్రమాదం లేకపోలేదు. మోదీ ప్రభుత్వం మరో మూడు మెట్లు దిగి, రైతుల ఆవేదనను అర్థం చేసుకోవాలి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతోపాటు రైతులకు పెన్షన్లు, రుణమాఫీ, సాగు వ్యయాన్ని 50%కు తగ్గించడం వంటి చర్యలపై సానుకూలంగా వ్యవహరిస్తే రైతుల ఆందోళన సమసిపోయినట్లేనని గుర్తెరగాలి. అన్నింటికీమించి, అన్నదాతతో యుద్ధం చేయాలన్న ‘దురాలోచన’ నుంచి బయటపడి, రైతు సంక్షేమం కోసం ‘దూరాలోచన’ చేయడం ఉత్తమం.