సార్వత్రిక ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీకి దశాబ్దం పాటు మిత్రపక్షంగా ఉన్న నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజూ జనతా దళ్ మీద విరుచుకు పడడం ప్రారంభించారు. మే 13వ తేదీన, జూన్ ఒకటవ తేదీన ఒరిస్సాలో లోక్సభ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. సోమ వారం నాడు ప్రధానమంత్రి మోదీ ఒరిస్సాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను తీవ్ర పదజాలంతో దూషించడం ప్రారంభించారు. జూన్ నాలగవ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడడంతో నవీన్ పట్నాయక్ ప్రభుత్వానికి కాలం చెల్లుతుందని అంటున్నారు. సాధారణంగా తమ మీద వచ్చే విమర్శలకు స్పందించే అలవాటు లేని నవీన్ పట్నాయక్ సైతం మోదీకి సరిసమానంగా బీజేపీ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఒరిస్సా ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి మధ్య మాటలయుద్ధం జోరుగా సాగుతోంది. ప్రత్యర్థుల మీద ఆరోపణలు చేయడంలో దిట్ట అయిన మోదీ తన విమర్శలకు మరింత పదును పెడ్తున్నారు. 1998 నుంచి 2009 దాకా ఒరిస్సాలో బిజూ జనతా దళ్, బీజేపీ భాగస్వామ్య పక్షాలుగా ప్రభుత్వంలో ఉమ్మడిగా పనిచేశాయి. కానీ 2009లో బిజూ జనతా దళ్ బీజేపీతో మైత్రికి స్వస్తి చెప్పారు. ఒకప్పుడు నవీన్ పట్నాయక్ తన మిత్రుడు అని చెప్పే మోదీకి ఇప్పుడు ఒరిస్సా ముఖ్యమంత్రి పొడకూడా గిట్టడం లేదు. కొత్త అవకాశాలకోసం పాత మిత్రులను వదిలేయడం మోదీ నైజం. ఒరిస్సాలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఆ రాష్ట్రాన్ని అభివృద్ధిచేసి చూపిస్తామని చెప్తున్నారు. బీజేపీతో పొత్తు లేకపోయినా నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజూ జనతాదళ్ పార్లమెంటులో మాత్రం బీజేపీకి అనుకూలంగానే వ్యవహరించింది. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక వివాదాస్పద బిల్లులకు బిజూ జనతా దళ్ మద్దతు ఇస్తూనే వచ్చింది. అయినా సోమవారం గంజాం జిల్లాలోని బరంపురంలో మోదీ ఎన్నికల సభల్లో బిజూ జనతాదళ్ పై తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సొంత జిల్లా గంజాం అని గుర్తుంచుకోవాలి. బరంపురం దక్షిణ ఒరిస్సా రాజకీయ నాడిని తెలియజేస్తుందంటారు. ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ నాలుగుననే బీజేపీ ప్రభుత్వం ఆఖరి రోజు అవుతుందని కూడా మోదీ అన్నారు. బరంపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బిజూ జనతా దళ్ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి కూడా పార్టీ ఫిరాయింపుదార్లే. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రదీప్ పాణిగ్రాహి ఒకప్పుడు నవీన్ మంత్రివర్గ సభ్యుడు. అవినీతి ఆరోపణలు వచ్చినందువల్ల ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించారు. ఆయన అవినీతిపరులకు ఆలవాలమైన బీజేపీలో చేరిపోయి ఇప్పుడు బరంపురం నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బిజూ జనతా దళ్ అభ్యర్థిగా పోటీకి దిగిన భృగు బక్షిపాత్ర ఒకప్పుడు ఒరిస్సా బీజేపీ విభాగం అధ్యక్షుడు. బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన బిజూ జనతా దళ్ లోకి దూకేశారు. ఆయన గతంలోనూ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. బరంపురం నియోజక వర్గం మొదటి నుంచీ రాజకీయ ప్రాధాన్యత కలిగిందే. 1996 లో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ఇక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు. అందుకే ఈ ప్రాంతాన్ని దక్షిణ ఒరిస్సా రాజకీయాలకు కొలమానంగా భావిస్తారు. ఎన్నికల తరవాత బీజేపీ ఒరిస్సాలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటు చేస్తుందని మోదీ చాలా నమ్మకంగా ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి అతి విశ్వాసం రాజకీయ నాయకులలో కనిపించడంలో ఆశ్చర్యం లేదు. కానీ తాను ప్రత్యర్థులు అనుకునే వారి మీద దాడి చేసేటప్పుడు మోదీ ముందు వెనకలు ఆలోచించరు. మాన మర్యాదలను పట్టించుకోరు.
ఒరియా భాష వచ్చిన వారు, ఒరిస్సా సంస్కృతి తెలిసిన వారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండాలి అని మోదీ కొత్త పితూరీ లేవదీశారు. నవీన్ పట్నాయక్ ఎక్కువ కాలం విదేశాల్లో ఉండడం వల్ల ఆయన ఒరియా ధారాళంగా మాట్లాడకపోవచ్చు. అంత మాత్రం చేత ఆయనకు ఒరిస్సా సంస్కృతి తెలియదనడం అన్యాయం. పట్నాయక్ కు ఒరిస్సా సంస్కృతి తెలియడానికి ఒరియా భాష తెలియాలన్న నిబంధన ఎక్కడా లేదు. పరిపాలించడానికి ఒరియా భాష రాకపోతే నష్టం ఏమీ లేదు. బ్రిటీష్ వారు మన దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ఈ దేశంలోగల ఏ భాషా జ్ఞానం సహాయంతో ఆ పని చేయగలిగారు. బ్రిటీష్ వారి వలసవాదాన్ని, సామ్రాజ్యవాద పోకడలను ఎంతైనా వ్యతిరేకించవచ్చు. కానీ భారతీయ సంస్కృతి పరిరక్షణలో బ్రిటీిష్ వారి కృషి తక్కువేం కాదు. ఒరిస్సా గురించి తెలియక పోతే ఆ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోలేక పోతే దశాబ్దాలుగా ఒరిస్సా ప్రజలు ఆయనకే పట్టం ఎందుకు కడ్తారు. మోదీ కొన్ని మాటలను సందర్భానుసారం మార్చి మాట్లాడుతుంటారు. ‘‘మీరు కాంగ్రెస్ కు 50 ఏళ్లు, బిజూ జనతాదళ్ కు 25 ఏళ్లు అధికారం ఇచ్చారు. ఇప్పుడు బీజేపీకి అయిదేళ్లు ఇవ్వండి చాలు’’ అంటున్నారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి రావడానికి ముందు మోదీ సరిగా ఇదే వాదన చేశారు. దానికి రెట్టింపు అవకాశం దేశ ప్రజలు ఇచ్చారు. ఈ వాగ్దానం నెరవేరనందువల్లే ప్రజల్లో మోదీ మీద విశ్వాసం సన్నగిల్లుతోంది. మామూలుగా అయితే వివాదాల్లోకి దిగడం, మాటకు మాట బదులు ఇవ్వడం నవీన్ పట్నాయక్ స్వభావం కాదు. కానీ ఈసారి ఆయన గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఆరోసారి ముఖ్యమంత్రిని కాగలనన్న విశ్వాసం ఆయన ఇచ్చే సమాధానాల్లో కనిపిస్తోంది. జూన్ తొమ్మిదిన ఆరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించడానికి సకల ఏర్పాట్లూ చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఒరిస్సాలో అమలు చేయకపోవడమూ మోదీ దృష్టిలో నవీన్ పట్నాయక్ చేసిన నేరమే. ఆయుష్మాన్ యోజనకన్నా మెరుగైన ఆరోగ్య పథకాలు అంతకు ముందు నుంచి కొన్ని రాష్ట్రాలలో అమలు అవుతున్నాయి. అందువల్ల కొన్ని రాష్ట్రాలు కేంద్ర పథకాన్ని అమలు చేయలేదు. నవీన్ పట్నాయక్ తండ్రి బిజూ పట్నాయక్ మరణం తరవాత 1997లో బిజూ జనతా దళ్ ఏర్పడినప్పటినుంచి ఒరిస్సా మహిళలు బిజూ జనతాదళ్ కు మద్దతిస్తూనే ఉన్నారు. మహిళల మద్దతు బిజూకు మొదటి నుంచే ఉండేది. నవీన్ పట్నాయక్ పంచాయతీ సంస్థల్లో తమకు 50 శాతం రిజర్వేషన్లు కనిపించారన్న కృతజ్ఞత మహిళలకు ఉంది. మహిళలను ఆర్థికంగా సాధికారులను చేయడం కోసం 2001లోనే మిషన్ శక్తి ఏర్పాటు చేశారు. దీనికోసం పూర్తి స్థాయి ప్రభుత్వ విభాగాన్నే ఏర్పాటు చేశారు. మోదీకి ఒరిస్సాలో అధికారంతో తప్ప వాస్తవాలతో పనేం ఉంది?