గాజాపై ఇజ్రాయిల్ వికృత దాడిని ఖండిస్తూ, పలస్తీనా ప్రజల హక్కులకు మద్దతుగా అమెరికాలోని విశ్వవిద్యాలయాలతో పాటు ప్రపంచంలోని దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలలో తీవ్ర నిరసనలు కొనసాగుతున్నాయి. న్యూయార్క్ లోని కొలంబియా విశ్వవిద్యాలయం ఈ నిరసనోద్యమాలకు కేంద్రంగా తయారైంది. ఆరు నెలలుగా ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నట్టే ఇజ్రాయిల్ కు అనుకూల ప్రదర్శనలు సైతం కొద్ది స్థాయిలోనైనా కొనసాగుతున్నాయి. ప్రపంచం మొత్తం యుద్ధ వ్యతిరేక, యుద్ధ అనుకూల శిబిరాలుగా చీలిపోయి ఉన్న సమయంలో పరస్పర విరుద్ధ సమస్యల ఆధారంగా నిరసనలు జరగడం మామూలే. అయితే ఏ నిరసనలు బలంగా వ్యక్తమవుతున్నాయో గమనిస్తే కచ్చితంగా ఇజ్రాయిల్ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలదే పై చేయిగా కనిపిస్తోంది. ఇజ్రాయిల్ వ్యతిరేక ఉద్యమాలు కేవలం అంతమేరకే పరిమితమైనవి కావు. యుద్ధోన్మాదం ప్రకోపించిన ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నెతన్యాహుకు అపారంగా ఆయుధాలు సరఫరా చేస్తున్న అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఈ ప్రదర్శనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఉద్యమాలు దాదాపు రెండు వారాల నుంచి కొనసాగుతున్నాయి. అయితే అమెరికా, ఇతర పశ్చిమ దేశాలలో ఇజ్రాయిల్ వ్యతిరేక ఉద్యమాలను అదుపు చేయడానికి ఆ ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని మన దేశంలో జరిగే ఏ ఉద్యమానితోనైనా పోల్చి చూస్తే ఎంత చెడ్డా పశ్చిమ దేశాలలో వ్యతిరేకాభిప్రాయ వ్యక్తీకరణకు చాలా విలువ ఇస్తారని అర్థం అవుతుంది. రెండు వారాలకు పై నుంచి వివిధ యూనివర్సిటీలలో విద్యార్థులు నిరసన గళం విప్పినా వారి మీద ఇప్పటివరకు పోలీసులు దురుసుగా ప్రవర్తించిన దాఖలాలు లేవు. అదే మన దేశంలో అయితే ఆ విద్యార్థులకు నాయకత్వం వహిస్తున్న వారు ఇప్పటికే జైలు ఊచలు లెక్కపెడ్తూ ఉండే వారు. ఆ ఉద్యమానికి మద్దతు ఇస్తున్న వారి మీద యు.ఎ.పి.ఎ. లాంటి కరకు శాసనాల ప్రకారం కేసులు నమోదు అయిఉండేవి. పశ్చిమ దేశాలలో దాదాపు రెండు వారాలు ఉద్యమం కొనసాగిన తరవాతే పోలీసులు విశ్వవిద్యాలయాల ఆవరణల్లోకి ప్రవేశించారు. మన్హట్టన్ లాంటి చోట్ల నిరసన తెలియజేస్తున్న వారిని అక్కడి నుంచి తొలగించారు. డజన్ల మంది విద్యార్థులను నిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ నిరసనోద్యమాలకు ఆ విశ్వవిద్యాలయాల అధ్యాపక వర్గం మద్దతూ ఉంది. విద్యార్థులతో పాటు వారినీ అరెస్టు చేస్తున్నారు. ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న యుద్ధంవల్ల లాభాలు సంపాదిస్తున్న కార్పొరేషన్లలో పెట్టుబడులను ఉపసంహరించాలన్నది వీరి ప్రధానమైన డిమాండు. అక్టోబర్ ఏడున ప్రారంభమైన ఈ యుద్ధంలో ఇప్పటిదాకా ఇజ్రాయిల్ కర్కశ దాడికి 35,000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇలా ప్రాణాలర్పించిన వారిలో కేవలం పలస్తీనా సాయుధ దళాల వారు మాత్రమే లేరు. హమాస్ కార్యకర్తలు మాత్రమే లేరు. మృతుల్లో ఎక్కువ మంది అమాయకులైన పలస్తీనియన్లు మాత్రమే. ఇప్పటికి దాదాపు 77,700 వేలమంది గాయ పడ్డారు. వీరిలో చాలా మంది జీవచ్ఛవాలుగా మిగిలిపోయారు. ఇజ్రాయిల్ ఘాతుకాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా 90 విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. గత రెండు వారాలుగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల నుంచి అధ్యాపకులు, విద్యార్థులను కలిపి 1200 మందిని నిర్బంధంలోకి తీసుకున్నారు. వీరి మీద ఉన్న ఆరోపణల్లా గాజాలో కాల్పుల విరమణ పాటించాలనే. అనేక చోట్ల విద్యార్థులను విశ్వవిద్యాలయాల నుంచి సస్పెండ్ చేశారు. అరుదైన సంఘటనల్లో కళాశాలల నుంచి బహిష్కరించారు. ఆందోళన కొనసాగుతున్నందువల్ల కొన్ని విశ్వవిద్యాలయాల్లో స్నాతకోత్సవాలు వాయిదా వేయవలసి వచ్చింది. విశ్వవిద్యాలయాల భవనాలను, కూడళ్లను, వసారాలను విద్యార్థులు ఆక్రమించుకున్నందువల్ల, కొన్ని చోట్ల గుడారాలు వేసుకున్నందువల్ల స్నాతకోత్సవాలు నిర్వహించడానికి వీలు కలగ లేదు.
ఈ ఉద్యమం చాలా వరకు ప్రశాంతంగా, అహింసాయుతంగా జరుగుతూనే ఉన్నా కొన్ని చోట్ల ఇజ్రాయిల్ వ్యతిరేక, అనుకూల వర్గాలమధ్య కలహాలు చెలరేగాయి. ఇవి ఒకరినొకరు కొట్టుకునేంత దాకా వెళ్లాయి. నిరసన తెలియజేస్తున్న విద్యార్థుల మీద పోలీసుల చర్య దౌర్జన్యానికి చోటు కల్పించాలా అన్న వాదనలు కొనసాగుతున్నాయి. హెల్మెట్లు ధరించిన పోలీసులు, చేతులకు బేడీలు వేసుకున్న విద్యార్థులు అమెరికా సమాజంలో మారుతున్న పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అమెరికా పార్లమెంట్ సభ్యులు విద్యార్థులను తొలగించాలని ప్రయత్నిస్తున్నారు. ఉద్యమాలను అదుపు చేయడంలో విఫలం అయినందువల్ల విశ్వవిద్యాలయాలకు ఇచ్చే విరాళాలను నిలిపి వేస్తామని దాతలు బెదిరిస్తున్నారు. ఇజ్రాయిల్ కు వ్యతిరేకంగా అమెరికాతో పాటు ఇతర దేశాల్లో నిరసన చెలరేగడం ఇది కొత్తేమీ కాదు. ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న యుద్ధాన్ని అక్టోబర్ ఏడు నుంచే వ్యతిరేకించడమూ మొదలైంది. చాలా వరకు ఈ ఉద్యమాలు ప్రశాంతంగానే జరిగాయి. కేవలం అయిదు శాతం నిరసనలే హింసాత్మకంగా మారాయి. 3,761 ఉద్యమాలు ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా జరిగితే, ఇజ్రాయిల్ కు అనుకూలంగా 529 ప్రదర్శనలు జరిగాయి. 95 ప్రదర్శనలు తటస్థంగా జరిగాయి. మొత్తం ఉద్యమాలలో 86 శాతం ఇజ్రాయిల్కు వ్యతిరేకమైనవే. గత అక్టోబర్ 13న ఇజ్రాయిల్ గాజా ఉత్తరప్రాంత వాసులు అక్కడి నుంచి ఖాళీచేసి దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఉత్తర్వుచేసిన తరవాత నిరసనోద్యమాలు పెరిగాయి. ఆసుపత్రుల మీద ఇజ్రాయిల్ బలగాలు బాంబులు కురిపించడంతో నిరసనలూ ఆ మోతాదులోనే పెరిగాయి. లండన్, బెర్లిన్, వాషింగ్టన్లో జరిగిన నిరసన ప్రదర్శనలకు మీడియాలో ఎక్కువ ప్రచారం వచ్చింది. ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియాలో జరిగిన ప్రజల్లో ప్రధానంగా పాల్గొన్నది ముస్లింలే కనక అవి పలస్త్తీనియన్ల హక్కుల పరిరక్షణ కోసం కొనసాగినవే. యెమెన్, ఇరాన్, టర్కీ, మొరాకోలో తరచుగా నిరసనలు జరుగుతున్నాయి. గత నవంబర్ నాలుగున పారిస్ మధ్య భాగంలో ఇజ్రాయిల్ వ్యతిరేక ప్రదర్శనలు భారీ ఎత్తున జరిగాయి. ‘‘దౌర్జన్యాన్ని ఆపండి. ఏమీ చేయకుండా, ఏమీ మాట్లాడకుండా ఉండడం అంటే యుద్ధంలో భాగస్వాములైనట్టేనని పారిస్ లోని నిరసనకారులు నినదించారు. శాంతికి భంగం కలుగుతుందన్న అనుమానంతో మొదట్లో ఫ్రాన్సు అధికారులు నిరసనలకు అడ్డు తగిలారు. పలస్తీనియన్లకు అనుకూలంగా వాషింగ్టన్లో జరిగిన నిరసన ప్రదర్శలు ఇటీవలి భారీ స్థాయిలో జరిగినవనుకోవాలి. ఈ ఉద్యమాల అంతస్సారం వలసవాద సరిహద్దులను కూల్చేయడమే. కొలంబియా విశ్వవిద్యాలయంలో సంఫీుభావం కోసం ప్రారంభమైన ఈ ఉద్యమంలో విద్యార్థులు కళాశాలల ఆవరణల్లోనే మకాం వేశారు. నెమ్మదిగా ఈ ఉద్యమం కాలిఫోర్నియా, టెక్సస్లోని విశ్వవిద్యాలయాలకూ పాకింది. అమెరికాలోని విశ్వవిద్యాలయాల విద్యార్థులతో పాటు, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఇటలీ, ఇంగ్లాండ్ దేశాలలోని విశ్వవిద్యాలయాలను కూడా నిరసన సెగలు ఆవహించాయి. కెనడాలోని విశ్వవిద్యాలయాల్లో నిరసన వినూత్న రూపంలో సాగుతోంది. విశ్వవిద్యాలయ భవనాలపేర్లు మార్చి పలస్తీనాలోని ప్రాంతాల పేర్లు పెడ్తున్నారు. రంజాన్ సందర్భంగా తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలని ఐక్యరాజ్య సమితి తీర్మానాన్నీ ఇజ్రాయిల్ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఉత్తర గాజాలో చిక్కుపడి పోయిన వారికి ఇతర దేశాలు వారు పంపించే సహాయం అక్కడి ప్రజలకు అందకుండా నెతన్యాహూ ప్రభుత్వం అడ్డు తగులుతోంది.