రాహుల్ గాంధీ కథ ప్రస్తుతానికి సుఖాంతం అయి ఉండవచ్చు. పరువునష్టం కేసులో గుజరాత్లోని కింది కోర్టు ఆయనకు విధించిన రెండేళ్ల శిక్ష అమలును సుప్రీంకోర్టు నిలిపివేసింది. 2019 ఏప్రిల్ 13న కర్నాటకలోని కోలార్లో మోదీ ఇంటిపేరున్నవారు అందరూ దొంగలే ఎందుకు ఉంటారు అని ఓ ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ వ్యాఖ్యానించిందుకు గుజరాత్లోని సూరత్లో ఉన్న కోర్టు 2023 మార్చి 23న రాహుల్కు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. నేరపూరితమైన పరువునష్టం కేసులో రెండేళ్ల దాకా శిక్ష విధించవచ్చునని ఉన్న నిబంధనను వినియోగించి సూరత్లోని కింది కోర్టు న్యాయాధికారి రాహుల్కు రెండేళ్ల శిక్ష విధించారు. అవకాశం ఉన్నంతమేర శిక్ష విధించడం చాలా అసాధారణమైంది. బహుశా ఇలా మరో దృష్టాంతం కనిపించడం లేదు. ఈ శిక్ష విధించిన మర్నాడే లోకసభ సచివాలయం ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దుచేసింది. ఏంపీగా ఆయనకు కేటాయించిన ఇల్లు కూడా ఖాళీ చేయించారు. ఆయనపై కోర్టుకు అప్పీలు చేసుకోవడానికి వీలుగా 30 రోజుల పాటు శిక్ష అమలు చేయకుండా వెసులుబాటు కూడా కల్పించారు. రూ.15,000 పూచీకత్తుపై ఆయనకు బెయిలు కూడా మంజూరు చేశారు. 2023 ఏప్రిల్ మూడున రాహుల్ గాంధీ సూరత్లోని సెషన్స్ కోర్టులో కింది కోర్టు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును సవాలు చేశారు. 2023 ఏప్రిల్ 20న సెషన్స్ కోర్టు రాహుల్ అర్జీని తోసిపుచ్చింది. ఆ తరవాత అయిదు రోజులకు రాహుల్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయిస్తే అక్కడ కూడా 2023 జులై ఏడున చుక్కెదురైంది. గుజరాత్ హైకోర్టు శిక్ష నిల్పి వేయడానికి నిరాకరించిన వారం రోజులకు రాహుల్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్నారు. జులై 21వ తేదీన సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మామూలుగా పరువునష్టం కేసుల్లో క్షమాపణచెప్తే శిక్ష విధించరు. కానీ తాను తప్పు చేయలేదు కనక క్షమాపణ చెప్పే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. క్షమాపణ చెప్పేటట్టయితే ఆ పని ఎప్పుడో చేసేవాడినని రాహుల్ చెప్పారు. 2023 ఆగస్టు నాలుగున సుప్రీంకోర్టు రాహుల్కు విధించిన శిక్ష అమలుపై స్టే మంజూరుచేసింది. ఈ తీర్పు చెప్పింది శుక్రవారం రోజున. శని, ఆది వారాలు లోకసభ సచివాలయం పనిచేయదు. అందుకని మూడు రోజులకు రాహుల్ లోకసభ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. కింది కోర్టుతీర్పు చెప్పిన మరుసటిరోజే లోకసభ సభ్యత్వం రద్దు చేయడానికి ఉత్సాహం ప్రదర్శించిన లోకసభ సచివాలయం ఆ సభ్యత్వం పునరుద్ధరించడానికి రెండురోజులు విరామం వచ్చే సరికి కక్షగట్టినట్టు వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వం మరింత జాప్యం చేస్తుందేమోనన్న ఊహాగానాలు చెలరేగాయి. రాహుల్ను జైలుకు పంపిస్తే ఏ జరుగుతుందో మోదీ సర్కారుకు తెలుసు. భారత్ జోడో యాత్ర తరవాత రాహుల్ నడవడికలో పెద్ద పరిణాత్మకమైన మార్పు కనిపించింది. ఆయన ప్రతిష్ఠ పెరగడం మొదలైంది. మరో ఎనిమిది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సమయంలో ఆయన పలుకుబడి మరింత పెరుగుతుందని అది తమకు ప్రమాదకరమని గ్రహించలేనంతటి అమాయకత్వం మోదీ ప్రభుత్వానికి లేకపోలేదు. అందుకే సోమవారం రాహుల్ లోకసభ సభ్యత్వం పునరుద్ధరించారు.
కింది కోర్టు రాహుల్కు శిక్ష విధించడమే విచిత్రమైన రీతిలో జరిగింది. రాహుల్ మీద ఇలాంటి కేసులు మరో పదిదాకా ఉన్నాయని, ప్రజా ప్రతినిధులుగా ఉన్న వారు జాగ్రత్తగా మాట్లాడాలని కూడా కింది కోర్టు వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. కింది కోర్టు న్యాయమూర్తి అలా ఎందుకు చేశారు అంటే రాహుల్ను ఇంతకు ముందు సుప్రీంకోర్టు కూడా మందలించింది కదా అని సమర్థించుకున్నారు. కానీ రాహుల్ ను అత్యున్నత న్యాయస్థానం మందలించడానికి ఈ కేసు విచారణ తరవాత జరిగింది. శిక్ష అమలు మీద సుప్రీంకోర్టు స్టే విధించకుండా ఉంటే రెండేళ్ల శిక్ష అనుభవించిన తరవాత మరో ఆరేళ్లపాటు రాహుల్ ఎన్నికలలో పోటీ చేయడానికి వీలుండేది కాదు. ఆ విషమ పరిస్థితి తప్పింది. సుప్రీంకోర్టు స్టే విధించడంతో పాటు కింది కోర్టు వ్యవహార సరళిని ప్రశ్నించింది. దీన్నిబట్టి కింది కోర్టులు కొన్ని సందర్భాలలో కడకు హైకోర్టుల నిర్ణయాలు కూడా నిర్హేతుకంగా ఉంటున్నాయి. ముఖ్యంగా గుజరాత్లోని కోర్టుల తీర్పులు ప్రశ్నార్థకం అవుతున్నాయి. అంటే అక్కడి కోర్టులను ఏ శక్తి ప్రభావితం చేస్తోంది అన్న ప్రశ్న తలెత్తకపోదు. లేకపోతే కొందరు న్యాయమూర్తులు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారేమో అన్న అనుమానానికీ ఆస్కారంఉంది. సహజంగానే కాంగ్రెస్ వర్గాలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చూసి ఆనందపడ్తున్నారు. మంగళవారం నుంచి ప్రతిపక్ష ఫ్రంట్ ‘‘ఇండియా’’ మోదీ ప్రభుత్వంపై ప్రతిపాధించిన తీర్పుపై చర్చ మొదలు కాబోతోంది. ఈ చర్చలో రాహుల్ పాల్గొంటారనే అనుకోవాలి. ఆయన సీనియర్ నాయకుడు కనక ఇదివరకటి లాగానే మోదీ ప్రభుత్వాన్ని నిలదీస్తారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
అవిశ్వాస తీర్మానంపై మాట్లాడేటప్పుడు రాహుల్ మణిపూర్ పరిణామాలను కూడా తప్పకుండా ప్రస్తావించవచ్చు. అదానీ వ్యవహారంలో రాహుల్ లోకసభలో నిక్కచ్చిగా నిలదీయడాన్ని మోదీ సర్కారుకు మింగుడు పడలేదు. అందుకే ఆయన లోకసభ సభ్యత్వం రద్దయ్యేట్టు చేశారన్న విమర్శలూ వచ్చాయి. విద్వేష పూరిత విధానాలు అనుసరించడమే కాకుండా ముందు కాంగ్రెస్ మీదే దాడికి దిగిన మోదీ ఇప్పుడు ‘‘ఇండియా’’ ఫ్రంట్ మీదే విరుచుకు పడ్తున్నారు. ఈ దాడికి సమయమూ, సందర్భమూ కూడా ఉండడం లేదు. అధికారిక కార్యక్రమాలలోనూ మోదీ రాజకీయ విమర్శలే గుప్పిస్తున్నారు. ప్రతిపక్షాల ఐక్యత సార్వత్రిక ఎన్నికలలోనూ కొనసాగితే తమకు ముప్పు పొంచిఉందనే భయం మోదీని, బీజేపీని పీడిస్తోంది. అందుకని ప్రతిపక్ష ఫ్రంట్ లోని పార్టీలు అవినీతిపూరిత మైనవని, వంశపారం పర్యపాలన కొనసాగించాలనుకునేవనీ మోదీ అంటున్నారు. తనలో గూడుకట్టుకున్న భయాన్ని మోదీ తిట్లు, శాపనార్థాలతో పూరించుకుంటున్నారు. మొత్తం ప్రతిపక్షాలంటేనే మోదీకి ససేమిరా గిట్టడంలేదు.
ఈ రాజకీయ పరిణామాలను అలా ఉంచినా పరువునష్టం లాంటి వ్యవహారాలలో నేరపూరితమైన పార్శ్వాన్ని తొలగించకపోవడం, మోదీ అన్న ఇంటిపేర్ల మీద రాహుల్ వ్యాఖ్యలపై ఇంత దుమారం రేగడం ప్రజాస్వామ్యాన్ని బలహీన పరిచే పరిణామాలే. అదీగాక ఒక కేసులో న్యాయవ్యవస్థలోని అన్ని మెట్లు ఎక్కడం సామాన్యులవల్ల అయ్యే పనికాదు. న్యాయంకోసం సాధారణ ప్రజలు సుప్రీంకోర్టు దాకా అన్ని మెట్లెక్కడం కుదిరే పని కాదు. పరువునష్టం కేసులు సాధారణంగా వీగిపోతాయి. కానీ వాటి వెనక రాజకీయాలు ఉన్నప్పుడు రచ్చ కాక తప్పదు. పరువునష్టం వ్యవహారాలను నేరం కింద పరిగణించకపోవడం ఒక్కటే మార్గం. అనేక దేశాల్లో ఇప్పటికే ఆ పని చేశారు.