ఆంధ్రప్రదేశ్లో దర్జాగా సాగే దందాల్లో ఇసుక అక్రమ రవాణా ఒకటి. నదులు, వాగులు, వంకలనే తేడా లేకుండా, రాత్రింబవళ్లనే సోయే లేకుండా ఇష్టారాజ్యంగా సాగిపోయే ఇసుకాసురుల అక్రమ తవ్వకాల తీరును కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కమిటీ ఎండగట్టడం పర్యావరణవేత్తలకు శుభవార్తే. ఏపీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతుండటంతో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాల మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు చెందిన ఉన్నత కమిటీ రాష్ట్రంలో పర్యటించి, ఇసుక రీచ్లను సమగ్రంగా పరిశీలించిన మీదట నిజాలను నిగ్గుతేల్చింది. ఈ కఠోర వాస్తవాలు రాష్ట్రంలోని జగన్ మోహన్రెడ్డి సర్కారుకు అజీర్తిని కలిగించి ఉండవచ్చు. వాస్తవం ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో 2021 నుంచే ఇసుక అక్రమ మైనింగ్ జరుగుతోందని ఎన్జీటీ నిర్ధారించింది. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ పద్ధతి ప్రకారం ఇసుక తవ్వకాలు జరిపించేందుకు అనేక చట్టాలు, నియమ నిబంధనలు ఉన్నప్పటికీ, వాటిని ఉక్కుపాతరేసి మరీ నదులను కొల్లగొడుతున్నారని తేలింది. జగన్ సర్కారు తమ అస్మదీయ కంపెనీలకు ఇసుకను అడ్డగోలుగా దోచిపెట్టిన వైనాన్ని తాజా నివేదిక బట్టబయలు చేయడంతోనే ఎన్జీటీ దక్షిణాది ధర్మాసనం ఈ నిర్ధారణకు వచ్చింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు నివేదించాలని నిర్ణయించడం మరో శుభపరిణామం. నిజానికి సుప్రీంకోర్టు ఇదివరకే ఏపీ ఇసుక దోపిడీపై ఆందోళన వ్యక్తం చేసిన విషయం ప్రస్తావనార్హం. అయినప్పటికీ, నేతల లెక్కలేనితనం, అధికారం యంత్రాంగం తోడ్పాటు వల్ల ఈ దోపిడీ యథేచ్ఛగా సాగుతూనే వచ్చింది. ఈ సందర్భంలో రాష్ట్ర గనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) ఘోర వైఫల్యాలను తోసిపుచ్చలేం. 26 జిల్లాలకు గాను 25 జిల్లాల కలెక్టర్లు తమ తమ జిల్లాల్లో ఎక్కడా ఇసుక అక్రమ తవ్వకాలు జరగడం లేదని అందరూ కూడబలుక్కొని ఒకే మాట మీద నిలబడటం, ‘మూకుమ్మడి అబద్ధం’ చెప్పడం బ్యూరోక్రసీ అవినీతికి పరాకాష్ఠ. కలెక్టర్లంతా ఒకే ‘ఫార్మాట్’లో నివేదికలు సమర్పించడం ఎన్జీటీని దిగ్భ్రాంతికి గురిచేసింది. కలెక్టర్లు అక్రమ రీచ్లు వదిలేసి ఉత్తుత్తి రేవులకు వెళ్లి పరిశీలించినట్లు చెప్పేసి చేతులు దులుపుకున్నట్లు ఎన్జీటీకి స్పష్టంగా అర్థమైపోయింది.
వాస్తవానికి ఇసుక అక్రమ రవాణా అనేది గత ప్రభుత్వ పాలనలోనూ విచ్ఛలవిడిగా సాగింది. కాకపోతే జగన్ హయాంలో కొత్త వాల్టా చట్టం, దాని నిబంధనలు, 25, 71 జీవోల ముసుగులో అధికారికంగానే అంతులేని దోపిడీకి తెరలేచింది. ఇసుక మాఫియా ఈ స్థాయిలో విజృంభించడం ఇదే ప్రథమం. చీకటి వెలుగులనే తేడా లేకుండా వైసీపీ నేతలు రోజుకి కనీసం 2000 టన్నుల చొప్పున ఇసుకను అక్రమంగా ఒడ్లు, రోడ్లూ దాటించారంటే దందా ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. 40 రీచ్లలో యంత్రాల్లేకుండా ఇసుకను తవ్వుకోవచ్చు. కానీ 500 రీచ్లలో ఏకంగా రాకాసి జేసీబీలను రంగంలోకి దించి తవ్వేసుకున్నారు. ఒకేసారి 2 టన్నుల ఇసుకను వెలికితీసే బకెట్లను వాడారు. పర్యావరణ, కాలుష్య అనుమతులంటూ ఏమీ లేకుండా టన్నులకొద్దీ ఇసుకను బొక్కేసి, టన్నును రూ.475 చొప్పునా అమ్మేసి, సొమ్ము చేసుకున్నారు. కేవలం ఇసుక లాబీయింగ్తోనే పాలకపార్టీ నేతలు కోట్లాది రూపాయలను మింగేశారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఒక దశలో పర్యావరణ అనుమతులుండేవి. ఆ తర్వాత వాటి గడువు తీరింది. అయినప్పటికీ, గనుల శాఖ, పీసీబీ అధికారుల చేతులు తడిపేసి, కోట్లు కాజేసిన ఉదంతం ముక్కున వేలేసుకునేలా చేసింది. ‘మా రాజ్యం..మా ఇసుక’ అంటూ నదీగర్భాలను గుల్లచేయడాన్ని తాజా అధ్యయనంలో కేంద్ర కమిటీ తప్పుబట్టింది. ఇసుకను ఇష్టానుసారం తవ్వేసిన సంస్థల్లో జేపీ వెంచర్స్, జేసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలు జగన్కు చెందిన అస్మదీయ కంపెనీలేనని ఆరోపణలున్నాయి. ఈ సంస్థలు జేసీబీ, హిటాచీ వంటి యంత్రాలతో ఇసుక తవ్వుతున్నట్లు అటవీ, పర్యావరణ కమిటీ బృందానికి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాయి. 2021 నుంచి ఇసుక మైనింగ్కు సంబంధించిన పర్యావరణ అనుమతులు ఏపీ ప్రభుత్వానికి చెందిన మైన్స్ అండ్ జియాలజీ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ సంతకంతో జయప్రకాశ్ పవర్ వెంచర్స్ (జేపీ వెంచర్స్) పేరిట జారీ అయ్యేవి. అక్రమ తవ్వకాలకు ఈ సంస్థదే బాధ్యత అని కమిటీ గుర్తించింది. అయితే తాజాగా కాంట్రాక్టులు దక్కించుకున్న జేసీకేసీ, ప్రతిమ సంస్థలు కూడా ఇవే తప్పులు చేస్తూ దొరికిపోయాయి. చట్టాలను అడ్డగోలుగా ఉల్లంఘించడం ఈ ఇసుకాసురుల దినచర్యగా మారిపోయింది. 2023 మార్చిలోనే రాష్ట్రంలోని అన్ని రీచ్లకు ఇచ్చిన పర్యావరణ అనుమతులను ఎన్జీటీ రద్దుచేసింది. జేపీ వెంచర్స్నుంచి ఒక్కో రీచ్కు రూ.18 కోట్ల చొప్పున మొత్తం రీచ్ల నుంచి అపరాధ రుసుము వసూలు చేయాలని కూడా ఎన్జీటీ తీర్పునిచ్చింది. అయితే దీనిపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో అక్రమ తవ్వకాలకు ఊతం లభించినట్లయింది. కొత్తగా పర్యావరణ అనుమతులు (ఈసీ) తీసుకొని తవ్వకాలు చేసుకోవచ్చని కోర్టు చెప్పింది. కాకపోతే జేపీ వెంచర్స్ సంస్థ ఎలాంటి కొత్త ఈసీలు తీసుకోకుండా, రద్దయిన పాత ఈసీలతోనే వాల్టా నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపి డబ్బులు పోగేసుకుంది. తత్ఫలితంగా క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని ఎన్జీటీ జిల్లా కలెక్టర్లకు ఆదేశించినప్పుడు వారు నిష్క్రియాపరత్వాన్ని ప్రదర్శించి, గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్సాహాన్ని నీరుగార్చారు. అప్పటికే లీజ్ ప్రాంతానికి మించి అక్రమ తవ్వకాలు జరిగినట్లు గూగుల్ ఎర్త్ ఉపగ్రహ చిత్రాలు బట్టబయలు చేశాయి. 2023 ఏప్రిల్ నుంచి నదీ రేవుల్లో 2 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో, 4 నుంచి 5 అడుగుల లోతుల్లో ఇసుకను తవ్వేస్తున్నట్లు రుజువులతో సహా నిర్ధారించుకున్న మీదటే కేంద్ర కమిటీ తన నివేదికను బహిర్గతం చేసిన విధానం ప్రశంసనీయం.
జగన్ హయాంలో మూడుసార్లు ఇసుక పాలసీని మార్చి, ఇసుకను పూర్తిగా వ్యాపారవస్తువుగా మార్చిపడేశారు. ఐదేళ్ల కిందట ఇసుక ట్రాక్టరు రూ.1500 ఉండగా, ఇప్పుడు రూ.5000 దాటింది. భవన నిర్మాణాలు కష్టతరం కావడంతో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డునపడ్డారు. యేటా రూ.50 వేల కోట్ల అక్రమ ఇసుక వ్యాపారం సాగడం ఈ రాష్ట్రంలో అసహజమేమీ కాదని తేలిపోయింది. ప్రమాదాలు, ప్రతీకారాలతో ఇసుక లారీలు, ట్రక్కుల చక్రాల కింద ఏటా నలిగిపోతున్న వారి సంఖ్య వందలకు చేరడం ఈ ఇసుకాసురుల మరో రాక్షసకోణం. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇసుక ట్రక్కర్లతో ఢీకొని అధికారులను, పర్యావరణ హక్కుల కార్యకర్తలను దారుణంగా చంపేసిన ఘటనలు చూసి ఉన్నాం. కానీ ఏపీలోనూ అలాంటివి జరిగినా, సాధారణ ప్రమాదాల లెక్కల మాటున గతించిపోవడం బాధాకరం.