నెలల తరబడి ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన ప్రధానమంత్రి మోదీకి ప్రచారం చివరి రోజు కొంత విశ్రాంతి కావలసి వచ్చినట్టుంది. తాను అవిశ్రాంతంగా పని చేస్తానని చెప్పుకునే మోదీ విశ్రాంతి అన్న మాట వాడకుండా దానికి ధ్యానం అన్న పేరు పెట్టారు. ఆ ధ్యానానికి దేశ దక్షిణ తీరంలోని కన్యాకుమారికి సమీపంలో ఉన్న వివేకానంద స్మారక చిహ్నాన్ని ఎంచుకున్నారు. అయితే హఠాత్తుగా తీసుకున్న నిర్ణయంలా కనిపింపచేసే ప్రయత్నం జరిగినా అది వాస్తవం కాదు. కొన్ని నెలల నుంచే వివేకానంద స్మారక చిహ్నం వద్ద మరమ్మతులు, నిర్మాణాలూ జరుగుతూనే ఉన్నాయి. అయితే దేన్నయినా నాటకీయంగా మలచడంలో మోదీని మించిన వారులేరు. ఇప్పుడూ అలాగే చేశారు. మోదీ ధ్యానముద్రలో నిమగ్నమై ఉండడం ఇది మొదటి సారేమీ కాదు. కేదార్నాథ్ లో కాషాయ వస్త్రాలు ధరించి ధ్యాన ముద్రలో ఉండిపోయారు. అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ సేపు ధ్యానం చేశారు. 45 గంటలు ఆయన ధ్యానం చేశారంటున్నారు. మరి ఆ ధ్యానానికి ఫలితమో, పర్యవసానమో ఏదో ఒకటి ఉండాలిగా. అందుకే ఆ ధ్యానం ముగిసిన తరవాత దిల్లీకి విమానం ఎక్కడానికి ముందు దేశవాసులకు ఒక లిఖిత పూర్వక సందేశం అందించారు. తాను తీసుకున్న నిర్ణయాలూ అందులో ఉన్నాయి. ఇన్నాళ్లు దేశ వాసులను విభజించే రాజకీయాలు, ముస్లింలను ద్వేషించే విధానాలు అనుసరించిన మోదీ ఈ సుదీర్ఘ సందేశంలో ముస్లింల మీద విషం చిమ్మే కార్యక్రమానికి దూరంగా ఉన్నట్టు కనిపించడానికి సకల ప్రయత్నాలూ చేశారు. తాను ధ్యానం చేసిన చోటు విశిష్టతను ఈ సందేశంలో తెలియజెప్పారు. కన్యాకుమారి సంగమ స్థానం అన్నారు. దేశంలోని నదులన్నీ సముద్రంలో కలిస్తే కన్యాకుమారి సముద్రాలకు సంగమ స్థానం అని తెలిసిన విషయాన్నే కొత్తగా చెప్పడానికి ప్రయత్నించారు. వివేకానందుడి స్మృతి చిహ్నానికి చేరువలోనే తిరువళ్లువర్ స్థూపం, గాంధీ మండపం, కామరాజార్ మణి మంటపం ఉన్నాయని అందువల్ల ఇది వివిధ భావజాలాల సంగమ స్థలం అని కూడా చెప్పారు. ఈ భావజాలాల సంగమమే జాతీయ ఆలోచనా విధానం అని అన్నారు. ఈ భావజాల సంగమమే జాతి నిర్మాణానికి గొప్ప స్ఫూర్తినిస్తుందని అని సెలవిచ్చారు. కన్యాకుమారి ఐక్యతా సందేశం ఇస్తుందని చెప్తూనే భారత జాతీయత మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ఐక్యతను చిన్న చూపు చూసే వారికి కూడా ఈ ప్రాంతం ఐక్యతా సందేశం అందిస్తుందని అనడం ద్వారా ప్రతిపక్షాలను పరోక్షంగా ఒక్క పోటు పొడవడాన్ని మోదీ విస్మరించలేదు. కన్యాకుమారి లోని తిరువళ్లువర్ ప్రతిమ సముద్రం మీంచి యావత్ భారతావనిని చూస్తున్నట్టు ఉందని మోదీ తన కవితాత్మను కూడా వెల్లడిరచారు. సకల జీవన పార్శ్వాలను చిత్రించిన తిరుక్కురల్ రచన జాతి కోసం మనమందరం పాటు పడాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తుందని మోదీ చెప్పారు. అంతటి మహనీయుడికి నివాళులు అర్పించే అవకాశం తనకు రావడం మహద్భాగ్యం అని కూడా మోదీ అన్నారు. స్వామీ వివేకానంద ఇదే ప్రదేశంలో ధ్యానం చేశారని గుర్తు చేశారు. తాను వివేకానంద స్మారక చిహ్నం దగ్గర ప్రశాంతత, నిశ్శబ్దం మధ్య ధ్యానం చేస్తున్నప్పుడు భారత్కు బంగారు భవిత ఉందని తోచిందని, భారత్ ముందున్న లక్ష్యాలు స్ఫురణకు వచ్చాయి అని కూడా మోదీ తన ఆత్మావిష్కరణలో భాగంగా చెప్పారు. కన్యాకుమారిలో సూర్యోదయం తన ఆలోచనలను నూతన శిఖరాలకు తీసుకెళ్లిందట. అక్కడి సముద్రం తన ఆలోచనలను సైతం నూతన శిఖరాలకు చేర్చిందట. దశాబ్దం కిందట హిమాలయ పర్వత సానువుల్లో ధ్యానం చేసినప్పటి అనుభూతి ఇప్పుడూ మోదీకి కలిగిందట.
ఏ రాష్టానికి వెళ్లినా ఆ రాష్ట్రంతో తన విడదీయరాని అనుబంధాన్ని గురించి కథలు కథలుగా చెప్పే అలవాటు ఉన్న మోదీ కన్యాకుమారి ఎప్పుడూ తన మదిలో ఉంటుందనిచెప్పి వెళ్లిన ప్రాంతంతో మమేకమయ్యే అలవాటును పునరావృతం చేశారు. ఏక్నాథ్ రణడే నాయకత్వంలో వివేకానంద స్మారక చిహ్నం నిర్మించినప్పుడు ఆయనతో కలిసి తానూ ఆ ప్రాంతంలో పర్యటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ నిర్మాణం జరిగినప్పుడు మోదీ కొన్నాళ్లు కన్యాకుమారిలో బస చేశారట. కన్యాకుమారి శక్తి పీఠమన్నారు. ఇదే ప్రాంతంలో శక్తి శివుడు ప్రత్యక్షం కావాలని తపస్సు చేశారట. ఆ రకంగా వివేకానందుడి ధ్యానంతో తన ధ్యానాన్ని ముడి పెట్టడంతో ఆగకుండా ఆది శక్తితో తనను తాను పోల్చుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇటీవలే తాను దైవాంశ సంభూతుడినని, ఈ దేశాన్ని ఉద్ధరించడానికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే తనను పంపించాడని చెప్పుకున్న మోదీ అంతకన్న తక్కువస్థాయి పోలిక తీసుకొస్తారని అనుకోవడం మానవమాత్రుల అమాయకత్వం మాత్రమే. ‘‘ప్రతి జాతి అందించవలసిన సందేశం, సాధించవలసిన లక్ష్యం ఒకటి, చేరుకోవలసిన గమ్యం ఒకటి ఉంటుంది’’ అని వివేకానందుడి మాటలను మోదీ గుర్తుచేసి తన ఆలోచనలను వివేకానందుడి బోధనలతో ముడిపెట్టి తాను ఎంతటి ఉన్నతుడో చెప్పుకోవడానికి మోదీ శక్తివంచనలేకుండా ప్రయత్నించారు. మనం సంపాదించిన సొత్తు మనది కాదు అనుకునే జాతి మనది (ఇదం న మమ) అని సంస్కృత సూత్రాన్ని కూడా మోదీ ఉటంకించారు. కానీ దేశ సంపదలో ప్రధాన భాగం కొద్ది మంది గుప్పెట్లో ఎందుకు చేరుతుందో వివరించడానికి ఇది సందర్భం కాదని మోదీ భావించి ఉంటారు. ఇదే క్రమంలో తన ఘనతను చాటుకోవడాన్ని మోదీ విస్మరించలేదు. మన పరిపాలనా విధానం ప్రపంచానికే నమూనాగా తయారైందట. కేవలం పదేళ్లలో 25 లక్షల మంది తాను పేదరికం నుంచి బయట పడేశారట. మరో పాతికేళ్లు ఇలాగే ‘‘శ్రమ పడితే’’ 2047 కల్లా వికసిత భారత్ అవుతుందన్నారు. కానీ తనకు 60 నెలలు ఇస్తే చాలునని 2014లో చెప్పిన విషయాన్ని మోదీ వాటంగా విస్మరించారు. లక్ష్యాలను నిర్దేశించడం ఆ లక్ష్యాలను సాధించడంలో విఫలం అయితే గడువు పెంచడం మోదీ లాంటి వారికి అత్యంత సహజమైన అంశం. తాను ప్రారంభించిన డిజిటల్ ఇండియా ఉద్యమం ప్రస్తుతం ప్రపంచమంతటికీ ఆదర్శం అయిందట. డిజిటల్ సాంకేతికతవల్ల పేదలను సాధికారికుల్ని చేశామని, దాపరికంలేని విధానాన్ని అమలు చేస్తున్నామని, పేదల హక్కులను పరిరక్షిస్తున్నామని మోదీ చెప్పుకున్నారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ మంత్ర జపంచేసే మోదీ ముస్లింల హక్కులు, అధికారాల అంశానికి వచ్చేటప్పటికి ఎందుకు విషం చిమ్ముతారో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. ధ్యానం పేరిట తన వివక్షాపూరిత విధానాల మీద మోదీ ముసుగు కప్పేశారు. తానెంతటి పరిశుద్ధాత్ముడినో నిరూపించుకోవడానికి మోదీ చిన్న అవకాశం కూడా వదలలేదు. మోదీ మూర్తిమత్వం మేడిపండు అని ఎవరికి తెలియదు కనక!