మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత 2016లో పెద్దనోట్ల రద్దులో ప్రధాన ఉద్దేశం తీవ్రవాదాన్ని అణచడం అని కూడా అని చెప్పారు. 2019 ఆగస్టు అయిదున జమ్మూ-కశ్మీర్కు వర్తించే రాజ్యాంగంలోని 370వ అధికరణ రద్దు ముఖ్యోద్దేశం కూడా ఆ ప్రాంతంలో తీవ్రవాదాన్ని అణచి వేయడమేనని మోదీ సర్కారు తెగ ప్రచారం చేసుకుంది. ఈ రెండిరటివల్ల జమ్మూ-కశ్మీర్లో తీవ్రవాదం తగ్గిన జాడలే కనిపించడం లేదు. సోమవారం జమ్మూ-కశ్మీర్ లోని కథువా జిల్లాలో సైన్యంపై తీవ్రవాదులు చేసిన ఆకస్మిక దాడిలో అయిదుగురు భారత జవాన్లు నేలకొరిగారు. సైనికుల వాహన శ్రేణిపై తీవ్రవాదులు రెండువేపుల నుంచి దాడి చేశారు. గ్రెనేడ్లు విసిరారు. తీవ్రవాదులు కొండమీద నుంచి సునాయాసంగా దాడి చేయగలిగారు. సైనిక వాహనాలు కొండ కింద నుంచి వెళ్తుండగా ఈ ఆకస్మిక దాడి జరిగింది. ఇంతస్థాయిలో కాకపోయినా జమ్మూ-కశ్మీర్ లో తీవ్రవాదుల ఆగడాలు అనుదినం జరుగుతూనే ఉన్నాయి. అంటే పెద్దనోట్ల రద్దువల్ల, 370వ అధికరణం రద్దువల్ల తీవ్రవాదాన్ని అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి దాడులు జరిగినప్పుడల్లా కేంద్ర్ హోం మంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ అంతకంత ప్రతీకారం తీర్చుకుంటామని ప్రగల్బాలు పలుకుతుంటారు. కానీ అలాంటి ఛాయలే కనిపించవు. భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది నాలుగురోజుల కిందే ఆ ప్రాంతంలో పర్యటించి వచ్చారు ఆ వెంటనే తీవ్రవాదులు పంజా విసరడం అత్యంత ఆందోళనకరం. ప్రతీకారం తీర్చుకుంటాం అని దాడి జరిగిన ప్రతిసారీ ప్రభుత్వ పెద్దలు గంభీరమైన ప్రకటనలు జారీ చేస్తుంటారు. ఎప్పుడు చూసినా సర్జికల్ స్ట్రైక్లు, బాలకోట్ దాడి గురించే ప్రస్తావిస్తుంటారు. పుల్వామాలో దాదాపు 40 మంది భద్రతా దళాలను బలిపెట్టిన తీరు గురించి ఆ రాష్ట్ర గవర్నర్గా పనిచేసిన సత్పాల్ మాలిక్ గుట్టు విప్పినా మోదీ ప్రభుత్వం నుంచి ఒక్క సమాధానం కూడా లేదు. ‘‘ఇంట్లో చొరబడి కొడ్తాం’’ అన్న మోదీ హెచ్చరికలు ఏమైనాయో తెలియదు. జమ్మూ-కశ్మీర్ కు వర్తించే 370వ అధికరణాన్ని రద్దుచేయడంవల్ల మేలు జరిగిన దాఖలాలే లేవు. పైగా ప్రజాభిప్రాయం వ్యక్తం కాకుండా మోదీ సర్కారు సకల కట్టుదిట్టాలూ చేసింది. చీటికి మాటికి రోజుల తరబడి ఇంటర్నెట్ సదుపాయం లేకుండా చేస్తోంది. అంటే సమాచారాన్ని అడ్డుకుంటోంది. గత పదేళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం పాక్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకుంటామని బీరాలు పలుకుతోంది. ఈసారి ఆ పనిచేసి తీరతామని ఇప్పటికీ చెప్తున్నారు. సంపూర్ణమైన మెజారిటీ ఉన్నప్పుడే జరగనిపని అత్తెసరు మార్కులతో గట్టెక్కిన మోదీ సర్కారుకు ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకునే శక్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. తమ నెలవులు వదిలి వచ్చిన కశ్మీరీ పండితులను మళ్లీ సొంత గూటికి పంపించేస్తామని మోదీ అధికారంలోకి రాకముందు కూడా బీజేపీ హామీల మీద హామీలు పడేసింది. ఇంతవరకు ఎంత మంది కశ్మీరీ పండితులను వెనక్కు పంపించారని అడిగితే మాత్రం బీజేపీ పెద్దలు పెదవి విప్పరు. గత అయిదేళ్ల నుంచి ఈ అంశంపై బీజేపీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
సోమవారం జరిగిన తీవ్రవాద దాడి రెండురోజుల్లో రెండవది. ఈ దాడికి తామే బాధ్యులమని ‘‘కశ్మీరీ టైగర్స్’’ సంస్థ బాహాటంగానే ప్రకటించింది. ఈ సంస్థకు పాకిస్థాన్లోని జైష్-ఎ-మహమ్మద్తో అనుబంధం ఉందట. జమ్మూ-కశ్మీర్లో తీవ్రవాదుల ఆటసాగుతోంది కానీ తీవ్రవాద వ్యతిరేక చర్యల ప్రభావం మాత్రం కనిపించడంలేదు. ఆ ప్రాంతంలో తీవ్రవాదానికి 370వ అధికరణమే కారణం అయి ఉంటే గత అయిదేళ్ల కాలంలో తీవ్రవాదుల ఆగడాలు ఆగిపోయి ఉండాలి. బీజేపీ ప్రభుత్వం సాధించిందల్లా జమ్మూ-కశ్మీర్ ప్రజలకు ఉన్న ప్రత్యేక సదుపాయాన్ని తొలగించడమే. ప్రజలకు రక్షణ కల్పించిన జాడలేలేవు. దీర్ఘకాలం నుంచి సంఫ్ు పరివార్ ఎజెండాలో ఉన్న 370వ రద్దు లక్ష్యాన్ని మాత్రం మోదీ ప్రభుత్వం సాధించగలిగింది. జమ్మూ-కశ్మీర్కు త్వరలో రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరిస్తామని 370వ అధికరణాన్ని రద్దు చేసినప్పుడు ఇచ్చిన హామీఊసే మోదీ సర్కారు ఎత్తడం లేదు. 370వ అధికరణం రద్దుకు ముందు ఆ రాష్ట్ర శాసనసభను రద్దు చేశారు. అప్పటినుంచి ఇటీవల సార్వత్రిక ఎన్నికలు జరిగేదాకా ఆ ప్రాంత ప్రజలకు తమ అభిప్రాయం వ్యక్తంచేసే అవకాశమే రాలేదు. మొన్నటి ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్న వారి సంఖ్య పెరిగిందని, అదీ తమ ఘనతేనని బీజేపీ బాకాలూదుతోంది. కానీ లేక లేక జరిగిన ఎన్నికలలో తమ అభిప్రాయం వ్యక్తం చేయడానికి ప్రజలు ఉత్సాహం కనబరిచారన్నదే వాస్తవం. జమ్మూ-కశ్మీర్లో కల్లోల పరిస్థితిని అదుపు చేయడంలో మోదీ సర్కారు ఘోరంగా విఫలమైంది. మణిపూర్లో సంవత్సరకాలం నుంచి అంతర్యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం 200 ప్రాణాలు బలైనాయి. కానీ మోదీ తగుదునమ్మా అని రష్యా అధినేత పుతిన్కు శాంతిమంత్రం ఉపదేశించడానికి రెండు రోజులపాటు రష్యాలో గడిపివచ్చారు. ఇంకా విచిత్రమైంది ఏమిటంటే ఉక్రెయిన్ మీద యుద్ధం ఆపాలని పుతిన్కు నచ్చచెప్పాలని అమెరికా మోదీని పురమాయించిందట. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కు పిలిపించడానికి మోదీ యుద్ధం ఆపించారట. అంతటి శక్తిమంతుడే అయితే పుతిన్కు నచ్చచెప్పి మొత్తానికే యుద్ధం ఆపించవచ్చు కదా! అంటే ఏకఛత్రాధిపత్యంలో మోదీ ఇంకా పుతిన్ స్థాయికి ఎదగలేదనుకోవాలి. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జమ్మూ-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సక్సేనా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ విరామం లేకుండా ప్రతీకారం తీర్చుకుంటామని శపథాలు చేస్తూనే ఉంటారు. జమ్మూ-కశ్మీర్ విషయంలో మన గూఢచార వ్యవస్థ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అజిత్ దోవల్ ఎంత ఘనత వహించిన భద్రతా నిపుణుడో రుజువు చేయడానికి అనేక కట్టుకథలల్లారు. అజిత్ డోవల్ రహస్యంగా లాహోర్లో పర్యటించారట. కశ్మీర్ లో అసలు మోదీ మాట వినేవారు ఎవరైనా ఉన్నారా అనేదే సమాధానం లేని ప్రశ్న. మన సైనికులంటే తీవ్రవాదులు ఏ మాత్రం భయపడడంలేదు. పైగా దాడులకు బరితెగిస్తున్నారు. ఒక్కో తీవ్రవాద దాడి మన వైఫల్యానికి నిదర్శనం. పాక్ ఆక్రమిత కశ్మీర్లో శిక్షణ పొందుతున్న తీవ్రవాదులు రాను రాను రాటుదేలుతున్నారని మాత్రం వారి రోజువారీ కార్యకలాపాలే నిరూపిస్తున్నాయి. గూఢచర్యంలో మన ‘‘రా’’ కన్నా ఎప్పుడూ ఐ.ఎస్.ఐ.దే పై చేయి అవుతోంది. అందుకే తీవ్రవాదులు దూసుకు రాగలుగుతున్నారు.