టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గంగిరెడ్ల మేఘాలదేవి…
విశాలాంధ్ర – కొయ్యలగూడెం : (ఏలూరు జిల్లా) : ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్ మీడియాపై దాడులకు తెగబడుతున్నారని తేదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గంగిరెడ్ల మేఘాలాదేవి ఆరోపించారు. బుధవారం ఆమె స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేఘాలాదేవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో హింస పరాకాష్టకు చేరిందన్నారు. వ్యూహాత్మకంగా ఒక్కో వర్గాన్ని టార్గెట్ చేసి భయాందోళనలకు గురి చేస్తున్న జగన్ ప్రభుత్వం మీడియా నైతికస్థయిర్యాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగానే మీడియా ప్రతినిధులపై భౌతిక దాడులకు తెగబడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడు సంఘటన మరువక ముందే వైసిపి గూండాలు కర్నూలు
ఈనాడు కార్యాలయంపై బరితెగించి దాడి చేయడం రాష్ట్రంలో అధికార పార్టీ నేతల అరాచకత్వానికి, దిగజారిన శాంతిభద్రతలకు నిదర్శనం అన్నారు.
ప్రభుత్వ పాలనలోని తప్పుల్ని ఎత్తి చూపుతున్న మీడియాను టార్గెట్ చేసి అత్యంత హేయంగా దాడులు చేయించడం నీచ సంస్కృతికి నిదర్శనం అన్నారు. జగన్ ప్రభుత్వం మీడియా స్వయంప్రతిపత్తిని, భావ ప్రకటనా స్వేచ్ఛను పూర్తిగా హరించడానికి చేస్తున్న ప్రయత్నాలను నియంత్రించడానికి గవర్నర్ జోక్యం చేసుకోవాలన్నారు.మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసులను స్వీకరించి చట్ట ప్రకారం నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.