విశాలాంధ్ర- కొయ్యలగూడెం: గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం అపహాస్యం పాలు అవుతుందా..? అంటే అవుననే చెప్పాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల ప్రకారం గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా శాసనసభ్యులు, ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు వెళ్లి సమస్యలు తెలుసుకోవలసిన బాధ్యత ఉంది. కానీ ఇదేమీ ఆచరణలో పాటించడం లేదు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఫోటోలకే పరిమితం అవుతుంది. కొయ్యగూడెం పట్టణంలోని గురువారం పోలవరం నియోజకవర్గం శాసనసభ్యులు తెల్లం బాలరాజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సచివాలయం రెండులో నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకోవలసిన శాసనసభ్యులు బాలరాజు ఎస్ సి కాలనీలో ప్రజలను బయటకు పిలిచి వీధులలో రోడ్లపైనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వివరాలతో ముద్రించిన పుస్తకాన్ని ప్రజలకు అందజేసి ఫోటోలు దిగి వెళ్లిపోవడంతో ప్రజలు తమ సమస్యలను నేరుగా శాసనసభ్యులకు తెలియజేయవచ్చు అనుకున్న ఎస్ సి ప్రాంత ప్రజలకు గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిరాశను మిగిల్చింది. దీంతో అసహనం వ్యక్తం చేసిన ఆ ప్రాంత ప్రజలు ఫోటోలకే పరిమితమే తప్ప తమ ప్రాంత సమస్యల పరిష్కారాన్ని ఎవరికీ చెప్పుకోవాలో అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కాలనీలో ప్రధానంగా డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని, కూడికలు కూడా తీయడం లేదని, చెత్త ఎత్తుకెళ్లే ట్రాక్టర్ కూడా వీధులలోకి రావడం లేదని మీడియా వద్ద వాపోయారు. కొయ్యలగూడెం ఎస్ సి కాలనీలోని గ్రామపంచాయతీ సర్పంచ్ ముప్పిడి విజయ కుమారి ఇంటి వీధిలో డ్రైనేజీ లేదని ప్రజలు శాసనసభ్యులను అడగగా రూ.3 లక్షలతో డ్రైనేజీని ఎంపీపీ నిధులనుండి నిర్మించాలని శాసనసభ్యులు ఎంపీపీ గంజిమల రామారావుకు తెలిపారు. తొలుత మాజీ ఎంపీపీ మట్టా సత్తిపండు గృహానికి ఎదురుగా ఉన్న సుందరయ్య కాలనీలో డ్రైనేజీ, లో వోల్టేజ్ సమస్య పరిష్కరించాలని కోరారు. త్వరలో సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రజా ప్రతినిధులు అధికారులు పనిచేయాలని తెల్లం బాలరాజు సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యురాలు దాసరి శ్రీలక్ష్మి, ఎంపీడీవో బేబీ శ్రీలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, మండల కన్వీనర్ గొడ్డటి నాగేశ్వరరావు, మంతెన సోమరాజు, గంట శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు సంకు కొండలరావు, వార్డ్ మెంబర్లు పులపల్లి రవికుమార్, ఏలేటి భాస్కరరావు, ప్రభుత్వ కార్యాలయాల అధికారులు, వాలంటీర్లు పాల్గొన్నారు.