వెలుగు చూస్తున్న ఈసీ వరుస వైఫల్యాలు
. 13న ఈవీఎంలు పగలగొడితే 20న కేసు నమోదు
. పోలీస్ వైఫల్యం వల్లే హింస అంటూ సిట్ స్పష్టీకరణ
. నిందితుల అరెస్ట్లోనూ పోలీసుల ఉదాసీనత
. పోలింగ్ తర్వాత సీఎస్, డీజీపీలకు సీఈసీ సమన్లు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం గతంలో ఎన్నడూ లేనంతగా అభాసుపాలైంది. పోలింగ్లో ప్రతి ఒక్క ఓటరూ స్వేచ్ఛగా పాల్గొనేలా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామని పదేపదే ప్రకటనలు గుప్పించిన ఎన్నికల సంఘం…ఆచరణలో ఘోర వైఫల్యం చెందింది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీసులు సహా అనేక మంది ఆసుపత్రుల పాలయ్యారు. అప్పటికీ పోలీస్ యంత్రాంగం అప్రమత్తం కాకపోవడంతో పోలింగ్ తర్వాత రోజు కూడా అనేక ప్రాంతాల్లో ఘర్షణలు తలెత్తాయి. అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఘటనలు జరగడం ఒక ఎత్తయితే… బాధ్యులపై చర్యలు తీసుకోవడంలోనూ ఈసీ వైఫల్యం చెందింది. రాష్ట్రవ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, వాటిలో 12,438 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. వీటిలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఈసీ వెల్లడిరచింది. మొత్తం పోలింగ్ కేంద్రాల్లో మూడో వంతు అంటే 31,385 పోలింగ్ కేంద్రాలను పూర్తిస్థాయిలో లోపలా, బయటా వెబ్క్యాస్టింగ్ ద్వారా జిల్లా, రాష్ట్రస్థాయిల్లో నిరంతరాయంగా పర్యవేక్షించే ఏర్పాట్లు చేపట్టారు. ఇందుకు సుమారు 150 మంది సిబ్బందిని కేటాయించారు. జీరో వయలెన్స్, నూరుశాతం పోలింగ్ లక్ష్యమని ప్రకటించిన ఈసీ…తీరా చూస్తే తొమ్మిది పోలింగ్ కేంద్రాల్లో దౌర్జన్యకారులు ఈవీఎంలను ధ్వంసం చేసి…బీభత్సం సృష్టించారు. రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రాన్ని అత్యంత సమస్యాత్మక కేంద్రంగా ఎన్నికల సంఘం గుర్తించింది. కానీ ఇక్కడ కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లను మాత్రమే భద్రత కోసం వినియోగించారు. ఇదే బూత్లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీప్యాట్ మెషిన్లను నేలకేసి పగులగొట్టారు. అభ్యంతరం వ్యక్తం చేసిన వారిని ఆయన బెదిరించారు. అంతేగాక…అడ్డుకోవడానికి ప్రయత్నించిన టీడీపీ ఏజెంట్పై ఆయన అనుచరులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. విచిత్రమేమిటంటే అక్కడి ఎన్నికల సిబ్బంది ఈవీఎం మెషిన్లను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని ఫిర్యాదు చేయగా…వాటిస్థానంలో కొత్తవాటిని వెంటనే అమర్చే ఏర్పాటు చేసి ఎన్నికల సంఘం చేతులు దులుపుకుంది. ఈవీఎంను ధ్వంసం చేసింది ఎమ్మెల్యే పిన్నెల్లి అని తెలిసినా ఆయనపై కేసు నమోదు చేయలేదు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను నిరంతరం రాష్ట్ర, జిల్లా కేంద్రాల్లో వెబ్క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షించే 150 మంది సిబ్బంది కూడా ఈ ఘటనపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. సిట్ ఏర్పాటు తర్వాత వారు సేకరించిన వీడియోలు కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించి ఆదేశాలిచ్చేవరకు రాష్ట్ర ఎన్నికల సంఘ అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. పోలింగ్ రోజైన 13వ తేదీన ఈవీఎంను ధ్వంసం చేస్తే… ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన తర్వాత 20వ తేదీన స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోలింగ్, ఆ మరుసటి రోజు పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో మొత్తం 33 చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. వీటిపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా జిల్లాల్లో కొందరు పోలీస్ ఉన్నతాధికారులను సస్పెండ్ చేసింది. మరికొందరిపై బదిలీ వేటు వేసింది. ఎమ్యెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడిని హౌస్ అరెస్ట్కు ఆదేశించింది. ఇక్కడ కూడా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం మరోసారి వైఫల్యం చెందింది. పిన్నెల్లి సోదరులిద్దరినీ హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు… వారు లోపల ఉన్నారో, లేరో కూడా పట్టించుకోలేదు. ఫలితంగా బయట పోలీసుల భద్రత కొనసాగుతుండగానే వారు తమకున్న ప్రభుత్వ గన్మెన్లను వదిలేసి అదృశ్యమయ్యారు. అయినప్పటికీ దానిపై డీజీపీ కానీ, ఎన్నికల సంఘం కానీ అంతగా స్పందించలేదు. పిన్నెల్లి సోదరులను హౌస్ అరెస్ట్ చేసిన పోలీస్ అధికారులను ఈ ఘటనకు బాధ్యులను చేయలేదు. పోలీసులు ఇంటిచుట్టూ ఉండగానే వారు ఇంట్లోంచి ఎలా మాయమయ్యారో కనీసం దర్యాప్తుకు కూడా ఆదేశించలేదు. వారికోసం గాలించే ప్రయత్నమూ చేయలేదు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఈవీఎంను ధ్వంసం చేసినా… ఆ పోలింగ్ బూతు ప్రిసైడిరగ్ అధికారి గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఘటనకు పాల్పడినట్లు చెప్పినా పట్టించుకోలేదు. ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. నిజంగా ఆయనెవరో వారికి తెలియదని అనుకోవడానికి పిన్నెల్ని బూతులోకి వచ్చినప్పుడు ఎన్నికల సిబ్బంది మొత్తం గౌరవప్రదంగా లేచి నిలబడడం సీసీ టీవీలో రికార్డు అయింది. అలాగే ఆ పోలింగ్ బూత్కి భద్రతగా ఉన్న కానిస్టేబుళ్లపైనా చర్యల్లేవు. అసలు వారినుంచి వివరణ తీసుకున్న దాఖలాలు కనిపించలేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంత అభాసుపాలైందో పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రం ఘటన ఒక ఉదాహరణ చాలు. ఇక్కడి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో ప్రిసైడిరగ్ అధికారి నుంచి డీజీపీ, సీఎస్, సీఈవో దాకా అన్ని స్థాయిల్లోని అధికారులు విఫలం చెందారని స్పష్టమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన హింసాత్మక ఘటనలపై 33 కేసులు నమోదు చేసిన పోలీసులు… అందుకు బాధ్యులుగా 1370 మందిని గుర్తించి వారిలో 124 మందిని మాత్రమే అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, దేశంలోనే అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గొప్పగా ప్రకటించిన కొద్ది గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు జారీ చేయడం రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణా తీరుకు అద్దం పడుతోంది.