. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ
. పాలకుల కనుసన్నల్లో పనిచేయబోదు
. బీజేపీ తీరుపై డి.రాజా విమర్శ
న్యూదిల్లీ : నియంతృత్వం దిశగా అడుగులు పడుతున్నాయని, ప్రజస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం ఎంతో అవసరమని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శి డి.రాజా నొక్కిచెప్పారు. మోదీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను చెప్పుచేతుల్లో పెట్టుకోవాలని చూస్తోందని వ్యాఖ్యానించారు. కేంద్ర దర్యాప్తు బృందాలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ, సీబీఐ తరహాలోనే ఎన్నికల సంఘం కూడా తమ కనుసన్నల్లోనే పనిచేయాలని కోరుకుంటోందని దుయ్యబట్టారు. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ అని ప్రభుత్వం, అధికార పార్టీ కనుసన్నల్లో అది పనిచేయబోదని అన్నారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో పాటు బీజేపీ నేతలంతా ఈసీని శాసించాలని చూస్తున్నారని సోమవారం ఓ వార్తాసంస్థతో మాట్లాడిన రాజా వ్యాఖ్యానించారు. ‘ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ. ఇది స్వేచ్ఛగా పనిచేయాలి. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి. అన్ని పార్టీలు, అభ్యర్థులకు సమాన అవకాశాలు ఉండేలా చూసుకోవాలి. అధికార పార్టీ లేక ప్రభుత్వం చెప్పినట్లుగా నడుచుకోవడం ఎన్నికల సంఘానికి ఎంత మాత్రం తగదు’ అని రాజా అన్నారు. ఎన్నికల సంఘాన్ని పాలకులు శాశించలేరని నొక్కిచెప్పారు. నిరంకుశత్వాన్ని ప్రతిఘటించాలని… ప్రజాస్వామ్యాన్ని ఆదరించాలని దేశ ప్రజలకు రాజా పిలుపునిచ్చారు. ఇదిలావుంటే, దిల్లీ రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి అధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీలో మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేత మోదీ ప్రభుత్వం ఎన్నికల్లో మ్యాచ్ఫిక్సింగ్కు యత్నిస్తోందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలను హర్దీప్ సింగ్ పూరి ఆక్షేపించారు. అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన రాహుల్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. నోటీసులు జారీచేస్తే సరిపోదని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.