. చంద్రబాబు ఉత్సవ విగ్రహం
. దక్షిణాదిలో బీజేపీకి అవకాశాలు లేవు
. ‘400 పార్’ మిథ్య ` 200 స్థానాలు మించవు
. మోదీ అవినీతి పాలనకు తెర
. రాబోయేది ‘ఇండియా’ ప్రభుత్వం
. సీపీఐ కార్యదర్శి నారాయణ
విజయవాడ: ‘ఎవరు ఎటు పోతే మాకెందుకు… మాకు కావాల్సింది అధికారం’ అన్నట్లుగా దేశంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ వైఖరిగా ఉందని సీపీఐ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. సంక్షేమ పథకాలు ఇచ్చినందున మహిళా ఓట్లు తమ పార్టీకే వస్తాయని సీఎం జగన్మోహన్రెడ్డి…అంతకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పాము కాబట్టి మహిళలు తమకు మొగ్గు చూపుతారని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు ఉత్సవ విగ్రహంగా మారారని విమర్శించారు. రాష్ట్రంలో జగన్ సామ్రాజ్యం నడుస్తోందని వ్యాఖ్యానించారు. ఈసారి మధ్యతరగతి, ఎన్నారైల ఓటింగ్ పెరిగిందని చెప్పారు. స్ట్రాంగ్రూమ్లకు భద్రత సరిగ్గా లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. బీజేపీ 400 పార్ను మిథ్యగా నారాయణ అభివర్ణించారు. ఆ పార్టీకి దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు వచ్చే అవకాశమే లేదని, దేశం మొత్తం 200 స్థానాలకు మించబోవని నారాయణ తెలిపారు. ఈసారి ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టంచేశారు.
ఆంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్నది నిర్ణయించేది ప్రధాని మోదీయే గానీ…. ఆయన మళ్లీ ప్రధాని కాగలిగితేనే అది సాధ్యమని నారాయణ అన్నారు. దేశంలో మోదీకి, బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఆయన ప్రధాని అయ్యే పరిస్థితి లేదని చెప్పారు. ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందని దీమాగా చెప్పారు. దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి సీపీఐ మద్దతిస్తున్నదని, ఆ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ను తప్పుడు కేసులో ఇరికించారని నారాయణ అన్నారు. తనలో సగం ఉండే కేజ్రీవాల్ను చూసి మోదీ ఎందుకు భయపడుతున్నారని చమత్కరించారు. మహిళా నేతను అడ్డం పెట్టుకొని ఆప్ పరువు దిగజార్చే ప్రయత్నాలు చేస్తున్నారని స్వాతి మలివాల్ కేసునుద్దేశించి అన్నారు.
ఈసీ తీరు ఆక్షేపణీయం
ఎన్నికల సంఘం వైఖరిని నారాయణ ఖండిరచారు. ఈసీ పూర్తిస్థాయిలో మోదీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని, ఆయన పర్యటలకు అనుకూలంగా షెడ్యూల్ రూపొందించినట్లు ఉన్నదని ఆరోపించారు. నోటికొచ్చినట్లు కులం, మతం అంటూ మోదీ మాట్లాడుతుంటే… ఈసీ సుద్దులు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ప్రధాని హోదాలో ఉండి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తుండటాన్ని ఆక్షేపించారు. ఈ మధ్య బుల్డోజర్ మాట వినిపిస్తోందన్నారు. తెలంగాణలో బీజేపీ ఎదుగులకు మాజీ సీఎం కేసీఆర్ పద్ధతులే కారణమయ్యాయని విమర్శించారు.
రాజ్యాంగంపై మోదీ బుల్డోజర్
బీజేపీ నేత రాజాసింగ్ గతంలో ‘బుల్డోజర్’ వ్యాఖ్యలు చేశారని, ఉత్తరప్రదేశ్ నుంచి బుల్డోజర్లు తెలంగాణ మీద దాడి చేస్తాయని బహిరంగంగా ప్రకటించారని నారాయణ గుర్తుచేశారు. యూపీ మూక దాడితో తెలంగాణలో విజయం సాధిస్తామన్నది ఆయన మాటల్లో అర్థమన్నారు. ఇప్పుడు అదే భాషను మోదీ ప్రయోగిస్తున్నారని, కాంగ్రెస్ గెలిస్తే పూరీలోని జగన్నాధుడిపై, అయోధ్య రాముడిపై బుల్డోజర్లతో దాడి చేస్తుందని వ్యాఖ్యానిస్తున్నారని, ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. దేవాలయాలపై కాంగ్రెస్ పార్టీ దాడులు చేస్తుందా? గతంలో చేసిందా? బాబ్రీ మసీదు శిలాన్యాసానికి అనుమతి ఇచ్చినది నాటి ప్రధాని రాజీవ్ గాంధీ కాదా? అలాంటి పార్టీ గెలిస్తే ఆలయాలపై దాడి జరుగుతుందా? అని మోదీని నిలదీశారు. రాజ్యాంగంపై బుల్డోజర్లతో దాడి చేసేది మోదీయేనని వ్యాఖ్యానించారు. గుడిపై దాడి జరిగితే ప్రజలు కాపాడుకోగలరు కానీ రాజ్యాంగంపై దాడి చేస్తే కాపాడేది ఎవరంటూ ఆందోళన వ్యక్తంచేశారు. మోదీ ప్రభుత్వానిది కక్షసాధింపు ధోరణి అని అన్నారు. 400 పార్ అంటూ జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నాన్ని మోదీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు 300 స్థానాలంటున్నారని, ఆ పార్టీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తన దృష్టిలో బీజేపీకి 200 స్థానాలు మించవన్నారు.
మోదీ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమన్న అభిప్రాయం దేశ ప్రజల్లో ఉన్నదని చెప్పారు. అవినీతి రహిత పాలన అందిస్తానంటూ అధికారంలోకి వచ్చిన మోదీ… కనీవినీ ఎరుగని రీతిలో అక్రమాలకు తెరతీశారని, గంజాయి స్మగ్లర్ను కుబేరుల సరసన చేర్చారని అదానీని ఉద్దేశించి నారాయణ అన్నారు. దేశంలో 29 మంది ఆర్థిక నేరగాళ్లు ఉండగా ఇందులో ఒకరిద్దరు మినహా అందరూ గుజరాత్కు చెందిన వారేనని చెప్పారు. ఏదిఏమైనా మోదీ అక్రమ సామ్రాజ్యానికి తెర పడబోతుందని, ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని నారాయణ అన్నారు.