అసభ్యకరమైన, అశ్లీల కంటెంట్ ను ప్రసారం చేస్తున్న ఆన్ లైన్ వేదికలపై కేంద్రం కొరడా ఝుళిపించింది. ఆయా ఓటీటీలకు, వెబ్ సైట్లకు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినా అవి ప్రసారం చేసే కంటెంట్ లో మార్పు రాకపోవడంతో వాటిని తొలగిస్తున్నట్లు తెలిపింది. మొత్తం 18 ఓటీటీ ప్లాట్ ఫామ్ లు, 19 వెబ్ సైట్ లు, 10 యాప్ లు, 57 సోషల్ మీడియా ఖాతాలను తొలగించినట్లు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్రం తొలగించిన యాప్ లలో ఏడు గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్నవి కాగా.. మరో మూడు యాపిల్ యాప్ స్టోర్ లో ఉన్నవి.
కేంద్రం తొలగించిన వాటిలో సోషల్ మీడియా ఖాతాలైన ఫేస్ బుక్ లో 12, ఇన్ స్టాగ్రామ్ లో 17, శ లో 16, యూట్యూబ్ లో 12 ఉన్నట్లు తెలిపింది. రెండ్రోజుల క్రితం కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ దేశీయంగా ఉన్న 18 ఓటీటీ వేదికలు అసభ్యకరమైన, అశ్లీల కంటెంట్ ను ప్రసారం చేస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రకటించారు. కాగా.. తాజాగా తొలగించిన ఓటీటీలకు కోటికి పైగా డౌన్ లోడ్స్ ఉన్నట్లు తెలిపారు. ఇవన్నీ సోషల్ మీడియా ద్వారా అశ్లీల కంటెంట్ కు సంబంధించిన ట్రైలర్, వెబ్ లింక్ లను చూపుతున్నాయని తెలిపారు. ప్రతి ఓటీటీ ప్లాట్ ఫామ్ కు 32 లక్షల వ్యూస్ ఉన్నట్లు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఏ ఓటీటీలపై అయినా చర్యలు తప్పకుండా ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపారు.