విశాలాంధ్ర – విజయవాడ : తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలోకి కంటైనర్ వచ్చి వెళ్లడంపై సమగ్ర విచారణ జరపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ డిమాండ్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మంగళవారం మధ్యాహ్న సమయంలో భద్రతా సిబ్బంది రికార్డుల్లో నమోదు కాకుండా ఒక కంటైనర్ సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి వచ్చి… గంట గడిచిన తర్వాత వెళ్లిపోవడం, వెళ్లాల్సిన మార్గంలో కాకుండా రాంగ్ రూటులో వెళ్లడం, రెండో చెక్ పోస్ట్ వద్ద ఉండే ఆటోమేటిక్ స్కానర్వైపు నుంచి కాకుండా వేరే దిశలో కంటైనర్ ను పంపడం, భద్రతా సిబ్బంది రికార్డుల్లో వాహన వివరాలు నమోదు చేయకపోవడం, సిబ్బంది సైతం వాహనాన్ని తనిఖీ చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆ కంటైనర్లో మద్యం అమ్మకాలకు సంబంధించిన అక్రమ సొమ్ము సీఎం వద్దకు చేరిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు. సీిఎం జగన్ పర్యటనల సందర్భంగా పరదాలు, ముళ్లకంచెలు కట్టి అత్యుత్సాహం ప్రదర్శించే పోలీసు అధికారులు కంటైనర్ అక్రమంగా రావడంపై ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత ప్రతిపక్షాల వాహనాలను పదేపదే తనిఖీలు చేస్తున్న పోలీసులు అధికార పార్టీకి చెందిన నేతల వాహనాలను పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. భద్రతావలయం మధ్య ఉండే సీఎం క్యాంపు కార్యాలయానికి అక్రమంగా కంటైనర్ రాకపోకలపై సమగ్ర విచారణ జరపాలని, అందుకు బాధ్యులైన పోలీసు అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.