‘దిల్లీ చలో’ ప్రదర్శనకారులపై బాష్పవాయు గోళాలు
. యువ రైతు మృతితో శంభు సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత
. ప్రదర్శన జరిపి తీరుతామని రైతు నేతల స్పష్టీకరణ
. చర్చలకు ఆహ్వానించిన కేంద్రం
చండీగఢ్ : కేంద్రంలోని మోదీ సర్కార్ కర్షకులపై కర్కశత్వం ప్రదర్శిస్తోంది. రైతుల న్యాయమైన ఉద్యమాన్ని అణచివేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. పోలీసు బలగాలతో, బాష్పవాయు గోళాల ప్రయోగంతో యువ రైతు ప్రాణాన్ని బలిగొంది. వందల మంది రైతులు గాయపడటానికి కారణమైంది. రైతుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా వేలసంఖ్యలో పోలీసు బలగాలను మోహరించి, బారికేడ్లు, ముళ్ల కంచెలు, సిమెంట్ దిమ్మెలు అడ్డుపెట్టి కర్షకుల గొంతును కర్కశంగా నొక్కి వేసేందుకు పూనుకుంది. బుధవారం శంభు సరిహద్దులో హర్యానా పోలీసులు ప్రయోగించిన బాష్పవాయు గోళాలు, రబ్బర్ బుల్లెట్లు, పోలీసు బలగాల దాడుల్లో ఇప్పటివరకు 160 మందికి పైగా అన్నదాతలు గాయపడ్డారు. వారిలో కొంతమందిని పాటియాలాలోని రాజేంద్ర హాస్పిటల్కు తరలించారు. తీవ్రంగా గాయపడిన ఒక రైతు మరణించాడని రైతు నాయకులు ధ్రువీకరించారు. కాగా, బుధవారం నాటి ఘర్షణ తర్వాత, పాదయాత్ర కొనసాగుతుందని, బారికేడ్లు కూల్చివేస్తామని రైతు నాయకులు తెలిపారు. తమ పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంతో నాలుగో దఫా చర్చలు జరిపి విఫలమవడంతో రైతులు తమ నిరసనను పునః ప్రారంభించారు. ఈ క్రమంలో హర్యానాలోని అంబాలా సమీపంలోని శంభు సరిహద్దు పాయింట్ వద్ద బారికేడ్ల బహుళ పొరల వైపు వెళ్లడం ప్రారంభించిన కొంతమంది రైతులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. మధ్యాహ్నానికి కనీసం మూడు రౌండ్ల బాష్పవాయు గోళాల ప్రయోగం జరిగింది. ఇందుకోసం శంభు వద్ద భద్రతా సిబ్బంది డ్రోన్ను మోహరించారు. పంజాబ్-హర్యానా సరిహద్దులోని ఖనౌరీలో కూడా రైతులు బారికేడ్ల వైపు వెళ్లడంతో అక్కడా పోలీసులు బాష్పవాయువుతో చెదరగొట్టారు. దీంతో ఖనౌరీ సరిహద్దుకు సమీపంలో ఉన్న ప్రాంతాన్ని పొగ చుట్టుముట్టడంతో రైతులు రక్షణ కోసం పరుగులు తీయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. చాలామంది నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు ఆ పొగ నుంచి తమను తాము రక్షించుకోవడానికి మాస్కులు, రక్షణ అద్దాలు ధరించి కనిపించారు. అయితే శంభు, ఖనౌరీ సరిహద్దు పాయింట్ల వద్ద పంజాబ్ రైతులకు, హర్యానా పోలీసులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. బారికేడ్లకు అవతలివైపు రైతుల కార్యకలాపాలపై నిఘా ఉంచేందుకు పోలీసులు డ్రోన్లు ఉపయోగించారు. సరిహద్దు పాయింట్ల వద్ద రైతులు శాంతియుతంగా ఉండాలని రైతు నాయకులు కోరారు. నిరసన స్థలాల వద్ద రైతు నాయకులచే నియమించబడిన వలంటీర్లు యువ రైతులను ముందుకు కదలవద్దని కోరారు. శంభు వద్ద నిరసనకారులనుద్దేశించి సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం`రాజకీయేతర) నాయకుడు జగ్జీత్ సింగ్ దలేవాల్ మాట్లాడుతూ మనం గెలవాలంటే శాంతిభద్రతలు కాపాడాలని కోరారు. ‘మీరు గెలవాలనుకుంటున్నారా లేదా?’ అని రైతులను ప్రశ్నించారు. ఇప్పుడు రద్దు చేయబడిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020-21 ఆందోళన సందర్భంగా రైతుల ‘విజయం’ గురించి ఆయన ప్రస్తావించారు. ఆందోళనను దెబ్బతీసే అంశాల పట్ల రైతులు జాగ్రత్తగా ఉండాలని దలేవాల్ హెచ్చరించారు. అంతకుముందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులు శాంతియుతంగా దిల్లీ వైపు పాదయాత్ర చేస్తారన్నారు. ‘శాంతికి భంగం కలిగించడం మా ఉద్దేశం కాదు’ అని నొక్కి చెప్పారు. రైతుల డిమాండ్లపై కేంద్రం ‘జాప్యం చేసే వ్యూహాలకు’ పాల్పడుతోందని ఆరోపిస్తూ… అన్నదాతలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు దిల్లీ వైపు వెళ్లకుండా పంజాబ్-హర్యానా సరిహద్దు పాయింట్ల వద్ద ప్రభుత్వం అనేక పొరల బారికేడ్లు ఏర్పాటు చేయడాన్ని ఆయన ఖండిరచారు. ‘మరో దఫా చర్చలు జరపాలని కేంద్రమంత్రి అర్జున్ ముండా మాట్లాడుతున్నారు.ఏదైనా చర్చలు జరగాలంటే, అది ఎంఎస్పీ హామీ చట్టం చుట్టూ ఉండాలని మేము అతనికి చెప్పాం’ అని అన్నారు. రైతుల నిరసనపై మీరట్లో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేష్ తికైత్ మాట్లాడుతూ ‘ఈ ఉద్యమం కొనసాగుతుంది. చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం లభిస్తుంది. ఎస్కేఎం గురువారం సమావేశమై ఏమి చేయాలో నిర్ణయిస్తుంది’ అని స్పష్టం చేశారు. రైతు మరణానికి భగవంత్ మాన్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్ ఖైరా ఖండిరచారు. ‘పంజాబ్ భూభాగంలోకి హర్యానా పోలీసుల కఠోర చొరబాటు’కు ముఖ్యమంత్రి మూగ ప్రేక్షకుడిగా మారారని ఆరోపించారు. కాగా, పోలీసు కాల్పుల కారణంగానే మరణం సంభవించిందని రైతు నాయకుడు సర్వాన్ పంధేర్ ఆరోపించారు. ఇదిలాఉండగా, హర్యానా పోలీసుల నుంచి ఇప్పటివరకు భద్రతా విధుల్లో పాల్గొన్న ముగ్గురు పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం నాటి ఘటనలో 12 మంది పోలీసులు గాయపడ్డారని జింద్ ఎస్పీ సునీల్ కుమార్ తెలిపారు.