తులం రూ.70వేలు పైనే!
న్యూదిల్లీ : బంగారం ధర మళ్లీ పెరిగింది. పసిడి ధర సరికొత్త గరిష్ఠాలకు చేరింది. బులియన్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 క్యారెట్లు) ధర సోమవారం సాయంత్రం నాటికి రూ.70,978 (పన్నులతో కలిపి) పలుకుతోంది. అంతక్రితం రోజుతో పోలిస్తే రూ.వెయ్యికి పైగా పెరగడం గమనార్హం. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ పెరగడంతో దేశీయంగానూ ధరలు పెరుతున్నాయి. వెండి సైతం కిలో రూ.1,120 మేర పెరిగి రూ.78,570కి చేరింది. ఇటీవల అమెరికాలో వెలువడిన ద్రవ్యోల్బణ గణాంకాలు ఆశించిన స్థాయిలో ఉన్నాయి. దీంతో జూన్ నుంచి వడ్డీ రేట్లు తగ్గించొచ్చన్న అంచనాలు బలపడ్డాయి. పసిడికి గిరాకీ బాగుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్లో సీనియర్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ తెలిపారు. దీనికితోడు చైనా నుంచి డిమాండ్ పెరగడమూ మరో కారణమన్నారు. అంతర్జాతీయ విపణిలో స్పాట్ గోల్డ్ ఔన్స్ (31.10 గ్రాములు) 2,265.73 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. త్వరలో పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ సహా అమెరికా నుంచి వెలువడాల్సిన కీలక గణాంకాలు ఫెడరల్ రిజర్వ్ పరపతి విధాన నిర్ణయాలను నిర్దేశించొచ్చని బీఎన్పీ పారిబాస్ అసోసియేట్ వైస్ అధ్యక్షుడు ప్రవీణ్సింగ్ తెలిపారు.