ట్రాక్టర్లు, ఆటోలను తాళ్లతో లాగుతూ వినూత్న నిరసన
సంపద సృష్టించడం తెలియని సీఎం వల్లే ఈ భారం : నేతల ధ్వజం
అమరావతి : రాష్ట్రంలో భారీగా పెరిగిన పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యవసరాల ధరలను నిరసిస్తూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో వివిధ రూపాల్లో నిరసన ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధరల పెంపునకు నిరసనగా ప్లేకార్డ్స్, బ్యానర్లు చేబూని పాదయాత్రలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కొన్ని చోట్ల ఎడ్లబండ్లపై ర్యాలీలు నిర్వహించగా మరి కొన్ని చోట్ల ట్రాక్టర్, ఆటోలను తాళ్లతో లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. పాడేరులో అర్థనగ్న ప్రదర్శన నిర్వహించగా, కుప్పంలో తెలుగు మహిళలు వంటా
వార్పూ కార్యక్రమం ద్వారా నిరసన తెలిపారు. కొన్ని నియోజకవర్గాల్లో గ్యాస్ బండలతో పాడె మోస్తూ నిరసన తెలియజేశారు. ఇకనైనా పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కల్పిం చాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా గల రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని విమర్శించారు. పెట్రోల్పై వ్యాట్ 31శాతం, డెవలప్మెంట్ సెస్ రూ.4, రోడ్ డెవలప్మెంట్ సెస్ రూపాయి. డీజిల్పై వ్యాట్ 22.25, డెవలప్మెంట్ సెస్ రూ.4, రోడ్ డెవలప్మెంట్ సెస్ రూపాయి వసూలు చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు చేయకున్నా, రోడ్డు సెస్ పేరుతో ప్రతి లీటరు పెట్రోలు, డీజిల్పై రూపాయి చొప్పున వసూల్ చేస్తున్నారని, ఆ సొమ్ము ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆదాయం కోసం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి, సంక్షే మం పేరుతో హడావిడి చేస్తూ పేదోడికి గోచీ కూడా మిగలకుండా దోచేస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో పెట్రోల్ ధర రూ.70లు ఉంటేనే నానా యాగీ చేసిన జగన్రెడ్డి అధికారంలోకి వచ్చాక అడ్డగోలుగా పన్నులు విధిస్తున్నారని, దీనికి ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. డీజిల్ ధర పెంచడంతో నిత్యావసరాల ధరలు తారాస్థాయికి చేరాయని, ఈ భారానికి జగన్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మరోవైపు వంట గ్యాస్పై ఉన్న వ్యాట్ను 14.5శాతం నుండి 24.5శాతానికి పెంచి, ఆడపడుచులు భయపడే పరిస్థితులు తీసుకువచ్చారన్నారు. 2020 డిసెంబర్ నాటికి రూ.681 ఉన్న గ్యాస్ సిలిండర్, జగన్ రెడ్డి చేతకానితనంతో ఏకంగా రూ.900కి ఎగబాకిందన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో పోలీసులు అరెస్ట్ల పర్వం కొనసాగించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, పోలిట్బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు, గుమ్మడి సంధ్యారాణి, చింతకాయల అయ్యన్నపాత్రుడు, వంగలపూడి అనిత, నిమ్మకాయల చినరాజప్ప, కొల్లు రవీంద్ర, బొండా ఉమామహేశ్వర రావు, కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇన్చార్జులు పాల్గొన్నారు.