. త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాలు ప్రకటించాలి
. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఓట్ల లెక్కింపును జూన్ నాల్గో తేదీన అత్యంత పకడ్బంధీగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు. ఎన్నికల ఫలితాల ప్రకటన విషయంలో ఏమాత్రం జాప్యం చేయకుండా భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాలను ప్రకటించాలన్నారు. ఐదు దశల్లో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల సీఈవోలు, ఆయా నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లాల ఎన్నికల అధికారులతో ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సందుతో కలసి సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి ఓట్ల లెక్కింపునకు చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. రాజీవ్ కుమార్ మాట్లాడుతూ దశలవారీ దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు సమిష్టి కృషితో విజయవంతంగా జరుగుతున్నాయని అభినందించారు. అదే స్ఫూర్తితో ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలన్నారు. ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. పాస్ లేకుండా ఎవరినీ అనుమతించవద్దన్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పవర్ బ్యాక్అప్, ఫైర్ సేఫ్టీ పరికరాలను, అత్యవసర ఆరోగ్య సేవలు అందజేసేందుకు అంబులెన్సులను కూడా సిద్దంగా ఉంచుకోవాలన్నారు. ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపు నకు సంబంధించి ఎన్నికల అధికారులు, సిబ్బందికి ముందస్తుగానే సరైన శిక్షణనివ్వాలన్నారు. సుశిక్షితులైన ఎన్నికల సిబ్బందితో పాటు కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్ వంటి పరికాలను ముందస్తుగా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద సిద్దంగా ఉంచుకోవాలన్నారు. ఈవీఎంలను ఎడాపెడా పడేయకుండా ఒక క్రమపద్దతిలో తీసుకురావడం, ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తదుపరి ‘లెక్కింపు పూర్తి అయినట్లు’గా ఆయా ఈవీఎంలపై మార్కుచేస్తూ వెంటనే వాటిని సీల్ చేసి ఒక క్రమపద్ధ్దతిలో సురక్షితంగా భద్రపర్చాలన్నారు. అనవసరంగా ఈవీఎంలను అటూఇటూ కదిలించవవద్దని సూచించారు. ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ పోస్టల్ బ్యాలెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను చక్కగా నిర్వహించాలని, వాటి లెక్కింపునకు సంబంధించి ప్రత్యేకంగా టేబుళ్లను, స్కానర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్నికల ఫలితాలను ప్రకటించే విషయంలో ఆలస్యం చేయవద్దని, డిస్ప్లే బోర్డుల ద్వారా ఎప్పటి కప్పుడు ఖచ్చితమైన ఎన్నికల ఫలితాలను ప్రకటించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా, అదనపు సీఈఓలు పీి కోటేశ్వరరావు, ఎమ్.ఎన్ .హరేంధిర ప్రసాద్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.