అన్ని విమానాశ్రయాల్లో నిఘా
ఈవీఎం ధ్వంసం కేసులో 10 సెక్షన్ల కింద కేసులు
పోలీసుల విస్తృత గాలింపు
ఇస్నాపూర్ గెస్ట్హౌస్లో అరెస్ట్ అయినట్లు వదంతులు
ధృవీకరించని పోలీసు అధికారులు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఈనెల 13వ తేదీ పోలింగ్ సందర్భంగా మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్లు ధ్వంసం చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఐపీసీ, ప్రజాప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ 143, 147, 448, 427, 353, 452, 120 బి, ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి. ఈనెల 20వ తేదీనే పిన్నెల్లిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడిరచారు. పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అన్ని విమానాశ్రయాలను ఏపీ పోలీసులు అప్రమత్తం చేశారు. ఆ మేరకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తెలంగాణలో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీస్ ప్రత్యేక బృందాలు హైదరాబాద్కు చేరుకున్నాయి. పల్నాడు జిల్లా ఎస్పీ అధ్వర్యంలో ఈ బృందాలను ఏర్పాటు చేశారు. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. పిన్నెల్లి సంగారెడ్డి వైపు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్హౌస్లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇస్నాపూర్ లోకేషన్ గురించి పటాన్చెరు పోలీసుల సహకారంతో మాచర్ల పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే పిన్నెల్లి అరెస్టును పోలీసులు ధృవీకరించలేదు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేను ఇప్పటి వరకూ ఎందుకు అరెస్టు చేయలేదని ఈసీ మండిపడిరది. పిన్నెల్లిని తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశించింది. ఈ ఘటనపై సాయంత్రం 5లోగా నివేదిక ఇవ్వాలని పేర్కొంది. అలాగే మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రం 202తోపాటు ఏడు కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. వీటికి సంబంధించిన అన్ని వీడియో ఫుటేజీలను జిల్లా ఎన్నికల అధికారులు తమకు అందజేశారని, దీంతో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం… ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి చెప్పాలని సీఈఓ ముకేశ్ కుమార్ మీనాను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆ మేరకు ఆయన డీజీపీని ఆదేశించగా, పిన్నెల్ని అరెస్ట్ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు.