అదానీ బొగ్గు కుంభకోణంపై జేపీసీ విచారణ: కాంగ్రెస్
న్యూదిల్లీ : ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అదానీ బొగ్గు కుంభకోణంపై జేపీసీతో విచారణ జరిపిస్తామని, ప్రతి పైసా లెక్క తేలుస్తామని కాంగ్రెస్ బుధవారం హామీనిచ్చింది. నాసిరకం బొగ్గును మూడు రెట్లు ఎక్కువ ధరకు తమిళనాడు పీఎస్యూకు అదానీ గ్రూపు విక్రయించి భారీగా లాభాలు గడిరచిందని ఆరోపించింది. బీజేపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమ కార్యకలాపాలు అన్నింటిపై దర్యాప్తు జరిపిస్తామని నొక్కిచెప్పింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘ఎక్స్’ మాధ్యమంగా స్పందిస్తూ ‘బీజేపీ హయాంలో భారీ బొగ్గు కుంభకోణం జరిగింది. ప్రధాని మోదీకి ఎంతో ఇష్టమైన అదానీ వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. నాసిరకం బొగ్గును మూడు రెట్లు ఎక్కువకు విక్రయించిన పర్యవసానంగా విద్యుత్ బిల్లులు భారీగా పెరిగాయి. ఆ భారాన్ని సామాన్యులు భరించాల్సి వచ్చింది’ అని వ్యాఖ్యానించారు. అదానీ అవినీతిపై ఈడీ, సీబీఐ, ఐటీ మౌనం వహించేందుకు ఎన్ని టెంపోలు పట్టాయో ప్రధాని చెప్పగలరా అని రాహుల్ ప్రశ్నించారు. జూన్ 4న ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని, నెలలోగా మెగా కుంభకోణంపై దర్యాప్తు జరిపిస్తుందని, ప్రజల నుంచి దోచుకున్న ప్రతి ఒక్క రూపాయికి లెక్క తేలుస్తుందని ఆయన స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ కూడా ఒక ప్రకటనలో మోదానీ మెగా స్కామ్ అంటూ వ్యాఖ్యానించారు. 2014లో ఇండోనేసియా నుంచి అదానీ కొనుగోలు చేసిన నాసిరకం బొగ్గుకు సంబంధించి కొన్ని డజన్ల షిప్మెంట్లు జరిగినట్లు ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు (ఓసీసీఆర్పీ) విచారణలో తేలినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక నివేదించిందని తెలిపారు.
తక్కువ ధరకు కొని మూడు రెట్లు అధిక ధరకు తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ (టాంగ్జెడ్కో)కు అదానీ సంస్థ విక్రయించిందని, దాంతో అదానీకి రూ.3 వేలకోట్ల లాభం వచ్చిందని వెల్లడిరచారు. దీనివల్ల విద్యుత్ బిల్లులు పెరిగి సామాన్యుల జేబుకు చిల్లు పడిరదని, వాయు కాలుష్యం పెరిగిందని ఆరోపించారు. చట్టాలను అత్రికమించి, సామాన్యులను దోచుకుంటూ ప్రధాని ఆప్తమిత్రులు ఈ పదేళ్లలో ఏ విధంగా పబ్బం గడుపుకున్నారనే దానికి ఇది ఉదాహరణ మాత్రమేనన్నారు. వాయుకాలుష్యం వల్ల ఏటా 20 లక్షల మంది భారతీయులు చనిపోతున్నారని తెలిపారు. అమృత కాలమన్నది ప్రధానికి, ఆయన ఆశ్రిత పెట్టుబడిదారీ మిత్రులకేనని… మిగతా వారి కోసం ఇది విష కాలమని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. అక్రమాలు, అవినీతిపై దర్యాప్తులను స్తంభింపజేయడం ద్వారా అదానీకి ప్రధాని ఎంతగానో సాయం చేశారని ఆరోపించారు. నిజం తెలిసినప్పటికీ తన భాగస్వామిని కాపాడుకునేందుకు ఆయన ఎంత కష్టపడ్డారో ఇండోనేసియా, ఇతర దేశాల సమాచారం ద్వారా తెలుస్తోందని జైరాం రమేశ్ అన్నారు.
బొగ్గుకు సంబంధించి ఓవర్ ఇన్వాయిసింగ్లో సూత్రధారులు… అదానీ సహచరులు నాసర్ అలీ షాబాన్, చాంగ్ చుంగ్ లింగ్ పాత్రను ఓసీసీఆర్పీ గతంలోనే తేల్చిందని తెలిపారు.
‘ఓవర్ ఇన్వాయిసింగ్ నిందితులు ఎంత మంది అరెస్టు అయ్యారు… వారి ఆస్తులను ఈడీ ఎంత మేరకు అటాచ్ చేసింది వంటి రికార్డుల్లో తెలుస్తాయి. అయితే ‘మోదానీ’ ఎలాంటి పర్యవసానాలను ఎదుర్కోలదు’ అని జైరాం రమేశ్ అన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఈ పరిస్థితి మారిపోతుందని ఆయన నొక్కిచెప్పారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా మోదానీ మెగా కుంభకోణంపై విచారణ జరుగుతుందని, మోదీ`అదానీ కలిసి దోచుకున్న అవినీతి సొమ్ములోని ప్రతి పైసా లెక్క తేలుతుందని జైరాం రమేశ్ పేర్కొన్నారు.