కేజ్రీవాల్కు సుప్రీం సూచన… తీర్పు రిజర్వు
న్యూదిల్లీ : మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసే అంశంపై మంగళవారం విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం…లోక్సభ ఎన్నికల వేళ ఓ పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడిరది. ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే ముఖ్యమంత్రిగా అధికారిక బాధ్యతలు నిర్వర్తించొద్దని సూచించింది. అయితే, ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. మరోవైపు, ఈ కేసులో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని దిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు మే 20వ తేదీ వరకు పొడిగించింది. ఈ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణకు సమయం పట్టే అవకాశం ఉన్నందున మధ్యంతర బెయిల్ పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఇది అసాధారణ పరిస్థితి. అరవింద్ కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న ఓ ముఖ్యమంత్రి. తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదు. లోక్సభ ఎన్నికలు ఐదేళ్లకోసారి వస్తాయి. పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది’ అని వ్యాఖ్యానించింది. అయితే, సుప్రీం అభిప్రాయాన్ని ఈడీ వ్యతిరేకించింది. ‘సీఎం అయినంత మాత్రాన ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించకూడదు. కేసుల్లో రాజకీయ నాయకులకు మినహాయింపులు ఉండకూడదు. ఇప్పుడు బెయిల్ మంజూరు చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. కేజ్రీవాల్ ఈ కేసులో దర్యాప్తునకు సహకరించలేదు. 9 సమన్లను పట్టించుకోలేదు. అందుకే అరెస్టు చేయాల్సి వచ్చింది’ అని ఈడీ కోర్టుకు తెలిపింది. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ ‘ఒకవేళ ఈ కేసులో మీకు బెయిల్ మంజూరు చేస్తే అధికారిక విధులు నిర్వర్తించేందుకు మేం అనుమతించబోం. అలా చేస్తే ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటుంది. బెయిల్పై విడుదలైతే ఫైళ్లపై సంతకాలు చేయొద్దు’ అని స్పష్టంచేసింది. దీనికి కేజ్రీవాల్ తరపు న్యాయవాది మాట్లాడుతూ సీఎం ఎలాంటి పత్రాలపై సంతకాలు చేయరని, అయితే ఆ కారణంతో లెఫ్టినెంట్ గవర్నర్ వాటిని తిరస్కరించకుండా చూడాలని కోరారు. రెండు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం… మధ్యంతర బెయిల్పై తీర్పును రిజర్వ్ చేసింది. తొలుత అరెస్టుకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం విచారణ జరిపింది. దర్యాప్తులో జరుగుతున్న ఆలస్యంపై సుప్రీం అసహనం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ అరెస్టు ముందు నాటి కేసు ఫైళ్లను సమర్పించాలని ఈడీని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు సంస్థ వాటిని ధర్మాసనం ముందు ఉంచింది.
కేజ్రీవాల్ కస్టడీ పొడిగించిన దిల్లీ కోర్టు
దిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. గతంలో విధించిన కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు కేజ్రీవాల్ను మంగళవారం కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ సందర్భంగా… కేసు పురోగతిలో ఉందని, కేజ్రీవాల్ కస్టడీ పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. వాదనలు విన్న ప్రత్యేక న్యాయస్థానం కేజ్రీవాల్ కస్టడీని మే 20వ తేదీకి పొడిగిస్తూ తీర్పు చెప్పింది.