బస్సుయాత్రలో జగన్ అభ్యర్థన
విశాలాంధ్ర – తుగ్గలి : ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బస్సుయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగింది. మేము సిద్ధం అంటూ జగన్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. రోడ్షోలు, మహిళలు, యువత, మేధావులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బస్సుయాత్ర నాల్గవ రోజు కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో జరిగింది. శనివారం ఉదయం మండలంలోని రాతన, తుగ్గలి, గిరిగేట్ల, జొన్నగిరి, ఎర్రగుడి, చెరువు తండాలలో జగన్ రోడ్ షో నిర్వహించారు. రాతన గ్రామంలో జరిగిన రోడ్ షోలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు ఆర్వీ మోహన్రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి, సర్పంచ్ రాచప్ప ఆధ్వర్యంలో క్రేన్తో గజమాలను జగన్కు వేసి…ఘనస్వాగతం పలికారు. బస్సుయాత్రకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ముఖాముఖిలో ముఖ్యమంత్రి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను జగన్కు విన్నవించారు. రాతన గ్రామంలో సర్పంచ్ రాచప్ప మాట్లాడుతూ హంద్రీనీవా ద్వారా నీళ్లు మళ్లించేందుకు వేసిన పైప్ లైన్ నిర్మాణ పనులు తమ చెరువు వద్ద పూర్తయ్యాయని తెలిపారు.భవిష్యత్తులో రైతాంగానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన సీఎం కు తెలియజేశారు. పొలం పనులు చేసుకుంటున్న మహిళలను చూసిన జగన్ బస్సు దిగి ఆప్యాయంగా పలకరించారు. తుగ్గలిలోని తమ్మారెడ్డి కుటుంబంలో కరోనా సమయంలో మరణించిన ప్రతాప్ రెడ్డి, ప్రహ్లాద రెడ్డి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. తిమ్మారెడ్డి కుటుంబానికి అండగా ఉంటానని ముఖ్యమంత్రి తెలిపారు. అనంతరం తుగ్గలిలో ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ వివక్ష లేకుండా అందరికీ నేరుగా నగదు బదిలీ చేశామని, గ్రామాల అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని చెప్పారు. లంచాలు లేని పాలన అందించామన్నారు. రాతన,తుగ్గలిలో తొంభై ఐదు శాతం ఇళ్లకు లబ్ధి చేకూర్చామన్నారు.
తుగ్గలి గ్రామపంచాయతీలో వివిధ పథకాల ద్వారా 29.65 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామన్నారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరించారు. మీ కుటుంబంలో మీకు న్యాయం జరిగిందనిపిస్తే తమ పార్టీకి ఓటేయాలని అభ్యర్ధించారు. కాగా, ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు రుణమాఫీ చేర్చాలని ప్రజలు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. రోడ్ షోలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త రామసుబ్బారెడ్డి, మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, వైపీనీ ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య, ఎమ్మెల్యే శ్రీదేవి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి, స్థానిక నాయకులు తుగ్గలి శ్రీనివాస్ రెడ్డి, రమణారెడ్డి, మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రాతన మోహన్ రెడ్డి, జగన్నాథ్ రెడ్డి, జిట్టా నాగేశ్, హనుమంతు, గోపాల్ రెడ్డి, బసిరెడ్డి, నాగభూషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.