వాసుదేవరెడ్డి పాత్రపై ఆధారాల సేకరణ
తక్కువ రకం బ్రాండ్లు 35 నుంచి 2కి కుదింపు
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై సీఐడీ దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. మద్యం తయారీ కేంద్రాలు, విక్రయాల్లో జరిగిన అక్రమాల తీరుపై అధికారుల నుంచి వివరాలు సేకరిస్తోంది. విచారణలో భాగంగా మద్యం అక్రమాల్లో అప్పట్లో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీతో పాటు డిస్టిలరీల కమిషనర్గా పని చేసిన వాసుదేవరెడ్డి పాత్రపై దర్యాప్తు కొనసాగిస్తోంది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీతో పాటు డిస్టిలరీల కమిషనర్గా జగన్ ప్రభుత్వం వాసుదేవరెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కమిషనర్లకు కూడా ఫైళ్లు పంపించాల్సిన అవసరం లేకుండా నిర్ణయాలు తీసుకునేలా అధికారాలు ఇచ్చింది. దీంతో తాను తల్చుకుంటే ఉన్నతాధికారులను సైతం బదిలీ చేయించగలనంటూ వాసుదేవరెడ్డి బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. మద్యం కొనుగోళ్ల లోనూ భారీగా అవకతవకలకు ఆయన తెరలేపారు. ఒకే రకమైన బ్రాండ్ మద్యాన్ని తెలంగాణ కంటే అధిక ధరకు కొనుగోలు చేసినట్టు విచారణలో సీఐడీ గుర్తించింది. వాసుదేవ రెడ్డి అక్రమాలు అంచనాకు అందడం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. బినామీ పేర్లతో కొన్ని డిస్టిలరీ వ్యాపారాల్లోకి ఆయన చొరబడినట్లు సీఐడీ చెబుతోంది. తక్కువ ధర బ్రాండ్ల కొనుగోలును జగన్ ప్రభుత్వం గణనీయంగా తగ్గించేసింది. 2014-2019 మధ్యలో తక్కువ రేటు ఉన్న మద్యం బ్రాండ్లు 32 రకాలు అందుబాటులో ఉంటే… వైసీపీ ప్రభుత్వం రెండుకి కుదించింది. వాటినే అధిక ధరలకు విక్రయించి జగన్ ప్రభుత్వం సొమ్ము చేసుకుందని సీఐడీ అధికారులు ఆరోపించారు. కొన్ని ప్రీమియం బ్రాండ్ల తరహాలోనే వాటి పేర్లు పెట్టి… మద్యం ఉత్పత్తి, విక్రయాలు చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లభ్యం కాని జే బ్రాండ్లు మార్కెట్లోకి తెచ్చి… వాటిని అధిక ధరలకు అమ్మి జగన్ ప్రభుత్వం సొమ్ము చేసుకున్నట్లు నిర్థ్ధారించారు.
సబ్ లీజుల పేరుతో 11 డిస్టిలరీలను జగన్ అనుచరులు హస్తగతం చేసుకున్నట్లు విచారణలో సీఐడీ గుర్తించింది. జే గ్యాంగ్ హస్తగతం చేసుకున్న డిస్టిలరీల నుంచే 65 శాతం మేర వాసుదేవరెడ్డి మద్యం కొనుగోళ్లు చేశారు. 2014-19 మధ్య కాలంలో ఉన్న టాప్ 5 బ్రాండ్ల మద్యాన్ని 2019 తర్వాత కొనడం ఆపివేశారు. అప్పుల చెల్లింపుల కోసం మద్యం ఆదాయాన్ని, ఏపీ రాష్ట్ర అభివృద్ధి సంస్థకు రూ.14,276 కోట్లు మళ్లించినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. ఇలాంటి అనేక అక్రమాలను సీఐడీ అధికారులు లోతుగా దర్యాప్తు చేసి వెలికి తీస్తున్నారు.