మోదీ ఎన్ని వేషాలు వేసినా 400 సీట్లు రాలేదు
చంద్రబాబు, నితీశ్ మద్దతు లేకుండా ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యం
అయోధ్యలోనూ బీజేపీని ఓడిరచారు
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
విశాలాంధ్ర – హైదరాబాద్: ప్రధాని మోదీ ఎన్ని వేషాలు వేసినా బీజేపీ ప్రకటించిన 400 సీట్లు సాధించలేకపోయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, బీహార్ సీఎం నితీశ్కుమార్ మద్దతు లేకుండా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి బీజేపీకి లేదని, మోదీ ప్రధాని కాలేరని చెప్పారు. చివరకు రామాలయం నిర్మించామని గొప్పగా ప్రచారం చేసుకున్న అయోధ్యలోనే బీజేపీని ప్రజలు ఓడిరచారని నారాయణ అన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడిన మొట్టమొదటి ప్రధాని మోదీయేనని, ఆయన హయాంలో అవినీతి, కుంభకోణాలు పెరిగాయని విమర్శించారు. మతోన్మాదాన్ని పెంచి పోషించిన మోదీకి, బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. మతోన్మాద బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలన్నా… లౌకిక, ప్రజాస్వామ్య వ్యవస్థలు బలపడాలన్నా… నిబద్ధతగల రాజకీయ పార్టీలు అవసరమన్నారు. హైదరాబాద్ హిమాయత్నగర్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో కలిసి నారాయణ మాట్లాడారు. అనేక రాష్ట్రాల లో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలను కాంగ్రెస్ పార్టీ కలుపుకుపోలేదని, ఏకపక్షంగా వ్యవహరించిందని నారాయణ విమర్శించారు. తమిళనాడును చూసి కాంగ్రెస్ నేర్చుకోవాలని, తమిళనాడు ఫార్మూలాను దేశమంతా అమలు చేసి ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదని చెప్పారు. బీజేపీ వంటి ప్రమాదకర పార్టీని ఓడిరచాలంటే రాజకీయ ఐక్యత అవసరమని సూచించారు. అందుకోసం తాము ప్రయత్నిస్తే సీట్ల సర్దుబాటు అంశంలో తమకు ఓట్లు, సీట్లు లేవని చెప్పారని, ఏపీలో బీజేపీకి ఎంత బలముందని, ఎన్ని ఓట్లు ఉన్నాయని ఆరు ఎంపీ స్థానాలు, పది అసెంబ్లీ స్థానాలను చంద్రబాబు కేటాయించారని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల్లో వామపక్షాల బలం పెరిగిందన్నారు. రానున్న రోజుల్లో దేశంలో సంకీర్ణ ప్రభుత్వం తప్పదని, భాగస్వామ్య పక్షాలు సంకీర్ణ ధర్మం పాటించాలని, అప్పుడే మరింత అభివృద్ధి సాధ్యమని నారాయణ అన్నారు. కూటమి రూపొందించుకున్న మార్గదర్శకాలకు అనుగుణంగా అంగీకృత విధానాలు అమలు చేస్తూ పరిపాలన సాగాలన్నారు. కమ్యూనిస్టుల వల్లనే కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉన్నదని, కమ్యూనిస్టుల చొరవతోనే గ్రామాలలో స్థిరమైన ఆర్థిక వ్యవస్థ ఉన్నదని నాటి కేంద్రమంత్రి చిదంబరం సాక్షాత్తూ పార్లమెంటులో చెప్పిన విషయాన్ని నారాయణ గుర్తు చేశారు. యూపీఏ`1లో కమ్యూనిస్టుల భాగస్వామ్యంతో అనేక ప్రజాప్రయోజన చట్టాలు వచ్చాయన్నారు.
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయని నారాయణ అన్నారు. పార్టీ ఫిరాయింపులను వైఎస్ ప్రొత్సహిస్తే… చంద్రబాబు, ఆ తర్వాత జగన్ కొనసాగించారని, ఇప్పుడు రేవంత్రెడ్డి కూడా కొనసాగిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకు కాంగ్రెస్ టికెట్ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. అందుకే దానం నాగేందర్, రంజిత్రెడ్డిలను ప్రజలు ఓడిరచారన్నారు. కేసీఆర్ చేసిన తప్పులు కాంగ్రెస్ చేయరాదని, కక్షసాధింపు చర్యలకు పాల్పడవద్దని సూచించారు. రేవంత్ ప్రభుత్వం చిహ్నాల వివాదాలకు పోయి సమయం వృధా చేసుకోవద్దని నారాయణ హితవు పలికారు. భూ సమస్యలు, కాళేశ్వరం వంటి సమస్యలను పరిష్కరించాలన్నారు.
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ వద్దు
హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేయాలని కొందరు కోరుతున్నారని, హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా చేయవద్దని, ఆ అవకాశమే ఇవ్వకూడదని నారాయణ అన్నారు. చంద్రబాబుకు హైదరాబాద్పై ఆశ ఉన్నదని, రాజధాని ఏపీలోనే ఉండాలన్నారు. జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలను గతంలో ఎవరూ ఇవ్వలేదని, జగన్ సంక్షేమాలపైనే ఆధారపడి…రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. ఉన్న పరిశ్రమలను విక్రయిస్తూ జగన్ నియంతృత్వ పాలన కొనసాగించారని దుయ్యబట్టారు. ఏపీలో టీడీపీ విజయాలే కనిపిస్తున్నాయని, బీజేపీ విజయాలు కనిపించడంలేదన్నారు. బీజేపీకి కేటాయించిన కొన్ని స్థానాల్లో వైసీపీ గెలిచిందన్నారు. అగ్గికి ఆజ్యం మాదిరిగా చంద్రబాబుకు పవన్ కల్యాణ్ తోడయ్యారని తెలిపారు. ఏపీ ఫలితాలు చంద్రబాబు, జగన్, మీడియా, తమకు సైతం అంతుపట్టలేదన్నారు. జగన్ ఐదేళ్ల దుష్టపాలన కారణంగానే చంద్రబాబు గెలిచారన్నారు.
విభజన హామీలు అమలు చేయకుండా మోదీ సర్కారు పదేళ్లుగా తొక్కిపెట్టిందని నారాయణ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, అమరావతి రాజధానికి నిధులు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజన్ వంటిదని చెప్పారు. ఏపీ డిమాండ్లు సాధించుకునేందుకు నిర్ధిష్టమైన ప్రయత్నం చేయాలని చంద్రబాబుకు సూచించారు. ఈ డిమాండ్లు నెరవేరిస్తే బీజేపీతో ఉండొచ్చని, లేకపోతే ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. ఇండియా ఐక్య సంఘటనకు మద్దతిస్తే అన్ని హామీలు అమలవుతాయన్నారు. కేవలం సంక్షేమ పథకాల ద్వారానే అధికారంలోకి వస్తామనుకోవడం కలేనన్నారు. ఐదేళ్లు సంక్షేమాన్ని అమలు చేసిన జగన్ ఎన్నికల సమయంలో ఓట్లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
జగన్ పాలన ఓ కేస్ స్టడీ: రామకృష్ణ
రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించకూడదో చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పాలన ఒక కేస్ స్టడీగా పనికొస్తుందని కె.రామకృష్ణ అన్నారు. మోదీ ప్రభుత్వం ఏపీికి తీరని అన్యాయం చేసిందని, రాష్ట్రంతో అత్యంత దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని ముగిసిన అధ్యాయమని ప్రధాని వ్యాఖ్యానించడం గర్హనీయమన్నారు. చంద్రబాబుకు సువర్ణ అవకాశం వచ్చిందని, ఆ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడాలని, అలా చేస్తేనే ప్రజలు హర్షిస్తారన్నారు. జగన్ను సీఎంగా కొనసాగించాలా…వద్దా అనే అంశంపైనే ఎన్నికలు జరిగాయన్నారు. పెన్షన్లు, సంక్షేమ పథకాలు ఇచ్చినా ప్రజలు అన్యాయం చేశారని జగన్ అంటున్నారని, జగన్ ఏనాడూ ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేదని, ప్రజా సమస్యలపై ఒక్కసారైనా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదని, ప్రతిపక్షాలను పట్టించుకోలేదన్నారు. ప్రజా సమస్యలు విన్నవిద్దామంటే జగన్ సచివాలయానికే రాలేదన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక విధానాలు, నియంత పోకడ, ప్రజావ్యతిరేక పాలనే జగన్ ఓటమికి కారణమని రామకృష్ణ చెప్పారు.