గిరిజనుల అర్ధనగ్న నిరసన
పెదబయలు : ప్రపంచ ఆదివాసుల దినోత్సవాన సీఎం జగన్ ఆదివాసులకు ఏమి ఇచ్చారో చెప్పాలని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృధ్విరాజు ప్రశ్నించారు. బుధవారం విశాఖ జిల్లా పెదబయలు మండలం గుల్లెలు గ్రామంలో ఆదివాసులతో కలసి వినూత్నంగా గోచి గుడ్డలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసుల దినోత్సవం రోజున అధికారులు, ప్రజాప్రతినిధులందరూ ఆదివాసులకు అందలం ఎక్కించే ఉపన్యాసాలతో సరిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలకు ఆది వాసుల పట్ల చిత్తశుద్ధి, సంస్కృతి సంప్రదా యాలపై గౌరవం ఉంటే రాజ్యాంగంలోని చట్టాలను అమలు చేయాలని సూచించారు. జగన్ సీఎం అయితే తమ సమస్యలు తీరతాయన్న ఆశతో అత్యధిక మెజారిటీతో గెలిపించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆదివాసుల పక్షాన నిలవాల్సిన జగన్ ప్రభుత్వం కేంద్రం నిర్ణయాలకు వత్తాసు పలుకుతోందని విమర్శించారు. జీవో నెంబరు 3ను సుప్రీం కోర్టు కొట్టివేసి 16 నెలలు గడుస్తున్నా ప్రభు త్వం స్పందించడం లేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా జీవో నెంబర్ 3ను చట్టబద్ధం చేస్తూ గిరిజన స్పెషల్ డీఎస్సి నోటిఫికేషన్, ఆదివాసీల కోసం ప్రత్యేక జాబ్ క్యాలెండర్ విడుదల చేయా లని డిమాండు చేశారు. 2008 డీఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థులకు పోస్టింగ్లు ఇవ్వాలని, అలాగే యథేచ్ఛగా సాగుతున్న అక్రమ కట్టడాల నిలుపుదలకు 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండు చేశారు. అటవీ హక్కుల చట్టం, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంతో గ్రామ సభలు యధాతధంగా జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం సభ్యులు వికాస్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.