ముంబై కార్యాలయ సిబ్బందిదే పాత్ర
వలస కార్మికుల పేరుతో నకిలీ ఖాతాల సృష్టి
ముంబై : ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థలలో ఒకటయిన ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్వో)లో భారీ మోసం వెలుగు చూసింది. ముంబైలోని ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయానికి చెందిన ఉద్యోగుల బృందం అంతర్గత మోసం ద్వారా కోట్ల రూపాయలను దొంగిలించారు. సంస్థ సేకరించిన నిధుల్లో ఒక దాని నుంచి 21 కోట్ల రూపాయలను ఆరుగురు ఉద్యోగులు దోచుకుపోయారు. ముంబైకు చెందిన కాండివాలిలోని ఈపీఎఫ్వో కార్యాలయం గుమస్తా 37 ఏళ్ల చందన్ కుమార్ సిన్హా ప్రధాన సూత్రధారి అని ప్రాథమిక దర్యాప్తు పేర్కొంది. ప్రధానంగా వలస కార్మికులకు చెందిన 817 బ్యాంకు ఖాతాలలో జమ అయిన పీఎఫ్ నిధులను సిన్హాతోపాటు మరో ఐదుగురు ఈపీఎఫ్వో ఉద్యోగులు విత్డ్రా చేసుకున్నారు. కాగా ఇప్పటికే దుర్వినియోగమైన నిధుల్లో దాదాపు 90 శాతాన్ని ఇప్పటికే వారి ఖాతాల నుంచి స్వాధీనం చేసుకున్నారు. సిన్హా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. మిగిలిన ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఇదిలాఉండగా, ‘ఏ వ్యక్తిగత పీఎఫ్ ఖాతా దుర్వినియోగం కాలేదు. ఈ డబ్బు పూల్డ్ ఫండ్కు చెందినది. ఈపీఎఫ్వోకు నష్టమేగానీ, వ్యక్తులకు కాదు. ఇది బ్యాంకు దోపిడీకి సమానం’ అని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒక కార్యాలయంలో చోటుచేసుకున్న ఈ ఘటనతో ఈపీఎఫ్వో అంతటా అప్రమత్తత గంటలను మోగించింది. ఈ దుర్వినియోగం ఘటనతో సంస్థ అన్ని ఉపసంహరణలను భద్రపరచడానికి చర్యలు తీసుకుంటుంది. మార్చి, 2019 నుండి ఏప్రిల్, 2021 వరకు కాండివాలి కార్యాలయం ఆమోదించిన పీఎఫ్ క్లెయిమ్లను చేర్చడానికి దాని అంతర్గత ఆడిట్ పరిధిని 12 లక్షల క్లెయిమ్ల వరకు విస్తరించింది. అంతేకాకుండా ఆడిట్ అనంతరం ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి అప్పగించాలని కూడా యోచన చేస్తోంది. సామాజిక భద్రతా కార్యాలయంలో ఇంత పెద్ద ఎత్తున మోసం జరగడం అనేక భద్రతా సమస్యలను కలిగిస్తుంది. అలాగే సంస్థలో కోవిడ్ మహమ్మారికి సంబంధించిన ఉద్యోగ కోతలు, వెరిఫికేషన్లు, ఉపసంహరణల నిర్వహణ ఆమోదాలకు సంబంధించి ఉద్యోగులకు బహుళ బాధ్యతలను అప్పగించడం ఈ మోసానికి దారితీసింది. అలాగే లాక్డౌన్ సమయంలో ఇంటి నుండి పని చేసిన ఉన్నతాధికారులు అనుమానిత వ్యక్తులతో తమ పాస్వర్డ్లను పంచుకున్నారు. పని పూర్తయిన తర్వాత వాటిని మార్చలేదు. ఐదు లక్షల రూపాయలు దాటిన పీఎఫ్ ఉపసంహరణలకు మాత్రమే రెండవ అధికారి నుండి అదనపు అనుమతి అవసరం. దీంతో అనుమానితులు దోపిడీ చేసిన లొసుగు స్పష్టంగా తెలుస్తోంది. సిన్హా. అతని సహోద్యోగులు కేవలం ఒకటి, మూడు లక్షలు మాత్రమే ఉపసంహరించుకున్నారు. అప్పుడు తన సహోద్యోగి అభిజిత్ ఒనెకర్ సహాయంతో సిన్హా నిరుద్యోగ వలస కార్మికుల బ్యాంకు, ఆధార్ వివరాలను వారికి 5,000 రూపాయల కమీషన్ చెల్లించి భద్రపరిచారు. ఈ కార్మికుల పేర్లతో పీఎఫ్ ఖాతాలను ప్రారంభించారు. ముంబైలో 15 సంవత్సరాల క్రితం మూసివేయబడిన కంపెనీల ఉద్యోగులుగా నమోదు చేశారు. బి.విజయ్ కుమార్ జ్యువెలరీ ప్రైవేటు లిమిటెడ్, లాండ్ మార్క్ జ్యువెలరీ ప్రైవేటు లిమిటెడ్, న్యూ నిర్మల్ ఇండస్ట్రీస్, సతీ వేర్ కార్పొరేషన్, నేషనల్ వైర్స్గా ఈ కంపెనీలను జాబితా చేశారు. అయితే ఈ కంపెనీలన్నీ 2006లోనే మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో సంస్థ 817 నకిలీ ఖాతాలను స్తంభింపజేయడానికి బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోంది. దుర్వినియోగమైన డబ్బుతో నిందితులు కొనుగోలు చేసిన ఆస్తులను తిరిగి పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఇప్పటివరకు రూ.2 కోట్ల వరకు స్వాధీనం చేసుకున్నారు.