. ఎన్నికలు ముగిసేవరకు విధులకు దూరం
. సెల్ఫోన్లు, ట్యాబ్లు స్వాధీనం
. టెట్ ఫలితాలు, ఏపీటీఆర్టీ పరీక్షలు వాయిదా
. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే పెన్షన్ల పంపిణీ
. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : వైసీపీ సర్కార్కు కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ప్రజలతో చేరువకావడానికి అత్యంత కీలకంగా ఉపయోగపడుతున్న వలంటీర్లను పూర్తిస్థాయిలో ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా 1వ తేదీన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు తదితరులకు సామాజిక పింఛన్లు పంపిణీ నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేయడం వలంటీర్ల విధుల్లో అత్యంత కీలకమైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారపగ్గాలు చేపట్టగానే ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్, ప్రతి 2 వేల జనాభాకు ఒక సచివాలయం చొప్పున కొత్త వ్యవస్థ ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడున్నర లక్షల మంది వలంటీర్లు, లక్షా 20 వేల మంది సచివాలయాలకు రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగుల నియామకం చేపట్టారు. వలంటీర్ల నియామకం మాత్రం పూర్తిగా పార్టీకి విధేయులుగా ఉండే వారినే నియమించారు. వీరి ద్వారానే ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయడం, వారికి నేరుగా అందేలా చూడటం వంటి కార్యక్రమాలను అధికారులు చేపడుతున్నారు. రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు, పాస్బుక్ తదితర సమస్త సేవల్లోనూ వలంటీర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. తమ పరిధిలోని 50 కుటుంబాలకు చెందిన సమస్త సమాచారం కూడా వలంటీర్లకు అందుబాటులో ఉంటుంది. చివరకు ఎవరు ఏ పార్టీకి అనుకూలమో, వారి కుల, మతాలు ఏమిటో కూడా వారి వద్ద డేటా ఉంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఏప్రిల్, మే నెలల్లో వరుసగా దాదాపు 65 లక్షల మంది పెన్షన్దారులను వలంటీర్లు నేరుగా కలిసి డబ్బు వారి చేతికి అందజేయడమంటే వైసీపీకి ప్రచారం చేయడమేనని, ఓటర్లను ప్రలోభపెట్టే చర్యేనంటూ ప్రతిపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణ జరగాలంటే వలంటీర్లను విధులకు దూరంగా ఉంచాలని సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఎన్నికల కమిషన్కు వరుస ఫిర్యాదులు చేసింది. హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం యథాతథంగానే ఏప్రిల్ 1వ తేదీన వలంటీర్ల ద్వారానే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే మే 1వ తేదీన కూడా వీరి ద్వారానే పంపిణీ కొనసాగించాలని భావించింది. అయితే పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో వలంటీర్లు ఏ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయకూడదని, ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవల్సి వస్తుందని సెర్ఫ్ సర్క్యులర్ ఒకటి మొక్కుబడిగా జారీ చేసింది. పార్టీ కార్యకర్తలను వలంటీర్లుగా నియమించుకున్న వైసీపీ ప్రభుత్వం… వారికి ప్రచారం చేయకుండా ఎలా ఉంటారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టులో సిటిజన్ ఫర్ డెమోక్రసీ దాఖలు చేసిన పిటిషన్… దానిపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రస్తావిస్తూ వలంటీర్ల విషయంలో తగు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఈవోను ఈసీ ఆదేశించింది. ఆ మేరకు వీరిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా శనివారం మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నంత వరకూ ఏపీటెట్ ఫలితాలు వెలువరించ వద్దని, ఏపీటీఆర్టీ పరీక్షలు వాయిదా వేయాలని కూడా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. ఈ నిర్ణయాలకు సంబంధించిన ఆదేశాలు ఎన్నికల సంఘం నుండి తమ కార్యాలయానికి అందాయని మీనా తెలిపారు. భారత ఎన్నికల సంఘం జారీచేసిన ఆదేశాల మేరకు వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఎటువంటి పథకాలు, పింఛను నగదు పంపిణీ చేయకూడదని, ప్రభుత్వం వలంటీర్లకు ఇచ్చిన సెల్ఫోన్లు, ట్యాబ్లు, ఇతర డివైజ్లను వెంటనే సంబంధిత జిల్లా ఎన్నికల అధికారుల వద్ద డిపాజిట్ చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం కొనసాగిస్తున్న పథకాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా అమలు పర్చాలని సూచించినట్లు మీనా వెల్లడిరచారు. ఇక ఏపీటెట్ ఫలితాలు వెలువరించే అంశం, ఏపీటీఆర్టీ పరీక్షలు నిర్వహించే అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుండి అందిన ప్రతిపాదనలను భారత ఎన్నికల సంఘం పరిశీలించిందని, ఈ అంశానికి సంబంధించి రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నంత వరకూ ఆ రెండు అంశాలను వాయిదా వేయాలని తమకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసినట్లు ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.