సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ
విశాలాంధ్ర బ్యూరో`తిరుపతి : విద్య కాషాయీకరణ, ప్రైవేటికరణకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ పిలుపునిచ్చారు. స్థానిక తిరుపతి బైరాగి పట్టేడలోని ఎస్ఎఫ్ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ 86వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నారాయణ పతాకావిష్కరణ చేశారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ పోరా టాలకు చిరునామాగా విద్యార్థి సమాఖ్య నిలిచిందన్నారు. ఉద్యమాలలో ఎంతోమంది యువకులను దేశం కోసం బలిదానం చేసిందన్నారు. పోరాటాలు, త్యాగాలే ధ్యేయం గా ఏర్పడిన ఈ విద్యార్థి సంఘం స్వాతంత్య్రానంతరం శాస్త్రీయ విద్యావిధానం అమలుపై నిరంతరం పోరాటాలు సాగించిందన్నారు. పేద విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం, స్కాలర్షిప్ల మంజూరు, కాస్మోటిక్ చార్జీల పెంపు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై నిరంతరం పోరాటాలు సాగిస్తున్నదని తెలిపారు. ‘చదువుతూ పోరాడు.. పోరాడి సాధించు..’ నినాదంతో విద్యార్థులకు మరింత చేరువైందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను చీల్చిచెండాడుతూ సమరశీల పోరాటాలు కొనసాగిస్తూ సమస్యల సాధన కోసం విశేషంగా కృషిచేసిన ఘనత ఏఐఎస్ఎఫ్కే దక్కిందన్నారు. దేశంలో మతం పేరుతో, కులం పేరుతో ఆహారం పేరుతో దళితులపైనా, మైనార్టీల పైనా మతోన్మాదులు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తోందన్నారు. సమసమాజ నిర్మాణం కోసం పోరాటం చేస్తూ ఆ దిశగా ముందుకు సాగుతున్న ఏకైక విద్యార్థి సంఘమని తెలిపారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం విద్యార్థి, నిరుద్యోగులను మోసం చేస్తోందని, దాదాపుగా 2 లక్షల 37ల ఉద్యోగాలు ఉంటే కేవలం పదివేల పైచిలుకు ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తాననడం జగన్ చేతగా నితనమన్నారు. విశాలాంధ్ర జనరల్ మేనేజర్ హరి నాథ్రెడ్డి, రామానాయుడు, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు జనార్దన్, రాష్ట్ర మాజీ కార్యదర్శి విశ్వనాథ్, జిల్లా మాజీ కార్యదర్శి ఎండీ ప్రసాద్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్, టౌన్ అధ్యక్షులు విజయ్, ఉప కార్యదర్శి వెంకటేష్, చిన్న, మురళి, రాకేష్, భాస్కర్, వినయ్, సుబ్బు పాల్గొన్నారు.