. 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చా
. టీడీపీ మేనిఫెస్టో మోసపూరితం
. ఎన్నికల సభల్లో వైఎస్ జగన్
విశాలాంధ్రబొబ్బిలి/పాయకరావుపేట/ఏలూరు: రాష్ట్రంలో మే13న జరగనున్న ఎన్నికలు పేదలకు
చంద్రబాబు మోసాలకు, మంచికినయవంచనకు, స్కీములు
స్కాముల మధ్య జరగనున్న కురుక్షేత్ర యుద్ధమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సుడిగాలి పర్యటన చేస్తున్న సీఎం జగన్… బుధవారం విజయనగరం జిల్లా బొబ్బిలి, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట, ఏలూరు జిల్లా ఏలూరు నిర్వహించిన మూడు బహిరంగసభల్లో పాల్గొని మాట్లాడారు. కురుక్షేత్ర యుద్దంలో జగన్కు ఓటేస్తే పథకాలు కొనసాగుతాయని, చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ మోసపోతారని జగన్ అన్నారు. వచ్చే ఎన్నికలు ఎంపీ, ఎమ్మెల్యేల ఎన్నికలు కావని… వచ్చే 5ఏళ్లలో ఇంటింటి అభివృద్ధి, పేదల భవిష్యత్తు అని చెప్పారు. చంద్రబాబుకు ఓటేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టినట్లేనని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో 59నెలల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చానన్నారు. ఇంటివద్దకే పింఛన్, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యాకానుక, ఇంగ్లీషు మీడియంలో పాఠాలు, విద్యార్థులకు జగనన్న విద్య, వసతి దీవెన, విద్యార్థుల తల్లులకు అమ్మఒడి, అక్క చెల్లెమ్మలకు చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ ఆసరా, సున్నా వడ్డీకి రుణాలు, మహిళల పేరిట 31లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, రైతన్నలకు రైతు భరోసా తదితర పథకాలు అమలు చేశామన్నారు. వైద్యం కోసం పేదలు అప్పులపాలు కాకుండ ఆరోగ్యశ్రీ రూ.25లక్షలకు విస్తరించిటనట్లు తెలిపారు. 130సార్లు బటన్ నొక్కి రూ.2.70లక్షల కోట్లు మహిళల ఖాతాల్లో జమ చేశామన్నారు. 3సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ప్రజలకు గుర్తుండేలా అమలు చేసిన ఒక్క పథకం ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు అబద్ధాలకు, మోసాలకు రెక్కలు కడుతున్నాడని విమర్శించారు. చంద్రబాబు తన జీవితకాలంలో ఏ రోజు పేదలకు మంచి చేయలేదన్నారు. అలాంటి వ్యక్తి మళ్లీ కొత్త కొత్త మేనిఫెస్టోలతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. 2014లోనూ ఇదే కూటమి ముఖ్యమైన హామీలు అంటూ ప్రజలకు అనేక వాగ్ధానాలు చేసిందన్నారు సీఎం జగన్. అయితే వాటిలో ఏ ఒక్క అంశాన్ని కూడా అమలు చేయలేదన్నారు. పేదల భవిష్యత్తు మారాలన్నా… వలంటీర్లు మళ్లీ ఇంటికి రావాలన్నా… మళ్లీ వైసీపీ అధికారంలోకి రావాలన్నారు సీఎం జగన్. లంచాలు, వివక్ష లేని పాలన కొనసాగాలంటే ప్రజలు ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కాలని కోరారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ పాయకరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు, ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు, బొబ్బిలి అసెంబ్లీ అభ్యర్థి వెంకట చిన అప్పలనాయుడు, విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, ఏలూరు అసెంబ్లీ అభ్యర్థి ఆళ్ల నాని, కారుమూరి సునీల్కుమార్ యాదవ్ను ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి గెలిపించాలని వైఎస్ జగన్ కోరారు. సీఎం సభకు ఆయా నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల నుండి అధిక సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. జనాలతో మెయిన్రోడ్లు కిక్కిరిసిపోయాయి.