. కలిసివచ్చే పార్టీలను స్వాగతిస్తాం
. ఫాసిస్టు పాలనపై ఐక్యపోరు ఆగదు
. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తాం
. ‘ఇండియా’ భేటీలో మల్లికార్జున ఖడ్గే
న్యూదిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నిర్ణయాత్మక తీర్పు ఇచ్చారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే అన్నారు. ‘ఇండియా’ ఐక్య సంఘటన సమన్వయంతో ముందుకెళుతుందని, ఐక్య గళం వినిపిస్తుందని, ఫాసిస్టు పాలనపై పోరాటం కొనసాగిస్తుందని స్పష్టంచేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ అమలుకు ‘ఇండియా’ కట్టుబడి ఉందన్నారు. భావసారూప్యతగల, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలకు కట్టుబడే పార్టీలను ‘ఇండియా’ స్వాగతిస్తుందని అన్నారు. నైతిక ఓటమి తర్వాత కూడా మోదీ నిరంకుశ వైఖరిలో మార్పు లేదని, ప్రజా తీర్పును అణచివేయాలని చూస్తున్నారని ఖడ్గే విమర్శించారు. బీజేపీ పాలనను ప్రజలు కోరుకోవడం లేదని, దీనిపై సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన క్రమంలో ‘ఇండియా’ ఐక్య సంఘటన బుధవారం ఖడ్గే నివాసంలో భేటీ అయింది. ప్రభుత్వం ఏర్పాటునకు గల అవకాశాలు, భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరిపింది. దాదాపు రెండు గంటలు సాగిన భేటీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించింది. ఐక్యంగా ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఖడ్గే మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మోదీకి, బీజేపీకి ప్రజలు గుణపాఠం నేర్పారన్నారు. మోదీ నైతికంగా ఓడిపోయారని చెప్పారు. ఎన్నికల ఫలితాలు మోదీకి, మోదీ రాజకీయ విధానాలకు వ్యతిరేకంగా వెలువడ్డాయన్నారు. రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగానూ మోదీకి ఇది ఘోర పరాభవమని ఖడ్గే వ్యాఖ్యానించారు. భావసారూప్యతగల అన్ని పార్టీలను ఇండియా ఐక్య సంఘటన స్వాగతిస్తున్నదని తెలిపారు. రాజ్యాంగంపై విశ్వాసం, దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం వంటి లక్ష్యాలకు కట్టుబడి ఉన్న పార్టీలన్నింటినీ స్వాగతిస్తున్నామని చెప్పారు. ‘ఇండియా’ భాగస్వామ్య పక్షాలన్నీ సమన్వయంతో బాగా పోరాడాయని ప్రశంసించారు. మెరుగైన ఫలితాలు సాధించాయని అభినందించారు. తొలుత ఇండియా ఐక్య సంఘటన భాగస్వాములు అందరికీ స్వాగతం పలికిన ఖడ్గే… తామంతా ఐక్యంగా పోరాడి మెరుగైన ఫలితాలు సాధించగలిగామన్నారు. నాయకుల భేటీ అనంతరం ఖడ్గే విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మోదీ ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతోందని స్పష్టంచేశారు. ఇండియా ఐక్య సంఘటనకు లభించిన అమితాదరణకు ప్రతి ఒక్క నాయకుడి తరపున దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఓటు ద్వారా బీజేపీ విద్వేష రాజకీయాలకు, అవినీతికి ప్రజలు దీటైన బదులిచ్చారన్నారు.
ప్రజా తీర్పు రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి సమర్థన… అధిక ధరలు, నిరుద్యోగం, ఆశ్రిత పెట్టుబడిదారులకు వ్యతిరేకమని చెప్పారు. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ‘ఇండియా’ కట్టుబడి ఉందని ఖడ్గే తెలిపారు. సమావేశంలో ఖడ్గేతో పాటు కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, జైరాం రమేశ్, శరద్ పవార్ (ఎన్సీపీఎస్పీ), ఎంకే స్టాలిన్ (డీఎంకే), డి.రాజా (సీపీఐ), సీతారాం ఏచూరి (సీపీఎం), అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ), కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్), సంజయ్ రౌత్ (శివసేన-యూబీటీ), సంజయ్ సింగ్ (ఆప్), ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), అభిషేక్ బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), చంపై సోరెన్ (జేఎంఎం), రాఘవ్ చడ్డా (ఆప్), సుప్రియా సూలే (ఎన్సీపీ
ఎస్పీ), కల్పనా సోరెన్ (జేఎంఎం) తదితరులు పాల్గొన్నారు.