. మూడంచెల భద్రత
. జగన్, చంద్రబాబు ఇళ్ల వద్ద బలగాల మోహరింపు
. పార్టీ ప్రధాన కార్యాలయాల వద్ద పికెట్లు
. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్
విశాలాంధ్రబ్యూరో`అమరావతి: సార్వత్రిక ఎన్నికల మహాఘట్టం ఆవిష్కృతం కానుంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజాతీర్పు ఏంటనే ఉత్కంఠకు నేడు జరిగే ఓట్ల లెక్కింపుతో తెరపడనుంది. అసెంబ్లీ, పార్లమెంట్కు పోటీలో ఉన్న వైసీపీ, ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ ఫలితాలపై ఇప్పటివరకు ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికి వారే ధీమాతో ఉన్నప్పటికీ… ఓటర్ల తీర్పుపై కలవరం చెందుతున్నారు. ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలమనేదీ అంతుచిక్కడం లేదు. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసింది. ఇండియా కూటమి పక్షాలు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ సీట్ల సర్దుబాటుతో బరిలోకి దిగాయి. ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులతో పోటీ చేశాయి. ఈ పార్టీలతోపాటు చాలా ప్రాంతాల్లో స్వతంత్ర అభ్యర్థులు, చిన్న పార్టీల నుంచి అభ్యర్థులు పోటీ చేశారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు రౌండ్ల వారీగా ఫలితాలను ప్రకటించనున్నారు. ఇందుకోసం ఒక్కో రౌండ్కు 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి రౌండు ఫలితం వెలువడ్డానికి దాదాపు 30 నిముషాల సమయం పడుతుంది. తొలుత ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్తో లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. 8.30 గంటల తర్వాత ఈవీఎంల లెక్కింపునకు శ్రీకారం చుడతారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 375 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల లెక్కింపునకు 350 హాళ్లు, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు 75 హాళ్లను కేటాయించారు. 111 అసెంబ్లీ స్థానాల్లో 20 రౌండ్లలోను, 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లలోను లెక్కిస్తారు. మరో 3 అసెంబ్లీ స్థానాల్లో 25 రౌండ్ల వరకు లెక్కించేలా ఏర్పాట్లు చేశారు. అభ్యర్థుల సమక్షంలోనే ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్రూమ్లను తెరవనున్నారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. అనుమతి లేకుండా ముందస్తు విజయోత్సవ ప్రదర్శనలు, సభలపై ఎన్నికల సంఘం హుకుం జారీ చేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా 3 నుంచి 5వ తేదీ వరకు మద్యం విక్రయాలపై నిషేధం విధించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి సెల్ ఫోన్లను తీసుకెళ్లరాదు.
ఏపీకి భారీగా కేంద్ర బలగాలు
మే 13వ తేదీన పోలింగ్ రోజు, మరుసటిరోజు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకుని… ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో 5,600 మందితో భద్రతా చర్యలు చేపట్టారు. తాడేపల్లి లోని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటి దగ్గర, ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం దగ్గర పోలీసు బందోస్తు పెంచారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం, తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాల వద్ద కూడా పోలీసు నిఘా పెంచారు. 50 కంపెనీల సీఆర్ఎఫ్ బలగాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. పల్నాడు, అనంతపురం, చిత్తూరుజిల్లాలకు ఈ బలగాలు వెళ్లనున్నాయి. ప్రధాన కార్యాలయం నుంచి సీఆర్ఎఫ్ చీఫ్ సిన్హా ఈ భద్రతా దళాల విధులను పర్యవేక్షిస్తారు. అనంతపురంజిల్లా తాడిపర్తిలో టీడీపీ, వైసీపీ నేతల ఇళ్ల దగ్గర పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. అల్లర్లను దృష్టిలో ఉంచుకుని జేసీ అస్మిత్రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇద్దరి ఇళ్లను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. తాడిపర్తిలో కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు వారిద్దరూ బయటకు వెళ్లరాదని పోలీసులు ఆదేశాలు జారీజేశారు. పల్నాడుజిల్లాలోనూ గట్టి పోలీసు బందోబస్తుకు చర్యలు తీసుకున్నారు. మాచర్ల కౌంటింగ్ కేంద్రానికి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెళ్లవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి(ఏపీ సీఈవో) ముఖేశ్కుమార్ మీనా అధ్వర్యంలో ఓట్ల లెక్కింపు వేగవంతంగా జరిగేందుకుగాను తగిన చర్యలకు ఉపక్రమించారు. అటు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వైసీపీ, ఇండియా, ఎన్డీఏ కూటమి పార్టీల నేతల అధ్వర్యంలో ఆయా పార్టీల ముఖ్య ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. ఓట్ల లెక్కింపులో అవాంతరాలు తలెత్తితే…తక్షణమే సమాచారం అందించేందుకు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకుగాను మీడియా సంస్థలు సిద్ధమయ్యాయి.
గెలుపోటములపై పార్టీల అంచనాలు
ప్రాంతాలు, జిల్లాల వారీగా గెలుపోటములపై రాజకీయ పార్టీలు కూడికలు, తీసివేతల్లో నిమగ్నమయ్యూయి. ఇప్పటికే విడుదలైన జాతీయ, ప్రాంతీయ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ఆధారంగా ప్రధాన రాజకీయ పార్టీలు తమకు వచ్చే సీట్లపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గ్రేటర్ రాయలసీమ, కోస్తా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర వారీగా జిల్లాలను విడగొట్టి ఏకపక్షంగా అనుకూల తీర్పు వచ్చే జిల్లాలు, అందులోని నియోజకవర్గాలపై దృష్టి సారించారు. ఈసారి గ్రేటర్ రాయలసీమకు చెందిన జిల్లాలు(రాయలసీమతోపాటు ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు) ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదో ఒక ప్రాంతం నుంచి గంపగుత్తగా అధిక సీట్లను సాధించిన పార్టీనే అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. దీనికి భిన్నంగా మరోవైపు ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరుజిల్లాలు గెలుపులో కీలక పాత్ర పోషించనున్నాయనే వాదనలున్నాయి. గతంలో ఉమ్మడి ఉభయ గోదావరిజిల్లాల్లో అధిక సీట్లు సాధించిన పార్టీనే అధికారాన్ని కైవసం చేసుకున్న సందర్భాలున్నాయి. ఇప్పుడు ఆ సెంటిమెంట్ నిలుస్తుందా?, పోతుందా? అనేదీ వేచి చూడాలి. ఈ ఎన్నికల్లో ఎస్సీ,ఎస్టీలకు చెందిన 36 రిజర్వుడు అసెంబ్లీ సీట్లు(27 ఎస్సీలుG7 ఎస్టీలు) పార్టీల గెలుపులో ప్రముఖ పాత్ర పోషించనున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లూ కీలకంగా నిలవనున్నాయి. ఉద్యోగుల్లో అధికశాతం ఒక పార్టీకే జై కొట్టినట్లు ప్రచారం ఉండగా… తొలి, మలి రౌండ్లపై ఆ ప్రభావం చూపే అవకాశముందని పేర్కొంటున్నారు.