. ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించొద్దు
. సీఈవో ఎం.కె.మీనా
. మచిలీపట్నం, భీమవరంలో స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాల పరిశీలన
విశాలాంధ్ర`మచిలీపట్నం/భీమవరం : ఓట్ల లెక్కింపు సమయంలో ఎవరైనా కౌంటింగ్ కేంద్రంలో అలజడి సృష్టిస్తే తక్షణమే వారిని అరెస్టు చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్ కుమార్ మీనా హెచ్చరించారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. గురువారం ఆయన ఇతర అధికారులతో కలిసి మచిలీపట్నం, భీమవరంలోని స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతను, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. కృష్ణా జిల్లాలో జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం చేసిన ఏర్పాట్లన్నీ సంతృప్తికరంగా ఉన్నాయని సీఈవో మీనా జిల్లా అధికారులకు కితాబు ఇచ్చారు. ఆయన ఓట్ల లెక్కింపు కేంద్రమైన కృష్ణా యూనివర్సిటీని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీతో కలిసి సందర్శించిన అనంతరం మీడియా సెంటర్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ కౌంటింగ్కు సంబంధించి సదుపాయాలు, ఇంటర్నెట్ సౌకర్యం, బారికేడిరగ్, సెక్యూరిటీ, సీసీటీవీల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కౌంటింగ్ హాల్లో ఓట్ల లెక్కింపు కోసం నియోజకవర్గాల వారీగా 14 టేబుళ్లను సక్రమంగా ఏర్పాటు చేశారన్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద 24 గంటలు భద్రతా సిబ్బంది పర్యవేక్షణతో పాటు సీసీటీవీల పనితీరు సక్రమంగా ఉన్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు రోజున కౌంటింగ్ హాల్లో ఎవరైనా అవాంతరాలు సృష్టించినా లేదా గొడవలు చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపటం జరుగుతుందని హెచ్చరించారు. లెక్కింపు సమయంలో అభ్యర్థి లేదా వారి ఏజెంట్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వారిని కౌంటింగ్ హాల్ నుంచి బయటకు పంపుతామన్నారు. కౌంటింగ్ కేంద్రం వెలుపల సైతం 144 సెక్షన్ అమలులో ఉంటుందని, నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫలితాలు వెలువడిన అనంతరం ఎవరూ ఊరేగింపులు, ర్యాలీలు చేపట్టడానికి అనుమతులు లేవని, ఈ అంశాలపై జిల్లా ఎస్పీ ఇప్పటికే అనేక సమావేశాల ద్వారా పోటీ చేసిన అభ్యర్థులకు అవగాహన కలిగించినట్లు గుర్తు చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్వో కె.చంద్రశేఖర రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
భీమవరంలో ఏర్పాట్ల పరిశీలన
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విచ్చేసిన ముఖేష్ కుమార్ మీనా… ఓట్ల లెక్కింపునకు ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లపై పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అజిత వేజెండ్ల, జిల్లా జాయింట్ కలెక్టర్ సి.వి.ప్రవీణ్ ఆదిత్య, భీమవరం ఆర్వో కె.శ్రీనివాసులు రాజు, తాడేపల్లిగూడెం ఆర్వో కె.చెన్నయ్య, ఆచంట ఆర్వో వి.స్వామి నాయుడు, పాలకొల్లు ఆర్ఓ బి.శివనారాయణ రెడ్డి, నరసాపురం ఆర్ఓ ఎం.అచ్యుత అంబరీష్, తణుకు ఆర్ఓ బి.వెంకటరమణ తదితరులతో కలిసి భీమవరం ఎస్ఆర్కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల, విష్ణు కళాశాలల్లో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద చేసిన మూడంచెల భద్రతా ఏర్పాట్లను, చివరిగా మీడియా సెంటర్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు చేపట్టిన చర్యలను కలెక్టర్ సుమిత్ కుమార్ వివరించారు. సుమారు వెయ్యి మంది కౌంటింగ్ సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు తదితరులతో పాటు దాదాపు 400 మంది ఇతర సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియ అనుబంధ విధుల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, సూక్ష్మ పరిశీలన, సీసీ కెమెరాల నిఘా మధ్య ప్రక్రియను నిర్వహించనున్నట్లు చెప్పారు. సరైన విధంగా బ్యారికేడిరగ్, సూచిక బోర్డుల ఏర్పాటు, వాహనాల పార్కింగ్, మీడియా కేంద్రం ఏర్పాటు, రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడి ప్రణాళిక, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు అవసరమైన ఏర్పాట్లు, మార్గదర్శకాల మేరకు కౌంటింగ్ టేబుళ్ల ఏర్పాటు తదితర అంశాలను వివరించారు. అధికారులు, సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు తదితరులకు అల్పాహారం, భోజనం, తాగునీరు వంటి ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడిరచారు. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల్లోని ఓట్లను లెక్కించే ప్రక్రియలో భాగస్వాములుకానున్న కౌంటింగ్ సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు తదితరులకు నాణ్యమైన శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వివరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సుమారు 500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో తీసుకున్న చర్యలు, కట్టుదిట్టమైన భద్రత, బందోబస్తుకు చేసిన ఏర్పాట్లను జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అజిత వేజెండ్ల వివరించారు.