మద్యం కేసులో మరో మంత్రిని ప్రశ్నించిన ఈడీ
న్యూదిల్లీ : దేశ రాజధానిలో మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ను కస్టడీలోకి తీసుకున్న ఈడీ… తాజాగా మరో మంత్రికి సమన్లు జారీ చేసింది. దిల్లీ మంత్రి కైలాశ్ గెహ్ల్లాత్కు ఈడీ శనివారం నోటీసులిచ్చింది. విచారణ నిమిత్తం ఈ రోజే తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లారు. కేసుకు సంబంధించి మంత్రి గెహ్లాత్ను ప్రశ్నించిన ఈడీ అధికారులు… ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. గెహ్లాత్… కేజ్రీవాల్ కేబినెట్లో హోం, రవాణా, న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. మద్యం విధానంపై ముసాయిదా తయారు చేసే సమయంలో అప్పటి ఆప్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్… గెహ్లాత్ అధికారిక నివాసాన్ని వినియోగించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 1తో ఆయన కస్టడీ ముగియనుంది. ఇటీవల కోర్టు విచారణ సందర్భంగా జడ్జి అనుమతితో సీఎం స్వయంగా తన వాదనలు వినిపించారు. కేవలం నాలుగు వాంగ్మూలాలతోనే తనను అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే కొంతమంది ఆప్ నేతల ఇళ్లల్లో దర్యాప్తు అధికారులు సోదాలు జరిపారు.
కేజ్రీవాల్పై మరో పిటిషన్
కస్టడీలో ఉన్నప్పటికీ సీఎం కేజ్రీవాల్ అక్కడి నుంచే పాలన సాగిస్తున్నారు. ఈడీ కస్టడీ నుంచే తన సహచర మంత్రులకు పాలనకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. అయితే, కేజ్రీవాల్ను పదవి నుంచి తొలగించాలని తాజాగా దిల్లీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఇదే విషయంపై గతవారం కూడా పిటిషన్ దాఖలవ్వగా… న్యాయస్థానం దాన్ని కొట్టేసింది.