ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుతో అంతర్జాతీయ సమస్యలను త్వరగా పరిష్కరించువచ్చు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. పెట్టుబడిదారులు తమ లిటిగేషన్ను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరుతున్నారని, ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు వల్ల ఆ సమస్యలు తీరుతాయన్నారు. హైదరాబాద్లో అంతర్జాతీయ వాణిజ్య వివాదాల మధ్యవర్తుల కేంద్రాన్ని ప్రారంభించారు. ఆ సెంటర్కు చెందిన ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి సీజేఐ హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ, ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటులో తెలంగాణ సహకారం మరువలేమన్నారు. తెలంగాణ చరిత్రలోనూ, హైదరాబాద్ చరిత్ర లోనూ ఈ రోజు గొప్పదినంగా నిలిచిపోతుందన్నారు. మూడు నెలల్లోనే తన కల నిజమవుతుందని ఎన్నడూ ఊహించలేదని, తన స్వప్నం సాకారానికి కృషిచేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్, సీజే హిమా కోహ్లీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీతో పాటు మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.