. ముగ్గురు ఐఏఎస్, ఆరుగురు ఐపీఎస్లపై బదిలీ వేటు
. ఓటర్ల జాబితా అవకతవకలు, హింసాత్మక ఘటనలే కారణం
. ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశం
. వారి స్థానాల్లో మూడు పేర్లు పంపాలని సూచన
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : రాష్ట్రంలో మరికొన్ని వారాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం కొరడా రaుళిపించింది. ఒకేసారి ముగ్గురు ఐఏఎస్, ఆరుగురు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు వేసింది. ఎన్నికల ప్రక్రియలో నిర్లక్ష్యంతో పాటు అధికారపార్టీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అంశంపై వచ్చిన ఫిర్యాదులను, ఇటీవల ప్రధాని సభలో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యాలను పురస్కరించుకుని వారిపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో రాజకీయ హత్యలు, హింస చెలరేగటాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై కొద్ది రోజుల క్రితం నంద్యాల, పల్నాడు, ప్రకాశం జిల్లా ఎస్పీలతో సమావేశమైన ఎన్నికల సంఘం…ఆ అధికారుల నుంచి వివరణ సైతం కోరింది. అప్పటి నుంచి వారిపై చర్యలు ఉంటాయన్న ఊహాగానాలు వెలువడ్డాయి. దానికనుగుణంగానే వారితో పాటు మరికొందరు ఐఏఎస్, ఐపీఎస్లపై ఈసీ చర్యలు తీసుకుంది. ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ పి.జాషువా, అనంతపురం ఎస్పీ కేకే అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ కె.తిరుమలేశ్వర్ తోపాటు సీనియర్ ఐపీఎస్ అధికారి, గుంటూరు రేంజ్ ఐజీ జి.పాలరాజు బదిలీ అయిన వారిలో ఉన్నారు. ఇక ఓటర్ల జాబితాలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యవహారంతో పాటు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన ఫిర్యాదులపై జిల్లా ఎన్నికల అధికారులుగా ఉన్న మూడు జిల్లాల కలెక్టర్లపై కూడా వేటు పడిరది. కృష్ణా జిల్లా కలెక్టర్ పి.రాజబాబు, అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి, తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషాను బదిలీ చేశారు. అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి ఓటర్ల జాబితాలో అక్రమాలను పట్టించుకోవడం లేదని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఎన్నికల కమిషన్కు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ గౌతమి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలకు బంధువు అవుతారని ఫిర్యాదులో టీడీపీ నేతలు పేర్కొన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ జేడీ కడపలో పనిచేస్తున్న సమయంలో అన్బురాజన్ అక్రమ కేసు పెట్టారని ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా అధికార పార్టీ నాయకులకు అనంతపురం జిల్లాలో అనుకూలంగా పనిచేస్తున్నారని, అతనిపై ఎన్నికల సంఘానికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇలా వరుసగా అనేక అంశాల్లో వైసీపీకి అనుకూలంగా పని చేస్తున్న వ్యవహారాలన్నింటినీ పరిశీలించిన తదుపరి ఎస్పీ అన్బురాజన్పై బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఒకేసారి ముగ్గురు ఐఏఎస్, ఆరుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం…ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అత్యవసర నోట్ పంపింది. వేటు వేసిన అధికారులంతా తమ బాధ్యతల్ని దిగువస్థాయి అధికారులకు అప్పగించాలని, ఎన్నికల విధులకు వారిని దూరంగా ఉంచాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మరోవైపు బదిలీ అయిన వారి స్థానాల్లో కొత్త కలెక్టర్లు, ఎస్పీల నియామకానికి ముగ్గురు చొప్పున పేర్లను కమిషన్కు పంపాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు.