రాజకీయ హత్యలపై ఈసీ సీరియస్
విచారణకు హాజరైన ప్రకాశం, పల్నాడు, నంద్యాల ఎస్పీలు
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ రాష్ట్ర పోలీస్ అధికారులను ఈసీ ప్రశ్నించింది. అసలు ఏం జరిగిందో ఆయా జిల్లాల బాధ్యులైన ఎస్పీల నుంచి వివరణ కోరింది. గిద్దలూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో జరిగిన రాజకీయ హత్యలు, మాచర్లలో వాహనం తగులబెట్టిన ఘటనలను ఈసీ తీవ్రంగా పరిగణించింది. ఈ మూడు హింసాత్మక ఘటనలపై ప్రకాశం, పల్నాడు, నంద్యాల జిల్లాల ఎస్పీలు పరమేశ్వర్రెడ్డి, రవిశంకర్రెడ్డి, కె.రఘువీరారెడ్డి నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా వివరణ తీసుకున్నారు. ముగ్గురు ఎస్పీలు గురువారం సీఈవో మీనా ఎదుట హాజరుకాగా… ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. శాంతిభద్రతలు కాపాడే విషయంలో ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరించారని, రాజకీయ హత్యల దాకా పరిస్థితులు దిగజారే వరకు ఎందుకు వేచి చూడాల్సి వచ్చిందని ఆయన ఎస్పీలను నిలదీసినట్లు తెలిసింది. మాచర్ల నియోజకవర్గం చాలా కాలంగా సున్నిత ప్రాంతాల జాబితాలో ఉన్నప్పటికీ ఎందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారని పల్నాడు ఎస్పీ రవిశంకర్రెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత హెచ్చరికలు జారీ చేసినా… దానికనుగుణంగా చర్యలు తీసుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది.కాగా ముగ్గురు ఎస్పీలు ఇచ్చిన వివరణల నివేదికలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు. ఇటీవల చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధ్వర్యాన భారీ బహిరంగసభ నిర్వహించగా… దానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ బహిరంగసభకు భద్రతా ఏర్పాట్ల విషయంలో కూడా ఈ ముగ్గురు ఎస్పీలు బాధ్యతారహితంగా వ్యవహరించారని ఆరోపిస్తూ కూటమి నేతలు ఎన్నికల సంఘ ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసిన విషయం విదితమే.