అనేక పాఠశాలల్లో అలంకార ప్రాయమే
టీచర్లకు శిక్షణ అంతంతమాత్రమే
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక, డిజిటల్ విద్యా బోధన కోసం ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ ప్లాంట్ ప్యానెల్ (ఐఎఫ్పీ) బోర్డుల వినియోగం అరకొరగానే ఉంది. వాటిపై ఉపాధ్యాయులకు పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఞానం లేనందున వినియోగించేందుకు నానా కష్టాలు పడుతున్నారు. ఇటీవల విడతల వారీగా ఈ బోర్డులపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినప్పటికీ, అవి వారికి పూర్తి స్థాయిలో అవగాహన కలిగించలేకపోయాయి. శిక్షణ ఇచ్చిన వారికే పూర్తి అవగాహన లేదని, మళ్లీ వారితోనే ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించడంతో, ఆ కార్యక్రమాల వల్ల ఆశించిన ప్రయోజనం ఒనగూడ లేదు. పాఠశాల విద్యా ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ నేతృత్యంలో ఈ శిక్షణ విజయవంతం కోసం విశేష కృషి చేస్తున్నప్పటికీ, వేగవంతంగా ప్రక్రియ ముందుకెళ్లడం లేదు. దీంతో పాఠశాలలకు పంపిణీ చేసిన బోర్డులు చాలా చోట్ల అలంకార ప్రాయంగానే దర్శనమిస్తున్నాయి.
విద్యుత్ కనెక్షన్ లేకుండా…
చాలా పాఠశాలలకు వచ్చిన ఐఎఫ్పీ బోర్డులకు కనీసం విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండానే నిరుపయోగంగా ఉంచిన సంఘటనలున్నాయి. ఇటీవల కృష్ణాజిల్లా గుడివాడ మండలంలోని వివిధ పాఠశాలలను పాఠశాల విద్యా ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ సందర్శించగా, అనేక విషయాలు వెలుగు చూశాయి. ఆ పాఠశాలకు జూన్ రెండో వారంలో బోర్డులు పంపిణీ చేసినప్పటికీ, డానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండా ఉంచేశారు. దీనికి ప్రధాన కారణం… వినియోగంపై
ఉపాధ్యాయులకు పట్టులేకపోవడమేనని, అతి విలువైన ఈ పరికరాన్ని తెలియకుండా వినియోగిస్తే ఏం జరుగుతుందనే భయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బోర్డులు టెలివిజన్ తరహాలో ప్లగ్, ప్లే మోడల్ను కలిగి ఉంటాయి. పాఠశాలలకు వచ్చినప్పటి నుంచి వాటిని ఉపయోగించాలి. ఇందుకోసం ఎస్సీఈఆర్టీ ఛానల్లో ఒక డెమో వీడియోను అందుబాటులో ఉంచారు. వాటి ద్వారా ఉపాధ్యాయులు ఐఎఫ్పీ వినియోగాన్ని సులువుగా తెలుసుకోవచ్చని పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయం దిశా నిర్దేశం చేస్తున్నప్పటికీ, కొందరు ఉపాధ్యాయులు వాటిని తిలకించేందుకు ఆసక్తి చూపడం లేదు. చూసిన వారు సైతం మరుసటి రోజుకే మరచిపోతున్నారు. దీంతో బోర్డుల వినియోగం వేగవంతం కావడం లేదు.
50శాతం మందికే శిక్షణ
ఉపాధ్యాయులు ఐఎఫ్పీ బోర్డులకు చెందిన అన్ని లక్షణాలపై అవగాహన కోసం వివరణాత్మకంగా రెండు రోజులపాటు శిక్షణను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం నిర్వహిస్తోంది. ఆయా పాఠశాలలకు సమీపంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో వాటిని కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు 50 శాతం ఉపాధ్యాయులే శిక్షణ పొందారు. మిగిలిన 50 శాతం మంది ఉపాధ్యాయులకు ఈనెల 15 నాటికి శిక్షణ పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. మొదటి విడతలో భాగంగా భాగంగా నాడు-నేడు పనులు జరిగిన రెసిడెన్షియల్ పాఠశాలలతోపాటు ఉన్నత పాఠశాలల్లో ఈ బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఉన్నత స్థాయి, కింది విభాగాల అధికారుల మధ్య సమన్వయం కొరవడంతోనే, ఐఎఫ్పీ బోర్డుల కార్యకలాపాలు పూర్తిస్థాయిలో కొనసాగడం లేదనే ప్రచారముంది. విక్రయదారుల ద్వారా ఈ బోర్డుల సరఫరాను పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయం నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రణాళికా బద్ధంగా వాటి నరఫరా కొనసాగేలా చర్యలకు దిగుతున్నప్పటికీ, వినియోగంలో మాత్రం సత్ఫలితాలు రావడం లేదు. 6,731 ఉన్నత పాఠశాలలు, ఫ్రీ-హైస్కూళ్లకు ఈనెల 25 నాటికి ఐఎఫ్పీ బోర్డులు కలిగి ఉందాలనే లక్ష్యంతో విద్యాశాఖ ముందుకెళ్తోంది.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ బోర్డుల వినియోగంపై ఉపాధ్యాయులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాల్సిన అవసరముంది, లేకుంటే ఎంతో ఖర్చుతో కొనుగోలు చేసిన ఆ పరికరాలు పాఠశాలల్లో నిరుపయోగంగా మారే ప్రమాదముంది.