సీఎంగా తొలగించాలన్న పిటిషన్ కొట్టివేత
. నిర్ణయం ఎల్జీదేనన్న సుప్రీం కోర్టు
న్యూదిల్లీ:
దిల్లీ మద్యం విధానానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్టయినందున దిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్ను తొలగించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ విషయంపై చర్యలు తీసుకోవాల్సింది దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అని స్పష్టం చేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తా ధర్మాసనం పేర్కొంది. అరెస్టు చేసిన తర్వాత ఆయన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కోరడం న్యాయబద్ధమైన విషయమని, కానీ దానికి చట్టపరమైన హక్కు లేదని స్పష్టం చేసింది. కాగా దీనికి సంబంధించిన పిటిషన్ను దిల్లీ హైకోర్టు ఏప్రిల్ 10నే కొట్టివేసింది. అనంతరం పిటిషనర్ కాంత్ భాటి సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.కాగా పిటిషన్ విచారణ సందర్భంగా ఎల్జీ అధికారాలను కోర్టు ప్రస్తావించడంతో లెఫ్టినెంట్ గవర్నర్, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య కొత్త వివాదం తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా నిషేధిత సంస్థ సిఖ్స్ఫర్ జస్టిస్ నుంచి సీఎం అరవింద్ కేజ్రీవాల్కు నిధులు అందాయని ఆరోపిస్తూ… విచారణకు గవర్నర్ డిమాండ్ చేస్తున్నారు. మార్చి 21న మనీల్యాండరింగ్ ఆరోపణలపై ఈడీ అరెస్ట్ చేసిన కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. అయితే, అది చట్టవిరుద్దమని పేర్కొంటూ వేసిన వివిధ పిటిషన్లను దిల్లీ హైకోర్టు ఇప్పటికే తిరస్కరించింది.
‘గవర్నర్కు మా సూచనలు అవసరం లేదు. అతనికి సలహా ఇవ్వడానికి మేము లేము. చట్టానికి లోబడి ఆయన చేయాల్సిందంతా చేస్తారు’ అని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. కాగా, 2019లోనూ క్రిమినల్ కేసులో కేజ్రీవాల్ విచారణ ఎదుర్కొంటున్నప్పుడు కోర్టు ఇదే విధమైన పిటిషన్ను కొట్టివేసింది. ‘ప్రాసిక్యూషన్ ఇంకా కొనసాగుతోంది. ఆయన నిర్దోషిగా బయటపడొచ్చు.. అప్పుడు మీరు ఏమి చేస్తారు? అతను దోషిగా తేలిన తర్వాత రండి’ అని నాటి దిల్లీ ప్రధాన న్యాయమూర్తి రాజేంద్ర మీనన్ నేతృత్వంలోని ధర్మాసనం మండిపడిరది. కాగా, రెండు రోజుల క్రితం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు 21 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.