. ఇంట్లోనే అదుపులోకి తీసుకున్న ఈడీ
. ఆప్ అధినేతను ప్రశ్నిస్తున్న అధికారులు
. పెద్ద ఎత్తున భద్రతా బలగాల మోహరింపు
. భారీగా చేరుకున్న ఆప్ నాయకులు, కార్యకర్తలు
. సీఎం నివాసం వెలుపల నిషేధాజ్ఞలు
. దిల్లీలో ఉద్రిక్తత
న్యూదిల్లీ: ప్రతిపక్ష నాయకుల గొంతునొక్కడమే ధ్యేయంగా పెట్టుకున్న కేంద్రంలోని మోదీ సర్కారు సార్వత్రిక ఎన్నికల వేళ దర్యాప్తు సంస్థలతో వేధించే కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. తాజాగా దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు దిల్లీలో అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మొదట కేజ్రీవాల్ నివాసంలో సోదాలు చేపట్టిన అధికారులు… ఆ తర్వాత విచారణ కోసం తమ కార్యాలయానికి రావాలంటూ ఆయనపై ఒత్తిడి తెచ్చారు. తన నివాసంలోనే విచారించుకోవాల్సిందిగా కేజ్రీవాల్ తేల్చిచెప్పడంతో ఆయన్ను విచారించడం ప్రారంభించారు. రెండుగంటల పాటు ప్రశ్నించిన అనంతరం చివరకు ఇంట్లోనే ఆయన్ను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. గురువారం రాత్రి ఏ సమయంలోనైనా కేజ్రీవాల్ను ఈడీ కార్యాలయానికి తరలించనున్నారు. శుక్రవారం ఆయన్ను దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తారని తెలిసింది. సీఎం నివాసానికి ఈడీ అధికారులు వచ్చారని తెలుసుకున్న ఆప్ శ్రేణులు పెద్దసంఖ్యలో ఆయన నివాసం వద్దకు చేరుకుని ఆందోళన ప్రారంభించడంతో దిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
నాటకీయ పరిణామాలు
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలన్న సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తిని దిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన వెంటనే పరిణామాలు వేగంగా మారిపోయాయి. గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో 12 మంది ఈడీ అధికారుల బృందం సీఎం కేజ్రీవాల్ నివాసానికి చేరుకుంది. వారిని ప్రశ్నించిన కేజ్రీవాల్ భద్రతా సిబ్బందికి సెర్చ్ వారెంట్తో వచ్చినట్లు తెలిపిన ఈడీ అధికారులు ఇంట్లోకి వెళ్లి సోదాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ నివాసానికి దారితీసే అన్ని దారుల్ని మూసివేశారు. 144 సెక్షన్ విధించారు. కొంతసేపటి తర్వాత వచ్చిన మరో ఈడీ బృందం కేజ్రీవాల్ను విచారణకు ఈడీ కార్యాలయానికి రావాల్సిందిగా కోరారు. తాను రానని… ఇక్కడే విచారణ చేసుకోవాలని కేజ్రీవాల్ చెప్పడంతో ఆయన నివాసంలోనే పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 50 కింద ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కేజ్రీవాల్ సెల్ఫోన్ను ఈడీ అధికారులు స్వాధీనపర్చుకున్నారు. ఈ స్థితిలో ఏ క్షణంలోనైనా కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేస్తారన్న వార్తలు జోరందుకున్నాయి. సీఎం ఇంటివద్ద భారీగా పోలీసులు మోహరించడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఎం నివాసానికి ఆప్ నేతలు, పెద్ద సంఖ్యలో ఆప్ కార్యకర్తలు తరలివచ్చి నిరసన తెలిపారు. మోదీ నిరంకుశత్వం నశించాలని నినాదాలు చేశారు. ‘పోలీసులు లోపలికి వెళ్లడం, ఎవరినీ లోపలికి అనుమతించకపోవడాన్ని బట్టి చూస్తుంటే సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేయాలని వారు ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది. ప్రజలంతా కేజ్రీవాల్కు అండగా ఉంటారు’ అని దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు. కాగా కేజ్రీవాల్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు జరపడాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్సింగ్ మాన్ తీవ్రంగా ఖండిరచారు.
కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయరు: స్పీకర్
కేజ్రీవాల్ను అరెస్టు చేయడానికి కొన్ని నిమిషాల ముందు ఢల్లీి అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసినా ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయరని తెలిపారు. ఎన్నికలకు ముందు ఆయన గొంతు నొక్కేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆయనను అరెస్ట్ చేస్తే జైలు నుంచి దిల్లీని పరిపాలన చేస్తారని సాయంత్రమే చెప్పారు.
హైకోర్టులో లభించని ఊరట…సుప్రీంను ఆశ్రయించిన కేజ్రీవాల్
మరోవైపు, మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్కు దిల్లీ హైకోర్టులో గురువారం ఊరట లభించలేదు. ఈ కేసులో ఆయనకు అరెస్టు నుంచి మినహాయింపు కల్పించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రస్తుతం ఈ కేసు పురోగతి దృష్ట్యా ఇందులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పిన నేపథ్యంలో వెంటనే ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఇంటికి రావడంతో ఆయన్ను అరెస్టు చేస్తారేమోనన్న వార్తలు కలకలం రేపాయి. కాగా దిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ… కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం విధానం కేసులో మధ్యంతర ఉపశమనం కల్పిస్తూ ఆదేశాలిచ్చేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని ఆయన న్యాయవాదులు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్చి విచారణ జరిపించేందుకు లీగల్ టీమ్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాగా కేజ్రీవాల్ పిటిషన్పై శుక్రవారం సుప్రీంలో విచారణ జరిగే అవకాశం ఉంది. మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే తొమ్మిది సార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ హాజరయ్యేందుకు నిరాకరించారు. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ కేజ్రీవాల్ను విచారించింది. గతేడాది ఏప్రిల్లో 9 గంటల పాటు ప్రశ్నించారు.