ఈడీ స్పందన కోరిన దిల్లీ కోర్టు
న్యూదిల్లీ : మద్యం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ కోరుతూ దాఖలైన పిటిషన్పై జూన్ 1న రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. మనీలాండ రింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వాలా వద్దా అన్న అంశమై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్పందనను న్యాయస్థానం కోరింది. ఇందుకు శనివారం వరకు సమయం ఉన్నట్లు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ధర్మాసనం తెలిపింది. ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ను మరోవారం పొడిగించాలని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పైనా ఈడీ వైఖరిని తెలియజేయాలని కోర్టు పేర్కొంది. కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ శుక్రవారంతో ముగియనుంది. ఇదిలావుంటే జూన్ 9వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ పొడిగించాలని కేజ్రీవాల్ పిటిషన్ పెట్టుకోగా దీనిపై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. దీంతో జూన్ 2న తీహార్ జైలులో కేజ్రీవాల్ లొంగిపోవల్సి ఉన్నది.
వైద్యులు సూచన మేరకే: అతిశీ
కేజ్రీవాల్ ఈడీ కస్టడీ, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు ఏడు కిలోల బరువు తగ్గారని, దీనిపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారని విలేకరుల సమావేశంలో దిల్లీ మంత్రి అతిశీ తెలిపారు. కస్టడీ నుంచి బయటకు వచ్చి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నప్పటికీ కేజ్రీవాల్ బరువు పెరగలేదని చెప్పారు. ఇంతకుముందు జరిపిన పరీక్షల్లో ఆయన శరీరంలో కీటోన్ స్థాయి గరిష్ఠంగా ఉన్నట్లు తేలిందన్నారు. బరువు తగ్గిపోవడం, కీటోన్ స్థాయి ఎక్కువగా ఉండటమంటే మూత్రపిండాలు దెబ్బతినడం లేక కేన్సర్ వంటి వ్యాధికి సంకేతం కావచ్చని అతిశీ తెలిపారు. ఆయన పెట్ స్కాన్లు, ఇతర పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించినందునే మధ్యంతర బెయిల్ను పొడిగించాలని కోరుతూ కేజ్రీవాల్ కోర్టును ఆశ్రయించినట్లు ఆమె తెలిపారు.