Monday, October 28, 2024
Monday, October 28, 2024

గుండ్రేవులకు మోక్షం ఎన్నడు?

సాగు, తాగునీటి కోసం సీమ ప్రజల ఎదురుచూపు

విశాలాంధ్ర బ్యూరో – కర్నూలు: గుండ్రేవుల ప్రాజెక్టు కర్నూలు, కడప జిల్లాల రైతుల జీవనాడి…ఈ ప్రాజెక్టు పూర్తయితే కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంత బీడు భూములను సస్యశ్యామలం అవడంతోపాటు కర్నూలు -కడప కాలువ కింద ఉన్న పూర్తి స్థాయి ఆయకట్టుకు సరిపడా నీరు ఇవ్వొచ్చు. అలాంటి రెండు జిల్లాలకు జీవనాడి ఆయిన ఈ ప్రాజెక్టు ప్రారంభంలోనే ఆగిపోయింది. ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసినా నిధులు లేక పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తమ బీడు భూములు సాగుభూములవుతాయని అన్నదాతలు ఆశిస్తున్నారు. పాలకులు మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టడం లేదు. ఎప్పుడు పనులు మొదలు పెడతారో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిన గుండ్రేవుల ప్రాజెక్టు గోడు పై ‘విశాలాంధ్ర’ ప్రత్యేక కథనం… రాష్ట్రంలో కర్నూలు, కడప ఈ రెండు జిల్లాల్లో వర్షాలు సమృద్ధిగా కురిస్తే తప్ప పంటలు పండే పరిస్థితి లేదు. ఇక్కడి రైతులకు సాగు, తాగు నీరు అందించే కేసీ కెనాల్‌ కు కూడా పూర్తి స్థాయిలో నీరు అందడం లేదు. ఈ కాలువ కు నీరు అందించే సుంకేశుల డ్యామ్‌ నీటి సామర్థ్యం కేవలం 1.2 టీఎంసీ లు మాత్రమే ఉండటంతో ఈ కాలువ కింద కర్నూలు, కడప జిల్లాలో ఉన్న 2.65 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు పూర్తి స్థాయిలో అందించలేని పరిస్థితి ఉంది. కేసీ కెనాల్‌ కు పూర్తి స్థాయిలో నీరు అందించాలన్నా… కర్నూలు జిల్లాలో కరువు కాటకాలతో నిత్యం వలసలు పోతూ అల్లాడుతున్న పశ్చిమ ప్రాంతానికి తాగు, సాగు నీరు అందించాలన్నా తుంగభద్ర నదిపై గుండ్రేవుల వద్ద ఆనకట్ట ప్రాజెక్టు నిర్మించడమే ఏకైక పరిష్కారం అని సాగునీటి రంగ నిపుణులు సూచించారు.
2013లో డీపీఆర్‌కు నిధులు కేటాయించిన ప్రభుత్వం
సీ.బెలగల్‌ మండలం గుండ్రేవుల దగ్గర 20 టీఎంసీ ల సామర్థ్యంతో రిజర్వాయర్‌ ఏర్పాటు చేయడానికి డీపీఆర్‌ (వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక)తయారీకి అప్పటి ప్రభుత్వం రూ.54.95 లక్షలకు పరిపాలన ఆమోదం ఇచ్చింది. 2013 నవంబర్‌ 1న ఐ అండ్‌ క్యాడ్‌ డిపార్ట్‌మెంట్‌ టెండర్లను కూడా ఆహ్వానించి హైదరాబాద్‌ కు చెందిన ఏఆర్వీఈఈ అసోసియేట్స్‌ కు కాంట్రాక్టును అప్పగించారు. ఈ సంస్థ సర్వే, విచారణ పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్మాణం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ముడిపడి ఉంది. ఈ ప్రాజెక్టు ఇరు రాష్ట్రాల సమన్వయంతో నిర్మించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు నిర్మిస్తే… ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కర్నూలు జిల్లాలోని సంగాల, కొత్త సంగాల, తిమ్మన దొడ్డి, పలుకుదొడ్డి చింతమన పల్లి, రాయచోటి, గురుజాల, నాగలదిన్నే ఇలా 10 గ్రామాలు, తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో పెద్ద దన్వాడ, వేణి, సోమాపురం, కేశవరం గ్రామాలు పూర్తిగా మునిగి పోతాయని నివేదిక ఇచ్చారు. అలాగే కర్నూలు జిల్లాలో చెరువు పల్లి, చామల గూడూరు, పెద్ద కొట్టాల, జోహరాపురం, మహబూబ్‌ నగర్‌ జిల్లాలో కటుకునురు, కిసాన్‌ నగర్‌ గ్రామాలు పాక్షికంగా ముంపుకు గురవుతాయని నివేదించారు. 20 టీఎంసీ ల సామర్థ్యంతో గుండ్రేవుల రిజర్వాయర్‌ నిర్మాణానికి సంబంధించి 2015 అక్టోబర్‌ 13న డీపీఆర్‌ను చీఫ్‌ ఇంజనీర్‌, ఇంటర్‌ స్టేట్‌ అండ్‌ వాటర్‌ రిసోర్స్‌, హైదరాబాద్‌ వీడ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ (పి), ఇరిగేషన్‌ కర్నూల్‌ ఎల్‌ ఆర్‌ నెం. సీఈ (పీ)కి సమర్పించారు.
సుంకేశుల బ్యారేజ్‌ కి తుంగ భద్ర నదిపై అదనపు రిజర్వాయర్‌ కోసం ప్రభుత్వం సూత్ర ప్రాయంగా పరిపాలనా ఆమోదం తెలుపుతూ 2019 ఫిబ్రవరి 21 న జీవో ఆర్టీ నేం.154 జీవో జారీ చేసింది. అంతేకాక అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కోడుమూరు సమీపంలో శంకుస్థాపన చేసి శిలాఫలకం కూడా ప్రారంభించారు. అలాగే ఏపీ ప్రభుత్వం మెమో నం.2821255/సీఈఎస్‌ ఈ ఎస్టిటి/2019, 28.08.2019 డబ్ల్యు అర్‌( సీఈఎస్‌ ఈఎస్టీటీ)శాఖ ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలో ఈ ప్రాజెక్టును చేర్చింది. అలాగే కేంద్రం 2020 అక్టోబర్‌ 06న నీటి సమస్యల పై అపెక్స్‌ సమావేశం ఏర్పాటు చేసింది. కానీ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు నిర్మాణం గురించి సమావేశంలో చర్చకు కూడా తీసుకురానట్టు తెలిసింది.
ఏళ్లు గడుస్తున్నా ముందుకు సాగని పనులు
2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగిన తరువాత నూతనంగా ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్‌లో మొదటి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నాడు సీఎం చంద్రబాబునాయుడు రాయలసీమకు ముఖద్వారమైన కర్నూలులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కర్నూలు జిల్లా ప్రజలకు జీవనాడి అయిన గుండ్రేవుల , వేదవతి ప్రాజెక్టులు నిర్మిస్తామని హామీ కూడా ఇచ్చారు. ఆ తరువాత 2015 లో ప్రాజెక్టు డీపీఆర్‌ ను ఆమోదించినా… 2019 ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో చేర్చినా… ఇంత వరకు పనులు ప్రారంభం కాలేదు. 2019 రాష్ట్రంలో టీడీపీ అధికారం కోల్పొయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈ ప్రాజెక్టు పనులు ఎప్పుడు మొదలు అవుతారో కూడా తెలియని పరిస్థితి. నాడు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో తో ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తి చేస్తారని రైతన్నలు భావించారు. అయితే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. 2024 ఎన్నికలలో మరోసారి టీడీపీ అధి కారంలోకి వచ్చింది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో రాష్ట్ర సీఎం చంద్రబాబుకు మంచి సంబంధాలు ఉండటంతో ప్రాజెక్టు నిర్మాణంకు ఎటువంటి అడ్డంకులు ఉండవని సీమ ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా మంత్రిగా ఎన్నికైన యువనేత టీజీ భరత్‌ తోపాటు ప్రజాప్రతిని ధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చి గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img