. టెట్ ఫలితాలకూ బ్రేక్
. ఎన్నికల కోడ్ ముగిశాకే పరీక్షలు
. ఈసీ ఆదేశాలతో నిలిచిన ప్రక్రియ
. నిరుద్యోగులకు నిరాశ
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఏపీ డీఎస్సీ వాయిదా పడిరది. ఎన్నికల కోడ్ ముగిసేంత వరకు డీఎస్సీ వాయిదా వేయాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీ) ఆదేశించింది. ఏపీ టెట్ 2024 ఫలితాలను కూడా ఎన్నికల తర్వాతే ప్రకటించాలని సూచించింది. దీంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఏపీ టెట్కు దాదాపు 3 లక్షల మందికిపైగా అభ్యర్థులు ఫలితాల కోసం వేచిస్తున్నారు. అందులో ఇప్పటికే చాలా మంది అర్హత సాధించి, వెయిటేజీ స్కోరు పెంచుకునేందుకుగాను పెద్దఎత్తున టెట్ రాశారు. అదేస్థాయిలో డీఎస్సీ పరీక్షకు దరఖాస్తులు పోటెత్తాయి. 6,100 పోస్టులతో డీఎస్సీ రావడంతో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఉత్సాహంగా శిక్షణ ప్రారంభించారు. అదేసమయంలో మరికొందరు ఉపాధ్యాయ పోస్టులను మరిన్ని పెంచి జంబో డీఎస్సీ ఇవ్వాలని కొద్దిరోజులు ఉద్యమించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల షెడ్యూలు వచ్చే కొన్ని వారాల ముందు ఏపీ టెట్ 2024, ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్లు ఏకకాలంలో విడుదల చేసింది. టెట్ పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసుకుని… డీఎస్సీ పరీక్షలకు ప్రభుత్వం షెడ్యూలు జారీజేసింది. టెట్, డీఎస్సీ పరీక్షల షెడ్యూలు రావడంతో అందరూ పూర్తిస్థాయిలో పరీక్షలకు సిద్ధమయ్యారు. ఇంతలో కొందరు అభ్యర్థులు న్యాయపరమైన సమస్యలపై హైకోర్టును ఆశ్రయించగా టెట్ ఫలితాల వెల్లడికి బ్రేక్ పడింది. దాని ప్రభావంతో ముందస్తుగా ప్రకటించిన షెడ్యూలు ఆధారంగా డీఎస్సీ నిర్వహించలేకపోయారు. ఏపీ టెట్, డీఎస్సీకి మధ్య కనీసం నెల రోజుల వ్యవధి కావాలని హైకోర్టును అభ్యర్థులు ఆశ్రయించడం, వారికి అనుకూలంగా హైకోర్టు ఆదేశాలివ్వడంతో టెట్, డీఎస్సీ పరీక్షలు సవ్యంగా కొనసాగలేదు. టెట్ ఫలితాలను ఈనెల 14వ తేదీన విడుదల చేయాల్సి ఉండగా ఈసీ అనుమతి కోసం అధికారులు వేచి ఉన్నారు. అటు డీఎస్సీకి ఈనెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు షెడ్యూలు జారీజేసినప్పటికీ దాని ప్రక్రియ ముందుకెళ్లలేదు. ఈ క్రమంలో ఏపీ టెట్ ఫలితాల విడుదలకు, డీఎస్సీ పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎన్నికల సంఘానికి ఇటీవల పాఠశాల విద్యా కమిషనర్ సురేశ్కుమార్ లేఖ రాశారు. ఈసీ నుంచి అనుమతి వస్తే…టెట్ ఫలితాలు ప్రకటించి, డీఎస్సీ పరీక్షల షెడ్యూలుకు తగిన ప్రణాళిక రూపొందించారు. ఈసీ అందుకు నిరాకరించడంతో ఎన్నికల కోడ్ ముగిశాకే టెట్ ఫలితాలను, డీఎస్సీ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరముంది. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లు మూడు నెలల ముందు ప్రకటించి ఉంటే ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే నాటికి నియామక ప్రక్రియ పూర్తయ్యేది. ఇందులో విద్యాశాఖాధికారులు, ప్రభుత్వం మధ్య సమన్వయం లోపించినట్లుగా కన్పిస్తోంది. దాదాపు ఐదేళ్ల నుంచి డీఎస్సీ కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. 2018లో చంద్రబాబు ప్రభుత్వం ఇదే తరహాగా అతి తక్కువ పోస్టులతో డీఎస్సీ ఇచ్చింది. ఆ పోస్టులను వైసీపీ ప్రభుత్వం వచ్చాక భర్తీ చేసింది. జగన్ నాడు పాదయాత్ర సమయంలో ఏటా పదివేల పోస్టులతో జంబో డీఎస్సీ ఇస్తానని నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగా టెట్, డీఎస్సీ పరీక్షలకు ప్రభుత్వం సన్నద్ధమవ్వగా కరోనా కారణంగా వాటి ప్రక్రియ నిలిచిపోయింది. అనంతరం ఎన్నికల నోటిఫికేషన్కు ముందు టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లు ఏకకాలంలో ప్రభుత్వం విడుదల చేయగా, వాటి ప్రక్రియకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఎంతో కష్టపడి, డబ్బులు వెచ్చించి ప్రైవేట్ ఇనిస్టిట్యూట్లో శిక్షణ పొందుతున్న తాము తీవ్రంగా నష్టపోయామని ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులు వాపోతున్నారు.