. మద్యం కేసులో లభించని ఊరట
. 15 వరకు జైల్లోనే దిల్లీ సీఎం
. విచారణకు సహకరించలేదన్న ఈడీ
న్యూదిల్లీ: మద్యం కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఊరట లభించలేదు. రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి కస్టడీని పొడిగించింది. ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో కేజ్రీవాల్ను తీహార్ జైలుకు తరలించారు. మార్చి 21న కేజ్రీవాల్ అరెస్టు కాగా తొలుత వారం రోజులు ఆపై మరో నాలుగు రోజుల పాటు ఆయనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది. కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్ను భారీ బందోబస్తుతో సోమవారం కోర్టు ఎదుట హాజరుపర్చగా 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అంతకుముందు ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు, కేజ్రీవాల్ తరపున విక్రమ్ చౌదరి, రమేశ్ గుప్తా వాదనలు వినిపించారు. విచారణకు కేజ్రీవాల్ సహకరించడం లేదని అడిగిన ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వడం లేదని తెలిపారు. దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా డిజిటల్ పరికరాల పాస్వర్డ్స్ వెల్లడిరచం లేదన్నారు. జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం… కేజ్రీవాల్కు అవసరమైన మందులు ఇవ్వాలని, సీసీటీవీ కవరేజి ఉండే ప్రాంతంలో ఆయనను విచారించాలని ఈడీకి ఆదేశాలిచ్చింది.
ప్రధాని చేస్తున్నది దేశానికి మంచిది కాదు: కేజ్రీవాల్
కోర్టులో హాజరు పర్చడానికి ముందు కేజ్రీవాల్ మాట్లాడుతూ ‘ప్రధాని మోదీ చేస్తున్న చర్యలు దేశానికి మంచిది కాదు’ అని అన్నారు. అనంతరం విచారణకు హాజరైన ఆయన కోర్టు ముందుర మూడు విజ్ఞప్తులు ఉంచారు. జైలులో చదివేందుకు రామాయణం, భగవద్గీత, జర్నలిస్టు నీరజా చౌదరీ రాసిన ‘హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్’ పుస్తకాలు కావాలని కేజ్రీవాల్ కోరారు. గదిలో ఒక బల్ల, కుర్చీ, మందులు, డైట్ ప్రకారం ఆహారం ఇవ్వాలని, తాను ఎప్పుడూ ధరించే లాకెట్ను ధరించేందుకు అనుమతించాలని విన్నవించారు. అందుకు న్యాయస్థానం అంగీకరించింది.
విచారణలో ఆతిశి, భరద్వాజ్ పేర్లు చెప్పిన కేజ్రీవాల్ : ఈడీ
విచారణ సందర్భంగా మద్యం కేసు నిందితుడు విజయ్ నాయర్ గురించి కేజ్రీవాల్ను ప్రశ్నించామని ఈడీ తెలిపింది. విజయ్ తనకు రిపోర్టు చేయడని, మంత్రులు ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్కు నివేదించేవాడని కేజ్రీవాల్ చెప్పారని పేర్కొంది. తన క్యాంపు కార్యాలయంలో ఎవరున్నారనేది కూడా తెలియదన్నారని వెల్లడిరచింది. ఈ కేసుకు సంబంధించిన వివిధ వాట్సాప్ సంభాషణలు చూపించి ప్రశ్నిస్తే ఆయన సమాధానం ఇవ్వలేదని, ఉద్దేశపూర్వకంగానే పాస్వర్డ్లను చెప్పడం లేదని కోర్టుకు తెలిపింది. ఈవెంట్స్ కంపెనీ ‘ఓన్లీ మచ్ లౌడర్’ సీఈవో విజయ్ నాయర్ను ఈ కేసులో 2022లోనే అరెస్టు చేశారు. ఆప్తో కలిసి పనిచేస్తున్నారు. ఈ కేసులో ఇద్దరు మంత్రుల పేర్లు తొలిసారి ప్రస్తావనకు వచ్చాయి. ఆ సమయంలో వారు కోర్టురూమ్లోనే ఉన్నారు. గతంలో ఆప్ రాజ్యసభ ఎంపీ ఎన్డీ గుప్తా ఈడీ ఎదుట వాంగ్మూలం ఇచ్చే సమయంలోనూ ఆతిశి పేరును ఒకసారి ప్రస్తావించారు. గోవా పార్టీ ఎన్నికల ఇన్ఛార్జిగా ఆమె పనిచేశారని వెల్లడిరచారు.