. అరెస్టు తర్వాత కేజ్రీవాల్ తొలి స్పందన
. మోదీది అధికార దురహంకారం: సునీతా కేజ్రీవాల్
న్యూదిల్లీ : మద్యం కేసులో అరెస్టుకు గురైన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన జీవితం దేశానికి అంకితమని అన్నారు. జైల్లో ఉన్నానా… బయట ఉన్నానా అన్నది ముఖ్యం కాదని…. తానెక్కడ ఉన్నా తన జీవితం దేశానికే అంకితమంటూ అరెస్టు తర్వాత మొదటిసారి స్పందించారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆయనను శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచ్చారు. కేసు విచారణ తర్వాత తీర్పును న్యాయస్థానం రిజర్వులో పెట్టింది. కోర్టుకు తీసుకెళ్లే సమయంలో కేజ్రీవాల్ పై వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ అరెస్టుతో ప్రధాని మోదీపై ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. మోదీ అధికార దురహంకారంతో కేజ్రీవాల్ను అరెస్టు చేయించారని, అందరినీ తొక్కేయాలని అనుకుంటున్నారన్నారు. ‘మూడు సార్లు సీఎంగా ఎన్నికైన కేజ్రీవాల్ను కేవలం అధికార దురహంకారంతోనే మోదీ అరెస్టు చేయించారు.అందరినీ తొక్కేయాలని చూస్తున్నారు. తద్వారా దిల్లీ ప్రజలను మోసగించారు’ ఆమె వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ సాధారణ పౌరుడిగానూ, ముఖ్యమంత్రిగానూ దిల్లీ ప్రజలకు సేవ చేశారని తెలిపారు. ‘మీ సీఎం ఎప్పుడు మీ కోసమే ఆలోచించారు. శ్రమించారు. మీ వెంట నిలిచారు. జైల్లో ఉన్నా, బయట ఉన్నా ఆయన జీవితం దేశానికే అంకితం. ప్రజలకు అంతా తెలుసు. జైహింద్’ అని ఎక్స్లో పేర్కొన్నారు.