‘ఇండియా’ ముఖ్యమంత్రుల నిర్ణయం
న్యూదిల్లీ : కేంద్ర బడ్జెట్లో విపక్ష రాష్ట్రాలపై తీవ్ర వివక్ష ప్రదర్శించడాన్ని నిరసిస్తూ ఈనెల 27న జరగబోయే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించారు. ఫెడరలిజానికి వ్యతిరేకంగా బడ్జెట్లో వివక్షత చూపడాన్ని మఖ్యమంత్రులు తీవ్రంగా నిరసించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన 27న నీతి ఆయోగ్ సమావేశం జరగనున్నది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం సమావేశానికి వెళ్లి నేరుగా ప్రధానిని నిలదీయనున్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తానంటూ బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని గంటలకు కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ‘ఎక్స్’లో కర్నాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, సుఖ్విందర్ సింగ్ సుకు, రేవంత్ రెడ్డి కూడా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తారని పేర్కొన్నారు. రాజ్యాంగ సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రభుత్వ వైఖరి ఉన్నట్లు వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా తమ నిర్ణయాన్ని ప్రకటించారు.
మంగళవారం సాయంత్రం ఇండియా ఐక్య సంఘటన సమావేశంలో నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలన్న అంశం చర్చకు వచ్చింది. స్టాలిన్ నిర్ణయంతో మిగతా నాయకులు ఏకీభవించారు. దీంతో నీతి అయోగ్ సమావేశాన్ని ఐక్యంగా బహిష్కరించాలని నిర్ణయించారు.