. టీడీపీ`జనసేన గెలుపుతో రాష్ట్రంలో విధ్వంసానికి ముగింపు
. అరాచకాల జగన్ పార్టీని తరిమికొడదాం
. తాడేపల్లిగూడెం సభలో చంద్రబాబు
. సిద్ధం అన్నవారికి యుద్ధం ఇద్దాం: పవన్ కల్యాణ్
విశాలాంధ్రపెంటపాడు/తాడేపల్లిగూడెం: వైఎస్సార్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసమే టీడీపీ-జనసేన పార్టీలు కలిశాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన జగన్ పార్టీని ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెంలో టీడీపీ
జనసేన ‘తెలుగు జన విజయకేతనం జెండా’ పేరుతో బుధవారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తెలుగోడి రోషం ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని ఇంకా ఎలా దోచుకోవాలో జగన్ వద్ద స్కెచ్ ఉందని, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తమ వద్ద బ్లూప్రింట్ ఉందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజలు మాతో చేతులు కలపాలని, 2029కి విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని, హైదరాబాద్ కంటే మిన్నగా రాజధాని ఉండాలని అమరావతికి రూపకల్పన చేశామని తెలిపారు. ఏ సీఎం అయినా అభివృద్ధి పనులతో పాలన సాగిస్తారని, జగన్ సీఎం అయ్యాక అరాచకాలతో పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని జగన్ అపహాస్యం చేశారు. పెట్టుబడులు తెచ్చి రాష్ట్రంలో సంపద సృష్టిస్తామని, దోచుకున్న డబ్బులతో జగన్ మళ్లీ ప్రజల వద్దకు వస్తున్నారని అన్నారు. కావున వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో కీలకమని, వైఎస్సార్సీపీ దొంగలపై టీడీపీ-జనసేన పోరాడాలని సూచించారు. కూటమిలో ఎవరు ఎక్కువ.. తక్కువ కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల కోసం కలిసి అడుగులు వేస్తున్నామన్నారు. ‘‘టీడీపీ-జనసేన దెబ్బకు ఫ్యాన్ ముక్కలై పోవాలి. పొత్తు గెలవాలి.. రాష్ట్రం నిలవాలి. ఆంధ్రప్రదేశ్ ఇక అన్స్టాపబుల్. రాష్ట్రంలో విధ్వంసానికి ఫుల్స్టాప్ పడుతుంది. టీడీపీ – జనసేన విన్నింగ్ టీమ్… వైసీపీది చీటింగ్ టీమ్. టీడీపీ అగ్నికి పవన్ వాయువులా తోడయ్యారు. ఈ సభ చూశాక మా గెలుపు ఎవరూ ఆపలేరని అర్థమైంది’ అని ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే సంకల్పంతో ముందుకెళ్లామని, కానీ, రాష్ట్రంలో ఇప్పుడు సైకో పాలన ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వేధింపులు తట్టుకోలేక క్రికెటర్ హనుమ విహారి పారిపోయే పరిస్థితి వచ్చిందని, సొంత చెల్లి మరో పార్టీలో చేరితే సోషల్ మీడియాలో వేధించారని అన్నారు. జగన్ మానసిక స్థితికి ఈ ఘటనలే నిదర్శనమని, అందుకే, వైఎస్సార్సీపీని చిత్తుగా ఓడిరచి సైకో నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలలని పిలుపునిచ్చారు. జగన్ 25 ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు? తెచ్చారా? అంటూ ప్రశ్నించారు. కుప్పం ప్రాంతానికి నీళ్ల పేరిట జగన్ సినిమా నాటకాలు చేశారని, ఒక్క రోజులోనే అంతా సర్దుకొని పోయారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో తనకు లక్ష ఓట్ల మెజార్టీ వస్తుందని స్పష్టం చేశారు. జగన్ పాలన ఒక అట్టర్ఫ్లాప్ సినిమా అని, అలాంటి సినిమాకి సీక్వెల్ ఉంటుందా? అని ప్రశ్నించారు. టీడీపీ-జనసేన కూటమి సూపర్హిట్ సినిమా అని అన్నారు. జగన్ పార్టీ గూండాలకు తమ సినిమా చూపిస్తామని అన్నారు. రాష్ట్రం దశ దిశ మార్చే సభ ఇది అని పేర్కొన్నారు. తాడేపల్లి గూడెం సభతో తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోతుందని ఎద్దేవా చేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ సైకో పాలన లేదని, జగన్ ఏం పొడిచాడని అతనికి ఓటయ్యాలని ప్రశ్నించారు. వైనాట్ జాబ్ క్యాలెండర్, వైనాట్ ఉచిత ఇసుక, వైనాట్ మెగా డీఎస్సీ కి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అన్ని వర్గాలను జగన్ మోసం చేశారు: పవన్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్లోని అన్ని వర్గాలను జగన్ మోసం చేశారని, సిద్ధం అంటున్న ఆయనకు యుద్ధం ఇద్దామని పిలుపునిచ్చారు. ‘పర్వతం ఎవరికీ వంగి సలాం చేయదు. గొంతు ఎత్తితే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరు ఉంటుంది.. మన విజయానికి స్ఫూర్తి జెండా.. అందుకే జెండా పేరుతో సభను ఏర్పాటు చేశాం’ అని తెలిపారు. పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ సీట్లు, మూడు ఎంపీ స్థానాలు తీసుకుంటే… 24 సీట్లేనా అని వైసీపీ పక్షం ఎగతాళి చేసిందని పవన్ చెబుతూ… బలి చక్రవర్తి కూడా వామనుడిని చూసి ఇంతేనా అన్నాడని… నెత్తిన కాలుపెట్టి తొక్కితే ఎంతో తెలిసిందని అన్నారు. జగన్ను అథఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కాదంటూ ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. ‘కార్యకర్తలారా వ్యూహం నాకు వదలండి.. నన్ను నమ్మండి. అంకెలు లెక్కపట్టవద్దని విపక్షాలకు చెప్పండి. ఒక్కో ఇటుక పేర్చి ఇల్లు కడుతున్నా… కోట కూడా కడతాం. జగన్ తాడేపల్లి కోట కూడా బద్దలుకొడతాం. సలహాలు ఇచ్చేవాళ్లు అక్కర్లేదు…యుద్ధం చేసే వాళ్లు కావాలి’ అని పవన్ అన్నారు.
ఏపీ రోడ్లపై వెళ్లాలంటే రోజులు గడిచిపోయే పరిస్థితి ఉందని… ఐదుగురు రెడ్ల కోసం 5 కోట్ల ప్రజలు తిప్పలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో అయినా ఈ ఐదుగురే పంచాయితీ చేస్తున్నారు. మిగతా ఏ నాయకులకు ఎలాంటి హక్కులు లేవన్నారు. వైసీపీ గూండాలు టీడీపీ-జనసేన నాయకులను, శ్రేణుల్ని ఇబ్బంది పెడితే… ఊరుకోబోమని హెచ్చరించారు. ‘జగన్.. ఇప్పటి వరకు నా తాలూకా శాంతినే చూశావు.. ఇప్పుడు యుద్ధం చూస్తావ్. నాలుగు దశాబ్దాల రాజకీయ ఉద్ధండుడిని జైలులో పెడితే బాధ వేసింది. అందుకోసమే కూటమిని నేనే ప్రతిపాదించా. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం. నా నిర్ణయాలు పార్టీ, వ్యక్తి పరంగా ఉండవు, రాష్ట్ర లబ్ధికోసమే ఉంటాయి. టీడీపీ-జనసేన సహకరించుకుంటేనే ప్రజల భవిష్యత్తు బాగుంటుంది. కోట్లు సంపాదించే స్కిల్స్ ఉన్నా అన్నీ కాదనుకొని వచ్చా’ అని పవన్ చెప్పుకొచ్చారు. ఈ సభావేదికగా యుద్ధానికి శంఖారావం పూరిస్తున్నానని…. టీడీపీ-జనసేన గెలవాలి… జగన్ పోవాలి అన్నారు. వైసీపీ ట్రాప్లో పడి నన్ను ప్రశ్చింవద్దని నాయకులకు, కార్యకర్తలకు హితవు పలికారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే 24 సీట్లు తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు నాదెండ్ల మనోమర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు, తాడేపల్లిగూడెం జనసేన, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిలు బొలిశెట్టి శ్రీనివాస్, వలవల బాజ్జీ, సినీనటులు నందమూరి బాలకృష్ణ, నాగేంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, కొణతల రామకృష్ణ రెండు పార్టీలకు చెందిన అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జులు, నాయకులు, కార్యకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మహిళా నాయకులు, యువత, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభతో సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన ఇరుపార్టీలకు చెందిన అభిమానులు, కార్యకర్తలతో జెండా సభ జన సందోహంగా మారింది.