. ఇండియా కూటమి నేతల పిలుపు
. మైండ్గేమ్ ఆడుతున్న మోదీ: రామకృష్ణ
. మత చిచ్చుతో మోదీ రాజకీయ లబ్ధి: వైఎస్ షర్మిల
. ఏపీలో మూడు పార్టీలూ తొత్తులే: శ్రీనివాసరావు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ, ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని, దానికి మద్దతిస్తున్న వైసీపీని గద్దె దించాలని వక్తలు పిలుపునిచ్చారు. విజయవాడలోని బాలోత్సవ భవన్లో గురువారం ఇండియా భాగస్వామ్య, రైతు, కార్మిక, మహిళ, ప్రజాసంఘాల రౌంట్ టేబుల్ సమావేశం జరిగింది. రైతు నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, వి.శ్రీనివాసరావు, జై భారత్నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ సీనియర్ నేతలు తులసిరెడ్డి, సుంకర పద్మశ్రీ, మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు.
తొలుత వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి ‘అప్పుల్లో మొదటి స్థానం…ఆత్మ గౌరవంలో చివరి స్థానం’ అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. మరోసారి బీజేపీ అధ్వర్యంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చి మనువాద రాజ్యాంగాన్ని అమలు చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం భావ సారూప్యత గలన రాజకీయ పార్టీలతో పాటు ప్రజా, కార్మిక, మహిళా సంఘాలు ఉమ్మడిగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాహుల్గాంధీ ప్రధాని అయితేనే ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ఇతర విభజన హామీలన్నీ అమలవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
షర్మిలారెడ్డి మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయన్నారు. మతం పేరుతో చిచ్చు రేపుతూ ఆ మంటల్లో బీజేపీ నేతలు చలి కాగుతున్నారని మండిపడ్డారు. దేశాభివృద్ధి కోసం గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం చేసిన మంచి పని ఒక్కటీ లేదన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ మతాలు, కులాలు, ప్రాంతీయ విబేధాలు రెచ్చగొట్టి లబ్ధి పొందుతున్నారని, గోద్రా, మణిపూర్ లాంటి ఘటనలే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. అటువంటి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని విమర్శించారు. ఏపీకి తలమానికమైన విశాఖ ఉక్కును సైతం కట్టబెట్టేందుకు జగన్ సిద్ధపడ్డారని, ఎక్కువ ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తానని ప్రజలను నమ్మించి… ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. అందువల్ల అందరూ ఐక్యంగా పోరాడి బీజేపీ, వైసీపీ ప్రభుత్వాలను గద్దె దించాలని పిలుపునిచ్చారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ తమకు 370 నుంచి 400 ఎంపీ సీట్లు వస్తాయని మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. గత పదేళ్లలో ఈ దేశానికి ఏం చేశారని మళ్లీ మోదీని గెలిపిస్తారని ప్రశ్నించారు. రైతు, నిరుద్యోగ, మహిళా సమస్యలు, బ్లాక్ మనీ సమస్యలపై నోరు మెదపని మోదీ… 2014లో ఇచ్చిన హామీలపై ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాంతీయ పార్టీలను భయభ్రాంతులకు గురిచేయడం ద్వారా మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్, చంద్రబాబు కూడా భయపడే మోదీకి మద్దతు ఇస్తున్నారని, ఇక్కడ వైసీపీ, టీడీపీ, జనసేనల్లో ఏ పార్టీకి ఓటు వేసినా అది బీజేపీకి వేసినట్లేనని ప్రజలు గుర్తించాలని కోరారు. ఏపీకి తీరని అన్యాయం చేసిన బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని, వారు పోటీ చేసే ఆరు ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను చిత్తుగా ఓడిరచాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. తెలుగువారి కీర్తి ప్రతిష్ఠలను అంతర్జాతీయంగా తాకట్టు పెట్టిన ఘనత చంద్రబాబు, జగన్కే దక్కుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ తాజాగా పాల్గొన్న బహిరంగ సభలోనూ చంద్రబాబుకు ఓటేయాలని, జగన్ను గద్దె దించాలని ఎక్కడా చెప్పలేదని విమర్శించారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీకి తొత్తులుగా మారాయని, అటువంటి మూడు పార్టీలను బలపరచడానికి తెలుగు ప్రజలు సిగ్గు పడాలన్నారు.
లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ అధిక ధరలతో పేదలు తీవ్రంగా నష్ట పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి శత్రువు అయిన బీజేపీ, దాని మిత్రపక్షాలు, వైసీపీలపై ఉమ్మడిగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంతో పాటు దేశంలో జరుగుతున్న కీలక పరిణామాలను ఇండియా భాగస్వామ్య పక్షాలు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన పిలుపు నిచ్చారు. చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీతో పాటు దాని భాగస్వామ్య పక్షం అయిన ఎన్డీఏలోని పార్టీలను ఓడిరచకపోతే దేశం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. దేశంలోని 50 శాతం కంటే ఎక్కువ ప్రజలు ఇండియా భాగస్వామ్య పక్షాలతోనే ఉన్నారని, వీరంతా ఐక్యంగా మోదీని గద్దె దించేవరకు పోరాడాలన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఏపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ డాక్టర్ ఎన్.తులసి రెడ్డి, ప్రముఖ ఇంజనీర్ కేఎల్ రావు కుమారుడు విజయరావుతో పాటు ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు.