. ముమ్మాటికీ ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
. దాతల వివరాలు ఈసీకి ఇవ్వాలి
. మార్చి 13 నాటికి ఈసీ వెబ్సైట్లో పెట్టాలి
. ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు
న్యూదిల్లీ : రాజకీయ పార్టీలకు విరాళాలుగా అందే ఎన్నికల బాండ్లు ఇక చెల్లవని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఎన్నికల బాండ్ల పథకాన్ని గురువారం నిలువరించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని… వాక్భావ వ్యక్తీకరణ
సమాచార హక్కుల ఉల్లంఘనగా పేర్కొంది. ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. దీంతో సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్రప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగినట్లు అయింది. బాండ్ల రూపేణ ఆరేళ్లలో జరిగిన లావాదేవీల వివరాలన్నింటినీ ఎన్నికల కమిషన్కు తెలియజేయాలని ఎస్బీఐకి సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టంచేసింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయి, జేడీ పార్దివాలా, మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్నారు. ఎస్బీఐ తెలిపే వివరాలను మార్చి 13వ తేదీ నాటికి తమ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని ఎన్నికల కమిషన్కు సూచించింది. అజ్ఞాత బాండ్ల స్వీకరణను సమాచార హక్కు ఉల్లంఘనగా పేర్కొంది. నల్లధనాన్ని అరికట్టేందుకు ఎన్నికల బాండ్లు ఒక్కటే మార్గం కాదని వెల్లడిరచింది. దాతల పేర్లు గోప్యంగా ఉంచడం తగదని, అలా చేయడం ఆదాయపు పన్ను చట్టాన్ని అతిక్రమించడమే అవుతుందని ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలోని అధికరణ 19(1)(ఎ) కింద భావ ప్రకటన, వాక్ స్వేచ్ఛలను ఈ బాండ్ల ద్వారా అతిక్రమిస్తున్నట్లు తెలిపింది. రాజకీయ పార్టీలకు విరాళాలు క్విడ్ ప్రోకోకు దారితీస్తాయని, దాతల వివరాలు రహస్యంగా ఉంచడం సమంజసం కాదని, ఈ పథకాన్ని నిలిపివేస్తున్నామని, ఇప్పటివరకు సేకరించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. గతేడాది నవంబరులోనే ఈ కేసు విచారణ ముగియగా, తీర్పును రిజర్వులో ఉంచిన కోర్టు దానిని గురువారం వెలువరించింది. ‘మేము ఏకగ్రీవంగా తీర్పునిచ్చాం. జస్టిస్ సంజీవ్ ఖన్నాతో అభిప్రాయ భేదం వచ్చినా… చివరికి ఏకాభిప్రాయం కుదిరింది’ అని సీజేఐ తెలిపారు. వ్యాపార ప్రయోజనాల కోసం ఎన్నికల బాండ్లు దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని, పాలక పార్టీలకు అనుకూలంగా లేదా క్విడ్ ప్రోకోకు దారితీసే ముప్పు ఉందని ఆయనన్నారు. ఇందుకు ఉదాహరణగా ‘ఏ అనే కేవైసీ కలిగిన వ్యక్తి పేరుతో బీ అనే వ్యక్తి ఓ పార్టీకి రూ.100 కోట్ల విరాళం ఇస్తే, అతడు దాని కోసం సదరు వంద కోట్లను ఒక్కొక్కరి నుంచి కోటి చ్పొున సేకరిస్తే ఇది అక్రమమే అవుతుంది కదా’ అని అన్నారు. కేవైసీ కలిగిన ఖాతాదారుల ద్వారా ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయించడం, అజ్ఞాత దాతలు ఉండటం వల్ల రాజకీయ పార్టీలతో వారి క్విడ్ ప్రోకోకు సంబంధించి ప్రశ్నలు రావని జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. ఈ విరాళం ఎక్కడి నుంచి వచ్చిందనేది పార్టీకి తెలుస్తుందని, ప్రజలకు మాత్రమే తెలియదని సీజే చంద్రచూడ్ తెలిపారు. పార్టీలకు అందే నిధుల్లో పారదర్శకత కోసం 2018 జనవరి 2న అమల్లోకి వచ్చిన ఈ పథకాన్ని సవాల్ చేస్తూ ఏడీఆర్, కాంగ్రెస్ నేత జయా ఠాకుర్, సీపీఎం, మరో పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల బాండ్లను ప్రారంభించడానికి ముందే ఈ పథకంపై సమగ్ర విచారణ అవసరమని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ క్రమంలో దీనిపై విచారించింది. సంచలన తీర్పునిచ్చింది.
ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
సుప్రీంకోర్టు తాజా తీర్పు కేంద్రప్రభుత్వానికి ఎదురు దెబ్బగా జయా ఠాకూర్ తరపున న్యాయవాది వరుణ్ ఠాకూర్ అన్నారు. ‘ఈ తీర్పు కేంద్రానికి ఎదురు దెబ్బ. 2018 నుంచి 2024 వరకు జరిగిన లావాదేవీలన్నింటిని బహిర్గతం చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ పథకం ద్వారా అజ్ఞాతంగా సేకరించిన నిధులన్నీ ప్రజల ముందరకు రావాలి కాబట్టి జవాబుదారీతనం పెరుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్పవచ్చు’ అని అన్నారు. ఏడీఆర్కు తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందిస్తూ బాండ్ల పూర్తి వివరాలు తెలపాలని ఎస్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించిందని, ఆ వివరాలను తమ వెబ్సైట్లో ఉంచాలని ఈసీకి స్పష్టంచేసిందని తెలిపారు. తద్వారా ఎవరు బాండ్లు కొనుగోలు చేశారన్నది ప్రజలకు తెలుస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు తాజా తీర్పు ఓ మైలురాయి అని ఆయనన్నారు.