విశాలాంధ్ర – విజయవాడ : రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన కొనసాగుతోంది. ట్రాన్స్కో, జెన్కో, డిస్కంల ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 9న పెన్డౌన్, సెల్ఫోన్ డౌన్ చేయాలని విద్యుత్ ఉద్యోగులు నిర్ణయించారు. జులై నెలాఖరు నుంచి విద్యుత్ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న విషయం విదితమే. 9వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. 10 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ఉద్యోగులు హెచ్చరించారు. ఉద్యోగుల ఆందోళనతో విజయవాడలోని విద్యుత్ సౌధ పరిసరాల్లో పోలీసు బందోబస్తును విజయవాడ నగర డీసీపీ విశాల్ గున్నీ మంగళవారం పరిశీలించారు. ఉద్యోగుల ముసుగులో అసాంఘిక శక్తులు నగరంలోకి చొరబడి అలజడి సృష్టించే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా గస్తీ ఏర్పాటు చేసినట్లు డీసీపీ తెలిపారు. ఇదిలా ఉండగా విద్యుత్ ఉద్యోగ సంఘాలతో యాజమాన్యం చర్చలు జరుపుతోంది. ప్రభుత్వంతో చర్చించి సమస్యలను
పరిష్కరించటానికి కొంతసమయం ఇవ్వాలని, సమ్మెను వాయిదా వేయాలని ఉద్యోగ సంఘ నాయకులను యాజమాన్యం కోరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఉద్యోగులు సమ్మెకే మొగ్గు చూపుతున్నారు. యాజమాన్యం, ఉద్యోగులు ఎవరికి వారు ముందుకు వెళుతున్నారు.
సమ్మె నివారించాలి: ఓబులేసు
విద్యుత్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి సమ్మెను నివారించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మంగళవారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్ రంగంలో ఉన్న కొన్ని యూనియన్లు అసోసియేషన్లు కలసి పవర్ జేఏసీగా మరికొన్ని ట్రేడ్ యూనియన్లు కలిసి స్ట్రగుల్ కమిటీగా ఏర్పడి సమస్యలపై యాజమాన్యానికి, ప్రభుత్వానికి, కార్మిక శాఖకు చాలా రోజుల క్రితమే నోటీసులు ఇచ్చాయని తెలిపారు. అయినా యాజమాన్యం పట్టించుకోకుండా గత కొద్ది రోజులుగా చర్చల పేరుతో కాలయాపన చేస్తుందని విమర్శించారు. పైగా తాము ఇచ్చేది ఇంతే మీరు ఏమైనా చేసుకోండి మీరు వినకపోతే మన్మోహన్ సింగ్ కమిటీ రిపోర్టును ఏకపక్షంగా అమలు చేస్తామని ఉద్యోగులను బెదిరిస్తున్నారని తెలిపారు. దానికి ఉద్యోగ సంఘాలు అంగీకరించకపోతే విజిలెన్స్ ద్వారా మీరు తప్పుడు పనులు చేశారని చెప్పి పాత కేసులన్నీ బయట పెడతామని లేని విషయాలను తవ్వి తీయడానికి కుటిల ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలకు అనుభవం కలిగిన విద్యుత్ శాఖ ఇంధన శాఖ అధికారులు వంత పాడడం అన్యాయమని, ఇప్పటికైనా వెంటనే రెండు జేఏసీ లను విడివిడిగానైనా రెండు జేఏసీలను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కారం చేసి సమ్మె నివారించాలి కోరారు.