. మోదీ సర్కారును నిలదీసిన విపక్షాలు
. మాటలయుద్ధంతో దద్దరిల్లిన లోక్సభ
న్యూదిల్లీ : కేంద్రబడ్జెట్పై చర్చ సందర్భంగా రైతుల అంశం గురువారం లోక్సభను కుదిపేసింది. విపక్ష సభ్యులు ప్రత్యేకించి కాంగ్రెస్ సభ్యులు రైతుల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. మోదీ సర్కారు రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలుకు ముందుకు రావడం లేదని నిందించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న ప్రధాని మోదీ హామీ గాలిలో కలిసిపోయిందని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్పై చర్చ సందర్భంగా రైతుల సమస్యపై అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో భోజనానికి ముందు లోక్సభ రెండుసార్లు వాయిదా పడిరది. రైల్వే, ఆహారశుద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ, కాంగ్రెస్ ఎంపీ చరణ్జిత్ సింగ్ చన్నీ మధ్య మాటల యుద్ధం జరిగింది. కేంద్ర బడ్జెట్పై చర్చలో పాల్గొన్న చన్నీ… దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు… మోదీ సర్కారు వైఫల్యంపై విమర్శలు ఎక్కుపెట్టారు. రుణమాఫీ, పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ సహా కీలక సమస్యలపై రైతుల ఆందోళనను మోదీ సర్కారు నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఈ క్రమంలో బిట్టూ తాత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్యను ప్రస్తావించడంతో ఇటీవలే కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన బియాంత్ మనవడు బిట్టూ, చన్నీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. చన్నీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై బిట్టూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. దీంతో అధ్యక్ష స్థానంలో ఉన్న బీజేపీ ఎంపీ సంధ్యారే సభను 30 నిమిషాల పాటు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశం అయ్యాక… రక్షణ మంత్రి, లోక్సభలో బీజేపీ ఉపనేత రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ… సభ్యులు ఏవైనా అన్పార్లమెంటరీ వ్యాఖ్యలు చేసినట్లయితే వాటిని రికార్డుల నుంచి తొలగించి బడ్జెట్పై చర్చ కొనసాగించాలని స్పీకర్ను కోరారు. అప్పటికీ సభలో అలజడి తగ్గకపోవడంతో సభ గౌరవాన్ని కాపాడాలని స్పీకర్ ఓం బిర్లా అధికార, ప్రతిపక్ష సభ్యులను ఆదేశించారు. ముఖ్యంగా మంత్రులు నిబంధనలను ఉల్లంఘించకూడదని అన్నారు. అనంతరం చన్నీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. బుధవారం కొందరు రైతు నేతలతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిసిన విషయాన్ని ప్రస్తావించిన చన్నీ… ప్రధానిని కలిసేందుకు కూడా వారు సమయం కోరినట్లు తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోలేదని చన్నీ విమర్శించారు. వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ జోక్యం చేసుకుని, కాంగ్రెస్ ఎంపీ తాను చేస్తున్న ఆరోపణలను ప్రామాణీకరించాలని చెప్పి సభను తప్పుదోవ పట్టించారన్నారు. తన ప్రసంగాన్ని అధికారపార్టీ సభ్యులు అడ్డుకున్నారని, ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదని చన్ని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ సహా వివిధ డిమాండ్లు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై జాతీయ భద్రతా చట్టం నిబంధనలను ప్రయోగించారని దుయ్యబట్టారు. ఈ దశలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ… చన్నీ తన ఆరోపణలు ధృవీకరించాలని, ఆయన సభను తప్పుదారి పట్టించారని నిందించారు. చన్నీకి వ్యతిరేకంగా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలని స్పీకర్ను కోరారు. కాగా చన్నీ తన ప్రసంగాన్ని ముగించిన తర్వాత కూడా అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఎన్సీపీ సభ్యుడు సునీల్ దత్తాత్రేయ తన ప్రసంగాన్ని ప్రారంభించగా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ నిలబడి సభ్యుడి పక్కనే ఉన్న సీటును మంత్రిని తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంకా సీట్లు కేటాయించలేదని, మంత్రి ఎన్డీయే సభ్యులకు ఉద్దేశించిన సీటులో కూర్చున్నారని స్పీకర్ స్పష్టం చేశారు. దీంతో బెనర్జీ తాను కూడా వేరే సీటులో కూర్చుంటానని చెప్పి… అధికార పక్షం బెంచీల వైపు వెళ్లి కూర్చున్నారు. అనంతరం తిరిగి తన సీటుకు చేరుకున్నారు. ఆ తర్వాత సభలో గందరగోళం కొనసాగడంతో సభాపతి స్థానంలో ఉన్న జగదాంబిక పాల్ సభను మరోసారి వాయిదా వేశారు. మధ్యాహ్నం 3 గంటలకు సభ యథావిధిగా ప్రారంభమైంది.